కాంగో: ఇళ్ల మధ్యలో కూలిన విమానం.. 27 మందికి పైగా మృతి

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని గోమా నగరంలో ఓ విమానం ఇళ్లపై కూలడంతో 27 మందికి పైగా మరణించినట్లు కాంగో అధికారులు తెలిపారు.

గోమాలోని మపెండో ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం ఉదయం గోమాలోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన తేలికపాటి ప్రయాణికుల విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు.

ప్రమాదం జరిగేటప్పటికి విమానంలో 17 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని కాంగో అధికార వర్గాలు తెలిపాయి.

కాంగో విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది.

దీంతో కాంగోకి చెందిన అన్ని వాణిజ్య విమాన సర్వీసులపై యూరోపియన్ యూనియన్‌లో నిషేధం ఉంది.

టేకాఫ్ అయిన నిమిషానికే?

'బిజీ బీ' అనే ప్రయివేట్ సంస్థకు చెందిన ఈ 'డార్నియర్-228 ట్విన్ టర్బోప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్' టేకాఫ్ అయిన నిమిషం తరువాత కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

గోమాకు 350 కి.మీ. దూరంలోని బెనీ పట్టణానికి ఈ విమానం వెళ్లాల్సి ఉంది.

''పొగలు కక్కుతున్న విమానం గాల్లో మూడు పల్టీలు కొడుతూ కూలిపోయింది'' అని జెమో మెదార్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

''విమానం కూలగానే వెంటనే మేం అక్కడకు పరుగులు తీశాం. ఆ పైలట్ మాకు తెలుసు.. అతని పేరు డిడియర్. రక్షించండి.. రక్షించండి అంటూ పైలట్ అరవడం వినిపించింది. కానీ, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మేం ఏమీ చేయలేకపోయాం'' అని రాయిటర్స్ వార్తాసంస్థకు మెదార్ చెప్పాడు.

టేకాఫ్ తరువాత ఇంజిన్ పనిచేయకపోవడం వల్లే విమానం కూలిపోయిందని అధికారులన ఉటంకిస్తూ కాంగో రాజధాని కిన్షాసాలోని బీబీసీ విలేకరి ఎమెరీ మకుమెనో చెప్పారు.

విమానం కూలినప్పడు ఆ ఇళ్లలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా కచ్చితంగా తెలియదని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)