జాజికాయ, జాపత్రి: కాకినాడలో ఖరీదైన సుగంధ ద్రవ్యాలు పండిస్తున్న రైతు ఏమంటున్నారు?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
దేశంలో సుగంధ ద్రవ్యాల సాగులో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చాలా మంది ఇష్టపడి తినే బిర్యానీ వంటి వంటకాల్లో వాడే కొన్ని పదార్థాలు ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాటి సాగు తెలుగు నేలకు కూడా విస్తరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాకు చెందిన ఓ రైతు తన పామాయల్ తోటలో అంతరపంటగా జాపత్రి, జాజికాయల మొక్కలు నాటారు. ఐదేళ్ల క్రితం నాటిన మొక్కల నుంచి ఇప్పుడు పంట దిగుబడి మొదలయ్యింది.
మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉందని రైతు చెబుతున్నారు. తన పంట గురించి ప్రచారం జరగడంతో కొందరు వ్యాపారుల నుంచి ఆర్డర్లు కూడా వచ్చాయని అంటున్నారు.
''ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేదు కానీ, రైతులే వేసుకోవచ్చు. ఎకరానికి 80 మొక్కలు వేయవచ్చు. హైబ్రిడ్ రకమే మంచిది. మొక్కలు హైట్ తక్కువ. జాపత్రికి కేజీకి రూ.2 వేలు, కాయలు అయితే కేజీకి రూ. వెయ్యి వరకూ ధర పలుకుతోంది. మనకి మనమే మార్కెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొందరు వ్యాపారులు నన్ను అడిగారు పంట ఇవ్వమని'' అని రైతు గుండ్ర అంబయ్య బీబీసీతో చెప్పారు.
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు తన మెట్ట భూమిలో చాలాకాలంగా పామాయిల్ సాగు చేస్తున్నారు. కేరళలో ఉంటున్న తమ బంధువుల సూచనతో ఈ జాపత్రి పండించేందుకు ప్రయత్నించినట్టు ఆయన తెలిపారు.
గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రైతు చేసిన ప్రయత్నం చూసి తాను కూడా ఈ మొక్కలు నాటినట్టు చెబుతున్నారు.
కేరళ శ్రీ పేరుతో అక్కడి ఉద్యానవన శాఖ రూపొందించిన హైబ్రీడ్ రకం మొక్కలు నాటడంతో మూడేళ్లకే దిగుబడి మొదలయ్యిందని అన్నారు. దేశవాళీ రకం దిగుబడికి ఆరేళ్ల గడువు తీసుకుంటుందని అన్నారు.
''తోట పంటల్లో రైతులంతా వేసుకోవచ్చు. ఇసుక నేలలు తప్ప మిగతా అన్ని నేలలూ ఈ పంటకు అనుకూలమే. కాకపోతే చల్లదనం, చెమ్మ ఎక్కువ ఉండాలి. అప్పుడు మొక్కకు కూలింగ్లాగా ఉంటుంది. ఖరీదైన పంట కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర తప్పకుండా వస్తుంది. నేను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాను. జీవామృతం వేస్తున్నాను. మిగిలిన పంటల మాదిరిగా మందులు కొట్టాల్సిన అవసరం లేదు. పేను తింటున్నట్టు ఉంటే దశపత్రకషాయం స్ప్రే చేస్తుంటాము. తెగుళ్ల వల్ల పాడయ్యేది లేదు. నేను వేసి హైబ్రీడ్ మూడేళ్లకు, దేశవాళీ ఐదేళ్లకు దిగుబడి వచ్చింది'' అని అంబయ్య చెప్పారు.


సహజంగా జాపత్రి, జాజికాయల పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. పంట చేతికి వచ్చేందుకు కూడా చాలాకాలం వేచి చూడాలి. అయితే మార్కెట్లో డిమాండ్ కారణంగా వీటి ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట పండించే రైతులకు లాభాలు వస్తుంటాయని చెబుతారు.
మార్కెట్లో మంచి ధర, అందుకు తగ్గ డిమాండ్ కూడా ఉన్న ఈ పంట సాగుని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పామాయిల్ సాగులో అంతరపంటలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా జాపత్రి విషయంలో కూడా రాయితీలు వర్తిస్తాయని అంటున్నారు.
ప్రయోగాత్మకంగా సాగుతున్న ఈ పంట దిగుబడి, రైతుకి రాబడి వంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తగిన ప్రోత్సాహం అందిస్తామని పిఠాపురం ఉద్యానవన శాఖ అధికారి కే సత్య శైలజ బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
- Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
- గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














