డారెన్ సామీ: ఈ వెస్టిండీస్ క్రికెటర్ 'ఆగ్రహం' భారత్‌లో సామాజిక వాస్తవాలను బయటపెట్టిందా?

    • రచయిత, వందన విజయ్
    • హోదా, టీవీ ఎడిటర్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్

“నన్ను ఆ మాటతో పిలిచేటప్పుడు, నేను దానికి ‘బలమైన గుర్రం’ లేదా వేరే అర్థం ఏదో ఉంటుందిలే అనుకున్నాను. నన్ను అలా అనగానే అందరూ పగలబడి నవ్వేవారు. నా క్రికెట్ జట్టులో ఉన్న వాళ్లే నవ్వుతున్నారంటే అది కచ్చితంగా ఏదో వేళాకోళం విషయమే అయ్యుంటుంది అనిపించేది. అది ఎవరో మీకు తెలుసు. నేను మిమ్మల్ని నా సోదరుడిలా భావించేవాడిని”.

క్రికెటర్ డారెన్ సామీ చేసిన ఈ ప్రకటనలో అతడిని వారంతా అన్న ఆ మాట ‘కాలూ’.

అమెరికా సహా మొత్తం ప్రపంచమంతా జాతి వివక్షపై వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు, వెస్టిండీస్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న సామీ, భారత్‌లో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తనపట్ల చూపిన జాతివివక్ష వ్యాఖ్యల గురించి బయటపెట్టారు..

ఈ వ్యతిరేక ప్రదర్శనల కలకలం భారత్‌లో పెద్దగా కనిపించడం లేదు. కొంతమంది ఈ ఆరోపణలు విని కంగారు పడిపోయారు. కానీ భారత్‌లో ఇలాంటి ప్రవర్తన లేదా క్రికెట్‌లో జాతివివక్ష కొత్త విషయమేం కాదు.

ఫుట్‌బాల్‌లో తరచూ జాతివివక్ష బయటపడుతూనే వచ్చింది. కానీ, క్రిస్ గేల్ తన ఇన్‌స్టా పోస్టులో పెట్టినట్లు క్రికెట్‌లో దీని గురించి అంత బాహాటంగా మాట్లాడేవారు కాదు.

భారత్‌లో నివసించే నల్లవారు బహిరంగంగా జాతివివక్ష ఆరోపణలు చేస్తూ వచ్చారు. భారత్ అయినా, వేరే దేశమైనా క్రికెట్ దానికి అతీతం కాదు.

క్రికెట్‌లో జాతివివక్ష ఘటనల గురించి ఒక జాబితా తయారు చేస్తే ఈ ఆర్టికల్ మొత్తం ఆ కథలతోనే నిండిపోతుంది.

2019లో జరిగిన ఒక క్రికెట్ కామెంట్రీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు.

అక్కడ మైక్ నుంచి వస్తున్న శబ్దాలను బట్టి అతడు దక్షిణాఫ్రికా ఆటగాడిని ఉద్దేశించి ఒక తప్పు మాటను ప్రయోగించినట్లు తెలుస్తుంది.

అదే మాట గురించే, ఇప్పుడు సామీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఆశ్చర్యకరంగా, కామెంట్రీ బాక్సులో కూర్చున్న రమీజ్ రాజాను మిగతా కామెంటరేటర్లు అదే విషయం అడిగినప్పుడు, ఆయన నవ్వేసి ఊరుకుంటారు.

అయితే సర్ఫరాజ్‌పై నిషేధం కూడా విధించారు. కానీ, ఇక్కడ ప్రశ్న మానసికతకు సంబంధించినది. మైదానంలో ఒక ఆటగాడికి, మరో ఆటగాడితో సమాన హోదా ఉంటుంది. కానీ అతడు రంగు గురించి మాట్లాడకుండా ఆటగాడిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేడు.

చర్మం రంగుపై వ్యాఖ్యలు

భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లపై జాతివివక్ష ఆరోపణలు వచ్చాయంటే, గోధుమ వర్ణం, నల్ల రంగు కంటే మెరుగైనదని నిరూపించే ప్రయత్నం చేస్తుంటారని అర్థం చేసుకోవాలి.

తెల్ల క్రికెటర్లపై ఇవే ఆరోపణలు వచ్చినపుడు, వారు గోధుమ, నల్ల రంగులో ఉన్న వారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

2008 మంకీగేట్ మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ మీద జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని భారత ఆటగాడు హర్భజన్ సింగ్ మీద ఆరోపణలు వచ్చాయి. భారత్ ఆ టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరించింది. దాంతో హర్భజన్ మీద ఆ ఆరోపణలు తొలగించారు.

జాతివివక్ష ఆరోపణలు అంతకు ముందు నుంచే ఉన్నాయి. ఆ తర్వాత కూడా నల్ల ఆటగాళ్లు వీటికి చాలాసార్లు లక్ష్యంగా మారారు.

ఈ జాతి వివక్ష వ్యాఖ్యలు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుంచే కాదు, క్రికెట్ ప్రేక్షకుల మధ్య నుంచి కూడా వస్తుంటాయి. ఈ మానసికత ఆటను మించిన ఒక సామాజిక సమస్య అనే విషయాన్ని అవి చెబుతాయి. ఆటగాళ్లు ఈ మానసికతను మైదానంలో మరింత ముందుకు తీసుకెళ్తుంటారు.

వీటన్నిటి వల్ల ఆటగాళ్లపై ఒక సైకలాజికల్ ప్రభావం పడుతుంది. 2019లో 24 ఏళ్ల యువ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ న్యూజీలాండ్‌లో ఒక ప్రేక్షకుడి నుంచి చాలా ఘోరమైన జాతివివక్ష వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆర్చర్ బార్బడాస్‌లో పుట్టిన నల్లజాతి మూలాలు ఉన్న ఆటగాడు. అప్పుడు ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున విదేశీ మైదానంలో తన తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ మ్యాచ్‌లో అతడు చాలా కీలకం.

ఆ మ్యాచ్ అతడికి గుర్తుండిపోయింది. కానీ అతడు దానిని ఒక అవమానకరమైన ఘటనగా గుర్తు చేసుకుంటాడు.

మ్యాచ్ త ర్వాత ఆర్చర్ “మీరు నా బౌలింగ్ గురించి చెడుగా మాట్లాడుంటే వినేవాడిని, కానీ జాతివివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు” అన్నాడు. ఆ సమయంలో తన ఆరు నెలల స్వల్ప కెరియర్‌లో అతడు కనీసం రెండు సార్లు అలాంటి ఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

గత రెండు దశాబ్దాలుగా చూస్తే ఇలాంటి చాలా విషయాలు గుర్తుకొస్తాయి. 2003లో ఆస్ట్రేలియా డెరెన్ లీమెన్ శ్రీలంక ఆటగాళ్లపై రేసిస్ట్ వ్యాఖ్యలు చేశాడు.

జాతికి మతాన్ని కూడా కలిపితే

జాతికి, మతాన్ని కలిపినపుడు అది మరింత దారుణంగా మారుతుంది.

ఆస్ట్రేలియా ఆటగాడు తనను ఒసామా అన్నాడని ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ ఆరోపించడం, లేదా డీన్ జోన్స్ 2006లో దక్షిణాఫ్రికా హాషిమ్ అమ్లాను తీవ్రవాది అనడం మీకు గుర్తుండే ఉంటుంది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లేదా క్రికెట్ బోర్డుల్లో జాతివివక్షకు వ్యతిరేకంగా ఎలాంటి విధానాలు లేవని కాదు.

కానీ ఆ విధానాల్లో ఆటగాళ్లు, సభ్యులు, ప్రేక్షకుల గురించి వేరు వేరు నియమాలు ఉన్నాయి.

జాతి, మత, సంస్కృతి, జాతీయత, లింగం ఆధారంగా ఎవరినీ అవమానించడం, బెదిరించడం చేయకూడదని, వివక్ష చూపకూడదని ఐసీసీ సభ్యులకు నిర్దేశాలు ఉన్నాయి.

ఏ ప్రేక్షకుడైనా రంగు, మతం, జాతి, లింగం, జాతీయత ఆధారంగా వివక్ష చూపితే, అతడిని స్టేడియం నుంచి బయటకు పంపించవచ్చని నిర్దేశాలు ఉన్నాయి. వారిపై నేర విచారణ కూడా జరగవచ్చు.

అయినప్పటికీ ఐసీసీ నిర్వహించే మ్యాచుల్లో ఆటగాళ్లు, ప్రేక్షకుల మధ్య జాతి వివక్ష వ్యాఖ్యలు ఉంటూనే వచ్చాయి.

డీన్ జోన్స్ అయినా, డారెన్ లీమాన్ అయినా లేక సర్ఫరాజ్ ఖాన్ అయినా తర్వాత అందరూ క్షమాపణలు చెప్పారు. కానీ తర్వాత ఏడాది మరో ఒక కొత్త సర్ఫరాజ్ ఖాన్ లేదా లీమన్ పుట్టుకొచ్చేవాడు.

ఎందుకు, దీనికి సమాధానం ఈ జాతి వివక్ష వృద్ధి చెందడానికి మార్గం ఆ సామాజిక నిర్మాణంలోనే దొరుకుతుంది. అక్కడ రోజువారీ జీవితంలో దానికి ఆమోద ముద్ర పడుతుంది. దానిని అంగీకరించడం సాధారణం అయిపోతుంది. భారత్‌లో మనకు సినిమాలు, వాడుక భాషలో దీనికి సులభంగా ఉదాహరణలు దొరుకుతాయి. అక్కడ ‘బహుత్ ఖూబ్‌సూరత్’( చాలా అందంగా ఉంది) అనిన తర్వాత, అదే పాటలో ‘మగర్ సావ్లీ సీ’ (కానీ నల్లగా ఉంది) అనే మాట జోడించాల్సి వస్తుంది.

సమాధానం ఐసీసీ దగ్గర కూడా ఉండాలి

డారెన్ సామీ కూడా ఐసీసీని ఒక ప్రశ్నను అడిగాడు. “ఐసీసీ, మిగతా క్రికెట్ బోర్డులన్నీ నా లాంటి వారి పట్ల ఏం జరుగుతోందో చూడ్డం లేదా. ఇది కేవలం అమెరికాలోనే కాదు, ఇది రోజూ జరుగుతోంది. ఇది నోర్మూసుకుని ఉండాల్సిన సమయం కాదు. సమాధానం నేను మీ నోటి నుంచే వినాలనుకుంటున్నా” అన్నాడు.

అయితే ఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

క్రీడలు ఒక అందమైన మాధ్యమం. అక్కడ ఇద్దరు సమర్థుల మధ్య ముఖాముఖి నియమనిబంధనల ప్రకారం పోటీ జరుగుతుంది.

అది టెన్నిస్ కోర్ట్ అయినా, క్రికెట్ మైదానం అయినా లేక ఫుట్‌బాల్ పిచ్ అయినా ఏ ఆటగాడు ఎవరి కంటే సమర్థుడు అనేది మైదానంలో వారి సామర్థ్యంతోనే తేలుతుంది. ఒకరి చర్మం రంగు వల్ల కాదు.

ప్రస్తుతం నల్ల, తెల్ల మాస్కులు వేసుకుని వెస్టిండీస్ టీమ్ ఇంగ్లండ్ చేరుకుంది. కరోనావైరస్ మధ్య ఇది మొదటి బిగ్ క్రికెట్ సిరీస్ అవుతుంది.

క్రికెట్‌లో కరోనావైరస్, జాతివివక్ష రెండింటితో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అందులో భారత్ కూడా ఉంది. 2014 క్రికెటర్ ఇషాంత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కాస్త దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అతడు డారెన్ సామీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి "నేను, భువీ, కాలూ, గన్ సన్‌రైజర్స్" అని పెట్టాడు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)