ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ రూ. 20,97,053 కోట్లు.. ఇదీ లెక్క.. - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా రూ.20 లక్షల కోట్లుగా పేర్కొంటున్న ప్యాకేజీ మొత్తం విలువ రూ.20,97,053 కోట్లు. అంటే సుమారు రూ. 21 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు.

ఇందులో మొదటి విడత వెల్లడించిన ప్యాకేజీ విలువ రూ. 5,94,550 కోట్లు, రెండో విడత రూ. 3,10,000 కోట్లు, మూడో విడత రూ. 1,50,000 కోట్లు, నాలుగు, అయిదు విడతల మొత్తం రూ. 48,100 కోట్లు.. ఇదంతా కలిపితే రూ. 11,02,650 కోట్లని వివరించారు.

ఇంకా, ప్రధాన మంత్రి ఇంతకుముందు ప్రకటించిన గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ(పీఎంజీకేపీ)లో రూ. 1,92,800 కోట్లు, ఆర్బీఐ తీసుకున్న చర్యల విలువ రూ. 8,01,603 కోట్లు కలిపితే మరో రూ. 9,94,403 కోట్లవుతుందని, అయిదు విడతల వెల్లడించిని ప్యాకేజీ, పీఎంజీకేపీ, ఆర్బీఐ చర్యల మొత్తం కలిపితే రూ. 20,97,053 కోట్లని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఈ కోవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కి భారత్ సమర్థదేశంగా ఆవిర్భవిస్తుందని అన్నారు. లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే ఆహారం అవసరం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని గరీబ్ కల్యాణ్ యోజన ప్రారంభించామన్నారు.

మూడు నెలలకు సరిపడా ఆహార ధాన్యాలు అందించామని చెప్పారు. వలస కూలీల తరలింపులో 85 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తోందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, మే 16వ తేదీ వరకు 8.19 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లు జమ చేశామని, మొత్తం రూ. 16,394 కోట్లు ఇస్తామని కూడా వెల్లడించన సీతారామన్, "ఎన్‌ఎస్ఏపీ లబ్ధిదారులకు రూ. 2807 కోట్లు రెండు విడతల్లో అందజేశాం. 20 కోట్ల జన్‌ధన్ ఖాతాలకు రూ. 10,025 కోట్లు జమ చేశాం. భవన నిర్మాణ కార్మికులకు రూ. 3,950 కోట్లు ఇచ్చాం. అలాగే, 6.81 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించాం" అని చెప్పారు.

ఇక, శ్రామిక్ రైళ్లు వేసి వలస కార్మికులను తరలిస్తున్నామని, వారిని స్టేషన్లకు చేర్చే బాధ్యత తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతున్నామని అన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన పార్ట్-5లో వివరించిన 7 అంశాలు

1. గ్రామీణ ఉపాధి హామీ

  • మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన మరింత పెంచేందుకు రూ. 40 వేల కోట్లు కేటాయింపు. వలస కార్మికులు పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు చేరుకుంటున్న నేపథ్యంలో అందరికీ పని దొరికేలా మరిన్ని పనులు చేపట్టేందుకు వీలుగా ఈ నిధులు తోడ్పడతాయన్నారు.
  • ఈ నిధుల కింద జల సంరక్షణ వంటి జీవనాధార పనులు చేపడతారు.

2. వైద్యం- విద్య

  • కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్స్, కిట్లు, ఇతర అత్యవసర పరికరాల కోసం రాష్ట్రాలకు రూ.15,000 కోట్లు ఇచ్చాం.
  • టెలికన్సల్టేషనన్ సర్వీసెస్, ఆరోగ్య సేతు యాప్ ప్రారంభించాం.
  • హెల్త్ కేర్ వర్కర్స్‌కు రూ. 50 లక్షల చొప్పున బీమా ప్రకటించాం. రాష్ట్రాలకు రూ. 4113 కోట్లకు పైగా నిధులు విడుదల చేశాం.
  • ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు పెరెగుతుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆరోగ్య రంగంలో పెట్టుబడులను పెంచుతాం.
  • ప్రతి జిల్లాలో సాంక్రమిక వ్యాధుల ఆసుపత్రి ఏర్పాటు
  • దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత ప్రజారోగ్య పరీక్ష కేంద్రాలు.
  • నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఏర్పాటు.
  • విద్యారంగం విషయానికి వస్తే,
  • మే 30 నాటికి దేశంలో టాప్ 100 యూనివర్సిటీల్లో ఆన్ లైన్ కోర్సులు ప్రారంభిస్తాం.
  • పాడ్‌కాస్ట్, రేడియో కార్యక్రమాలు ఉంటాయి. అంధ, బధిర విద్యార్థుల కోసం ప్రత్యేక ఈ-కంటెంట్ అందుబాటులోకి తెస్తాం.
  • త్వరలో ‘పీఎం ఈ-విద్య’ పేరుతో డిజిటల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం.
  • ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రతి క్లాస్‌కు ఒక టీవీ చానల్- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘దీక్ష’ ఏర్పాటు. ఈ-కంటెంట్, క్యూఆర్ కోడెడ్ టెక్స్ట్ బుక్స్ వంంటివన్నీ అందుబాటులో ఉంటాయి.
  • మనోదర్పన్: విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సైకలాజికల్ సపోర్ట్ అందించే కార్యక్రమం.

3. వ్యాపారం

  • దివాలా ప్రక్రియ ప్రారంభానికి పరిమితి రూ. కోటికి పెంపు
  • ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక దివాలా ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తాం.

4. డీక్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్

  • చిన్నపాటి సాంకేతిక పొరపాట్లు, ప్రక్రియాపరమైన పొరపాట్లకు కంపెనీల చట్టం ఉల్లంఘనల నేరాల నుంచి మినహాయింపు
  • కాంపౌండబుల్ అఫెన్సెస్‌లో చాలా సెక్షన్లను అంతర్గత న్యాయనిర్ణయ వ్యవస్థలోకి(ఐఏఎం) మార్చడం. ఇప్పటివరకు 18 సెక్షన్లు ఐఏఎం పరిధిలో ఉండగా ఇప్పుడవి 58 సెక్షన్లకు పెంచుతున్నారు.

5. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

  • అనుమతించదగ్గ విదేశీ చట్టపరిధుల్లో ఉన్న భారతీయ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు సెక్యూరిటీస్‌లో డైరెక్ట్ లిస్టింగ్
  • స్టాక్ ఎక్స్చేంజ్‌లలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు లిస్ట్ చేసే ప్రయివేట్ కంపెనీలను లిస్టెడ్ కంపెనీలుగా పరిగణించరు.
  • నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్ఏటీ)‌లకు అదనపు, ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటుచేసుకునే అధికారం
  • చిన్నకంపెనీలు, ఏక వ్యక్తి కంపెనీలు, ప్రొడ్యూసర్ కంపెనీలు, స్టార్టప్‌లు చెల్లింపులు చేయకపోతే వాటిపై జరిమానాల తగ్గింపు

6. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్

  • అన్ని రంగాల్లో ప్రయివేటుకు అవకాశం.
  • వ్యూహాత్మక రంగాల్లో కనీసం ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటుంది. ప్రయివేటుకూ అనుమతులు ఇస్తారు.
  • మిగతా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను దశలవారీగా ప్రయివేటీకరిస్తారు.
  • నిర్వహణ, పాలనావ్యయాల నియంత్రణకు గాను వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను 1 నుంచి 4 వరకు పరిమితం చేస్తారు. మిగతావాటిని విలీనం చేయడమో, హోల్డింగ్ కంపెనీలుగా మార్చడమో, ప్రయివేటీకరించడమో చేస్తారు.

7. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు

  • 2020-21 సంవత్సరానికి రాష్ట్రాల రుణపరిమితి 3 శాతం నుంచి 5 శాతానికి పెంపు.
  • 3 శాతం లెక్కన ప్రస్తుతం రూ.6.41 లక్షల కోట్లకు పరిమితి ఉండగా ఇప్పుడు అదనంగా మరో రూ. 4.28 లక్షల కోట్ల వరకు రుణం తెచ్చుకునే అవకాశం.
  • ఇప్పటికే రాష్ట్రాలకు అందించిన సహాయం:
  • ఏప్రిల్‌లో రూ.46,038 కోట్లు పన్నుల ఆదాయం బదిలీ
  • రాష్ట్రాలకు రెవెన్యూ లోటు రూ.12,390 కోట్లు భర్తీ
  • ఎస్డీఆర్ఎఫ్ నిధుల కోసం ఏప్రిల్ మొదటివారంలో రూ.11,092 కోట్ల అడ్వాన్స్ చెల్లింపు
  • కోవిడ్ నివారణ చర్యల కోసం నేరుగా కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రూ.4,114 కోట్లు విడుదల
  • కేంద్రం వినతి మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల విషయంలో మద్దతుగా నిలిచింది.
  • రాష్ట్రాల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితిని 60 శాతానికి పెంచింది.
  • రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ వరుస రోజుల పరిమితిని 14 నుంచి 21 రోజులకు పెంచింది.
  • త్రైమాసికంలో ఓవర్ డ్రాఫ్ట్ రోజుల పరిమితిని 32 నుంచి 50 రోజులకు పెంచింది.

ఈ సమావేశంలో ఆర్థిక సేవల విభాగం సెక్రటరీ దేవాశిష్ పండా, డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే, ఫైనాన్స్ అండ్ రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషన్ పాండే, ఎంసీఏ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్, తదితరులు శాఖలవారీగా వివరాలు అందించారు.

ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)