సుమత్రా: జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ఒక యువతి ఒంటరి పోరాటం

ఫొటో సోర్స్, WFN
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఒరాంగుటాన్లు, ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు కలిసి జీవించే ప్రదేశం ఒకే ఒక్కటి మిగిలి ఉంది. అది సుమత్రాలోని ల్యూజర్ ఎకోసిస్టమ్.
పర్యావరణ కార్యకర్త ఫర్వీజా ఫర్హాన్ ఆ వ్యవస్థను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
2012లో ఆమె తన స్వచ్ఛంద సంస్థ 'యయాసన్ హాకా' తరపున ఒక కంపెనీ అక్రమంగా పొందిన పర్మిట్తో ఆ అడవిని కొట్టివేయడంపై కేసు వేశారు. ఇటీవలే ఆమె స్థానికుల సహాయంతో.. ఈ ప్రాంతంలో రహదారులు, డ్యామ్ల నిర్మాణం, ఆయిల్ పామ్ చెట్ల పెంపకానికి ఇస్తున్న రాయితీలకు వ్యతిరేకంగా ఒక కేసు దాఖలు చేశారు.
వన్యప్రాణులకు మద్దతుగా ఎవరూ మాట్లాడడం లేదని, అందుకే దీన్ని అన్యాయంగా భావించి తాను పోరాటం చేస్తున్నానని ఆమె అంటారు.

ఫొటో సోర్స్, Paul Hilton
ఉష్ణమండలంలోని దట్టమైన అడవులు
ల్యూజర్ ఎకోసిస్టమ్ ఉన్న అడవుల్లో అద్భుతమైన పక్షి, జంతు సంపద కనిపిస్తుంది. అవన్నీ వాటి వాటి ప్రదేశాల్లో అక్కడ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాయి.
ఇక్కడ తల్లి, పిల్ల ఒరాంగుటాన్లు ఒక చెట్టు మీది నుంచి మరో చెట్టుకు ఊడలను పట్టుకుని వెళ్లడం చూడొచ్చు.
కొన్నిసార్లు అత్యంత నిశబ్దంగా ఉండే ఈ అడవులు, మరి కొన్నిసార్లు జంతువుల అరుపులతో మళ్లీ జీవం పోసుకుంటాయి.
''ఇలాంటి అడవుల్లో ఇప్పుడు రంపాల శబ్దం వినిపిస్తోంది. అది వినాశనానికి సూచన. అందువల్లే ఈ అడవిని రక్షించడానికి పోరాడాలని నిర్ణయించుకున్నాను'' అన్నారు ఫర్హాన్.

ఫొటో సోర్స్, Getty Images
ప్రకృతితో ప్రేమలో..
''బీబీసీ బ్లూ ప్లానెట్ కార్యక్రమాలు చూసే క్రమంలో నేను పర్యావరణ ప్రేమికురాలిగా మారాను. చిన్న వయసులోనే సముద్రం, దానిలోని ఆల్చిప్పలతో ప్రేమలో పడ్డాను. అప్పుడే నేను ఈ అడవుల్లోనే నా జీవితం గడపాలని నిశ్చయించుకున్నాను'' అని ఆమె తెలిపారు.
''మెరైన్ బయాలజీ పూర్తి చేశాక, నేను ప్రేమించిన ఈ ప్రాంతానికి తిరిగి వచ్చినపుడు ఇదంతా ధ్వంసమై ఉండడం నాకు కనిపించింది. దీంతో నాకు చాలా ఆవేదన కలిగింది.''
''అప్పుడే ఈ అడవులను ఎలాగైనా పరిరక్షించాలని నిర్ణయించుకున్నాను. కానీ అదంత సులభం కాలేదు. ఇక్కడ పర్యావరణ విధ్వంసానికి ప్రధాన కారణం అడవులను విచక్షణారహితంగా కొట్టిపారేయడం, సుస్థిరత కాని అభివృద్ధి విధానాలు.'' అని ఫర్హాన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పామాయిల్తో ప్రమాదం
ప్రపంచంలో అత్యంత లాభదాయకమైన పంటల్లో ఆయిల్ పామ్ ఒకటి. అనేక పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఆ చెట్లను పెంచాలనుకన్నాయి. ప్రభుత్వం కూడా ఆ చెట్లను పెంచే కంపెనీలకు రాయితీలు ఇస్తోంది.
దాని వల్ల ఇక్కడ పర్యావరణం నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది.
''అలాగని పామాయిల్ వాడకాన్నే నిలిపేయమని నేను చెప్పడం లేదు. అభివృద్ధి చెందిన దేశాలలో దాని వాడకం పెరగడంతో పామాయిల్కు డిమాండ్ పెరిగింది. కానీ వాళ్లు దాన్ని చవకగా పొందాలనుకుంటున్నారు. దాంతో విచ్చలవిడిగా ఆయిల్ పామ్ చెట్ల పెంపకం చేపడుతున్నారు'' అని ఫర్హాన్ వివరించారు.

ఫొటో సోర్స్, WFN
రూ. 187 కోట్ల పరిహారం
''సుమత్రా, అమెజాన్, మడగాస్కర్లాంటి ప్రాంతాలలో విపరీతమైన విధ్వంసం జరుగుతోంది. అలాంటి ప్రదేశాలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడెలా ఉన్నాయో చూస్తే మీకు అడవులు, పర్యావరణ విధ్వంసం ఎంత వేగంగా జరుగుతుందో తెలుస్తుంది'' అన్నారు ఫర్హాన్.
ఫర్హాన్ కృషి ఫలితంగా కోర్టు ఆ ప్రాంతంలో ఆయిల్ పామ్ చెట్లను పెంచుతున్న సంస్థ స్థానికులకు రూ.187 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
(పర్యావరణంపై చేసిన కృషికిగాను ఫర్వీజా ఫర్హాన్ 2016లో విట్లే అవార్డు పొందారు. )
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








