మోదీకి మన్మోహన్ లేఖ: కరోనా వైరస్ కట్టడికి 5 సూచనలు

మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ (పాత చిత్రం)

దేశంలో కరోనావైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ వ్యాక్సినేషన్ వేగం పెంచడం అత్యంత ప్రాధాన్యాంశమని చెబుతూ అందుకు గాను ఆయన 5 సూచనలు చేశారు.

నిర్మాణాత్మక సహకార స్ఫూర్తితో తన సలహాలను స్వీకరించాలని ఆయన కోరారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మన్మోహన్ లేఖలో ఏముందంటే..

‘‘భారత్‌తో పాటు మిగతా దేశాలన్నీ కోవిడ్-19 మహమ్మారితో పోరాటం ప్రారంభించి ఏడాది దాటిపోయింది.

ఎంతోమంది తల్లిదండ్రులు ఈ ఏడాది కాలంలో తమ పిల్లలను చూడలేకపోయారు. తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు తమ మనమలు, మనమరాళ్లను చూడలేకపోయారు.

ఉపాధ్యాయులు తరగతి గదుల్లో తమ విద్యార్థులను చూడలేదు.

ఇక ఎంతోమంది తమ జీవనాధారాన్నే కోల్పోయారు.

కోట్లాది మంది పేదరికంలో చిక్కుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా మనమంతా చూస్తున్న కరోనావైరస్ సెకండ్‌ వేవ్‌తో తమ జీవితాలు మళ్లీ మామూలు స్థితికి ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు’’ అని మన్మోహన్ తన లేఖలో రాశారు.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, EPA

‘‘ఈ మహమ్మారితో పోరాటానికి మనం తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనది వ్యాక్సినేషన్ వేగం పెంచడం.

ఈ విషయంలో నా వైపు నుంచి కొన్ని సూచనలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను.. వాటిని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇవీ ఆ సూచనలు

1) వచ్చే ఆరు నెలల కాలానికి సరఫరా చేయడం కోసం వివిధ వ్యాక్సీన్ తయారీ కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్ల వివరాలు బహిరంగపర్చాలి.

వచ్చే ఆరు నెలల కాలానికి వ్యాక్సీనేషన్ కోసం మనం పెట్టుకున్న టార్గెట్లకు అనుగుణంగా ముందస్తుగా ఆర్డర్లు ఇస్తే దాని ప్రకారం తయారీ సంస్థలు సరఫరా చేస్తాయి.

2) ఈ వ్యాక్సీన్ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఎలా పంపిణీ చేస్తారన్నదీ పారదర్శకంగా ప్రకటించాలి. కేంద్రం వద్ద అత్యవసరం కోసం 10 శాతం వ్యాక్సీన్ ఉంచొచ్చు. అది పోను మిగతాదంతా ఏ రాష్ట్రానికి ఎన్ని వస్తాయి.. ఎప్పుడు వస్తాయన్నది స్పష్టంగా ఉంటే దాన్నిబట్టి రాష్ట్రాలు ప్రణాళిక వేసుకుంటాయి.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

3) అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది రాష్ట్రాలే నిర్ణయించుకునేలా ఉండాలి. స్కూల్ టీచర్లు, బస్ డ్రైవర్లు, పంచాయతీల సిబ్బంది, లాయర్లు వంటివారిని కొన్ని రాష్ట్రాలు ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి 45 ఏళ్ల కంటే తక్కువ వయసున్నా వ్యాక్సీన్ వేయాలనుకోవచ్చు. రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఉండాలి.

4) గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ప్రపంచంలోనే వ్యాక్సీన్ల తయారీలో ముందుంది. ఈ ఉత్పత్తి సామర్థ్యంలో అత్యధికం ప్రైవేటు చేతుల్లోనే ఉంది.

ఇలాంటి క్లిష్ట సమయంలో దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం సహకారం అందించాలి. నిధులు సమకూర్చడం, రాయితీలు ఇవ్వడం ద్వారా ఉత్పత్తి మరింత పెంచేలా చేయగలగాలి.

5) దేశీయ ఉత్పత్తి మన అవసరాలకు చాలకపోవడం వల్ల యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ, యూఎస్ఎఫ్‌డీఏ వంటి నమ్మకమైన సంస్థల అనుమతులు పొందిన విదేశీ వ్యాక్సీన్లనూ ఈ అత్యవసర పరిస్థితుల్లో మనం అనుమతించొచ్చు. మన దేశంలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ కోసం పట్టుపట్టరాదు. కాదంటే పరిమిత కాలానికే ఈ వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకోవచ్చు.

ప్రస్తుతానికి మన దేశంలో కొద్దిమంది జనాభాకే వ్యాక్సీన్ వేసినప్పటికీ తగిన విధాన నిర్ణయాలతో త్వరలోనే మరింతమందికి వేయగలమనుకుంటున్నాను.

నా సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని, ఆ మేరకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను.’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)