భారత్‌తో సరిహద్దుల్లో పాకిస్తాన్ కంచె ఎందుకు వేయడం లేదు

    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్, చైనా సైనికుల మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల గురించి భారత మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇలాంటి సరిహద్దు రేఖ మరొకటి ఉంది. అక్కడే జరిగే కార్యకాలాపాలను మాత్రం ఎవరూ పెద్దగా గమనించడం లేదు.

ఇరాన్‌తో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సు సరిహద్దు పంచుకుంటుంది. సరిహద్దుకు సమీపంలోనే పాకిస్తాన్ భద్రతాదళాలకు చెందిన ఆరుగురు సైనికులు ఇటీవల మరణించారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని రిమోట్ కంట్రోల్‌తో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)తో ఎవరో పేల్చేశారు. మరణించిన సైనికుల్లో ఓ మేజర్ స్థాయి అధికారి ఉన్నారు.

పాకిస్తాన్ సైన్యం ప్రజా సంబంధాల విభాగం డైరెక్టర్ (డీజీ ఐఐఎస్‌పీఆర్) చెప్పిన వివరాల ప్రకారం ఈ సైనికుల బృందం పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుకు 14 కి.మీ.ల దూరంలోని ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. అక్కడి పర్వత ప్రాంతాల్లో మిలిటెంట్లు ఉండే అవకాశమున్న రహదారుల్లో ఆ బృందం అప్పుడు తనిఖీలు చేస్తూ ఉంది.

ఆ తర్వాత నాలుగు రోజులకు, మే 12న పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ జావెద్ బాజ్వా ఇరాన్ సైన్యాధిపతి మేజర్ జనరల్ బఘెరీకి ఫోన్ చేశారు. పాకిస్తాన్ సైనికుల మృతి విషయమై విచారం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో కంచె వేసే పని మొదలుపెట్టామని, ఈ విషయంలో రెండు పక్షాల మధ్య సహకారం అవసరమని చెప్పారు.

ఆ మరుసటి రోజు పరిస్థితులను సమీక్షించేందుకు బలూచిస్తాన్ రాజధాని క్వెటాకు బాజ్వా వెళ్లారు. భద్రతపరైమన పరిస్థితులు, కార్యనిర్వాహక సన్నద్ధత, పాక్-అఫ్గాన్, పాక్-ఇరాన్ సరిహద్దుల్లో కంచె వయడం, వాటి నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించినట్లు ఐఎస్‌పీఆర్ తెలిపింది.

మరి, పొరుగుదేశం భారత్‌తో కంచె గురించి మాత్రం పాకిస్తాన్ ఎందుకు పట్టించుకోవడం లేదు?

ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం పాకిస్తాన్ భౌగోళిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి.

పాకిస్తాన్‌కు నాలుగు దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. అత్యల్పంగా చైనాతో సుమారు 599 కి.మీ. పొడవున ఆ దేశానికి సరిహద్దు ఉంది.

ఇరాన్‌తో 909 కి.మీ.ల పొడవున, అఫ్గానిస్తాన్‌తో 2,611 కి.మీ.ల పొడవున పాక్ సరిహద్దులు పంచుకుంటోంది.

పాక్ సరిహద్దు పంచుకుంటోంది అత్యధికంగా భారత్‌తోనే. అంతర్జాతీయ సరిహద్దు, వర్కింగ్ బౌండరీ, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) కలగలసి సుమారు 3,163 పొడవున ఈ సరిహద్దు ఉంది.

మరి, దీనంతటికీ పాక్ కంచె ఎందుకు వేయడం లేదు? ఆ రెండు దేశాలతో సరిహద్దులకు మాత్రమే కంచె ఎందుకు వేస్తోంది?

కంచె వల్ల ఎవరికి ప్రయోజనం?

భారత్‌తో సరిహద్దుల్లో కంచె వేయడం గురించి పాకిస్తాన్ ఎప్పుడూ ప్రణాళికలు వేయలేదని ఇస్లామాబాద్‌లోని జిన్నా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్న సల్మాన్ జైదీ అంటున్నారు.

‘‘ఇరాన్‌తో సరిహద్దుల్లో రెండు వైపులా తక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాలపై ప్రభుత్వ నియంత్రణ బలహీనంగా ఉంది. అందుకే నిషేధిత సంస్థలు, దొంగలు, అక్రమ కార్యకలాపాలకు ఆ ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య కంచె గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. సరిహద్దుకు రెండు వైపులా ప్రభుత్వంపై దాడులు జరుగుతుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వమే బాగా కఠిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కంచె వేయడం గురించి కూడా ప్రకటించింది’’ అని చెప్పారు.

‘‘పది రోజుల క్రితం 950 కి.మీ.ల పొడవున 300 కోట్ల రూపాయలతో సరిహద్దు కంచె వేసే ప్రతిపాదన గురించి ప్రకటించారు. కంచె విషయమై మొదట్లో ఇరాన్, పాకిస్తాన్ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. రెండు దేశాలకూ అక్రమ కార్యకలాపాల సమస్య దీనితో దూరమవుతుంది. ఇక అఫ్గానిస్తాన్ విషయానికి వస్తే... అమెరికా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య దశాబ్దం కన్నా ఎక్కువ కాలం నుంచి జరుగుతున్న చర్చలు సరిహద్దుల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యాయి. ఈ ప్రాంతాల్లో మిలిటెంట్ల రాకపోకలు సాగుతున్నాయి’’ అని జైదీ చెప్పారు.

డూరండ్ రేఖను అఫ్గానిస్తాన్ ప్రభుత్వం సరిహద్దుగా ఒప్పుకోవడం లేదని, అందుకే కంచె ఏర్పాటులో పాకిస్తాన్‌తో అంగీకారానికి రావడం లేదని జైదీ చెప్పారు.

‘‘మిలిటెంట్లు పాక్‌లోకి ప్రవేశిస్తుండటాన్ని, దాడులకు పాల్పడుతుండటాన్ని అఫ్గాన్ అడ్డుకోలేకపోతోంది. దీంతో పాకిస్తాన్ ఏకపక్షంగా కంచె వేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ కంచె ఈ ఏడాది పూర్తవుతుంది’’ అని అన్నారు.

చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో శత్రువులు లేరని, అయినప్పటికీ ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో భద్రత దళాల మోహరింపు ఉందని జైదీ చెప్పారు.

‘‘రెండు దేశాల సైన్యాలు కలిసి ఇక్కడ గస్తీ విధులు నిర్వర్తిస్తాయి. ఇక్కడ కంచె వేసే ప్రశ్నే లేదు. ఈ ప్రాంతంలో చొరబాట్లు కూడా సులభం కాదు’’ అని అన్నారు.

భారత్‌తో కంచె ఎందుకు వేయట్లేదంటే...

ఈ విషయమై పాకిస్తాన్‌కు, భారత్‌కు యుద్ధాలు జరిగాయి. రెండు దేశాల మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. భారత్‌లో అస్థిరతను ఏర్పరిచేందుకు పాక్ చొరబాట్లకు పాల్పడుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

పాకిస్తాన్ ఐఎస్‌పీఆర్ ఈ విషయంలో ఏ వివరణలూ ఇవ్వలేదు.

‘‘భద్రతపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు కంచె వేస్తారు. చొరబాట్లను అడ్డుకునేందుకు అంటూ భారత్ కంచె వేసింది. పాకిస్తాన్ దీన్ని వ్యతిరేకించలేదు. కానీ, ఈ ప్రాంతాలు, అక్కడి జనాల భద్రత గురించిన బాధ్యత భారత్‌పై ఉంది. స్వయంగా కంచె వేసుకుంది కాబట్టి, సరిహద్దుల్లో చొరబాట్ల గురించి ప్రశ్నించలేదు’’ అని జైదీ అభిప్రాయపడ్డారు.

పాక్ వైఖరిలో మరో సందేశం దాగుందని భారత్‌లోని నిపుణులు అంటున్నారు.

‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్‌ల‌తో తమకున్న సరిహద్దులను పటిష్ఠం చేసుకోవాలని పాక్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సరిహద్దుల్లో చొరబాట్లు సులభంగా జరిగే అవకాశం ఉండటంతో, మిలిటెంట్ దాడులు జరుగుతూ ఉంటాయి. భారత్‌తో సరిహద్దుల్లో పాకిస్తాన్‌కు కంచె అవసరం లేదు. ఎందుకంటే భారత్ బాధ్యతాయుతంగా నడుచుకునే ఓ ప్రజాస్వామ్య దేశం. పాకిస్తాన్‌కు నష్టం చేయడానికి మిలిటెంట్లను పోషించదు’’ అని భారత సైన్యం మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ అన్నారు.

కంచె వేయకపోవడం ద్వారా భారత్ వైపు నుంచి చొరబాట్లు లేవని, అక్రమ కార్యకలాపాలు జరగడం లేదని పాకిస్తాన్ ఓవిధంగా అంగీకరించినట్లేనని భారత సరిహద్దు భద్రత తళం (బీఎస్ఎఫ్) మాజీ అడిషనల్ డీజీ సంజీవ్ కృష్ణన్ సూద్ అన్నారు. పాకిస్తాన్ కంచె వేస్తే, ఆ దేశం సరిహద్దులు దాటించేందుకు పంపుతున్నవారిని పట్టుకోవడం భారత్‌కు సులభమయ్యేదని చెప్పారు.

2018 డిసెంబర్‌లో భారత హోం మంత్రిత్వ శాఖ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో తమ దేశానికి ఉన్న సరిహద్దుల్లో కంచె వేసే ప్రణాళికలను రూపొందించింది.

భారత్‌కు మయన్మార్, చైనా, నేపాల్, భూటాన్‌‌లతో సరిహద్దులున్నాయి.

భారత హోంశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్‌తో ఉన్న 2,289 కి.మీ.ల అంతర్జాతీయ సరిహద్దులో 2004 కి.మీ.ల మేర కంచె వేయడం పూర్తైంది.

‘‘భారత్ కంచె వేయడంతో భారత సైన్యం గస్తీ కార్యకాలపాలను పాకిస్తాన్ చూడగలుగుతోంది. ఎందుకంటే, రాత్రి వేళ ఈ కంచె గేట్లను తెరిచి, ముందుకువెళ్లి సైన్యం గస్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, చొరబాట్లను నిరోధించేందుకు భారత్‌కు ఇది తప్పదు’’ అని సంజీవ్ కృష్ణన్ సూద్ చెప్పారు.

పాకిస్తాన్‌తో 740 కి.మీ. పొడవున ఉన్న నియంత్రణ రేఖ సమీపంలో భారత సైన్యం చొరబాట్ల నిరోధక ఆటంక వ్యవస్థ (ఏఐఓఎస్)ను ఏర్పాటు చేసుకుంది.

సరిహద్దుల్లో కంచె వేసే యోచన తొలిసారిగా భారత్ 80వ దశకంలో చేసిందని సంజీవ్ కృష్ణన్ అన్నారు.

‘‘మిలిటెంట్ల చొరబాట్లను ఆపేందుకు ఈ చర్య అవసరమని అప్పుడు భావించారు. పరిమత సామర్థ్యం దృష్ట్యా బీఎస్ఎఫ్ చొరబాట్లను అడ్డుకోవడం కష్టమని అనుకున్నారు’’ అని చెప్పారు.

అయితే, భారత్‌తో సరిహద్దుల్లో పాకిస్తాన్ ఎప్పటికీ కంచె వేయదా? ఈ విషయానికి ఇప్పుడప్పుడే జవాబు దొరకడం కష్టం.

పాకిస్తాన్ సైన్యం ఈ ప్రశ్నకు ఇప్పటికైతే జవాబు చెప్పడం లేదు. ఇప్పటివరకూ ఇలాంటి ప్రతిపాదన గురించి తానైతే కనీసం వినలేదని జైదీ అంటున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)