చైనాలో 'బస్‌ పూలింగ్'.. ప్రయాణికుల చెంతకు బస్సు

చైనా

ఫొటో సోర్స్, AFP

చైనా రాజధాని బీజింగ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు 'బస్ పూలింగ్' విధానాన్ని తీసుకురానున్నారు. బస్సు కోసం ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వస్తోందంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని దీనిని ప్రవేశపెట్టనున్నారు.

ప్రయాణికులు తాము బస్సు ఎక్కే చోటు, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుందని 'బీజింగ్ యూత్ డైలీ' తెలిపింది. పెద్ద పెద్ద నివాస సముదాయ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ఈ సేవను అందించనున్నారని చెప్పింది.

ప్రయాణికుడు

ఫొటో సోర్స్, AFP

ప్రయాణికులను ప్రస్తుత స్టాప్‌లలోనే ఎక్కించుకొనిపోవడం కాకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రదేశాలను రూట్ పరిధిలోకి తీసుకొచ్చి ఈ సేవను అందించనున్నారని ఈ పత్రిక తెలిపింది. ఇది దాదాపు ఇంటింటికీ వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకొనే విధానమని వ్యాఖ్యానించింది.

ఈ సేవతో భవిష్యత్తులో బస్సులు కూడా కార్ల మాదిరి ప్రయాణికులకు ఎక్కువ సౌకర్యంగా ఉండే చోటకు రావొచ్చని బీజింగ్ యూత్ డైలీ పేర్కొంది.

ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుందో మీడియా వెల్లడించలేదు.

బీజింగ్‌లో నెలకు దాదాపు 85 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తారని అంచనా.

కొత్త విధానంతో ట్రాఫిక్ సమస్యలు కొంత మేర తగ్గే అవకాశముంది. ప్రయాణికులకు భద్రత పరంగా కూడా భరోసా లభిస్తుంది.

ట్యాక్సీ బుకింగ్ యాప్ డిడీ చుక్సింగ్ నిర్వహణలోని సర్వీసులను ఉపయోగించుకొన్న ఇద్దరు వ్యక్తులు ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ఈ యాప్‌ను చైనా నిరవధికంగా సస్పెండ్ చేసింది. ఇలాంటి ఇతర యాప్‌లపై అధికారులు విచారణ సాగిస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో క్యాబ్‌ల విషయంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు బస్ పూలింగ్ ఊరట ఇచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)