పోలీస్ హీరో: నాలుగు నెలల పాప కోసం పాలు తీసుకుని రైలు వెనుక కానిస్టేబుల్ పరుగులు.. వీడియో వైరల్

    • రచయిత, షురైహ్ నియజీ
    • హోదా, బీబీసీ కోసం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్‌ చేసిన సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి రెండు రోజుల నుంచీ పాలు దొరక్క ఆకలితో అల్లాడుతున్న ఒక చిన్నారి కడుపు నింపాడు.

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇంద్రయాదవ్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న సమయంలో ఈ ఘటన మే 31న ఈ ఘటన జరిగింది. అదే సమయంలో బెలగావ్(కర్ణాటక) నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న ఒక శ్రామిక్ స్పెషల్ రైలు భోపాల్ స్టేషన్లో ఆగింది.

అదే రైల్లో ఉన్న 23 ఏళ్ల సాఫియా హాష్మీ, తన నాలుగు నెలల పాప గుక్కపట్టి ఏడుస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు.

స్టేషన్లో ఉన్న ఇంద్రయాదవ్‌ను చూసిన సాఫియా అతడిని సాయం అడిగారు. పాపకు రెండ్రోజులుగా పాలు తాగించలేదని, ఆకలితో ఆపకుండా ఏడుస్తోందని, ముందు స్టేషన్లో ప్రయత్నించినా పాలు దొరకలేదని చెప్పారు.

దాంతో, ఇంద్రయాదవ్ వెంటనే పాపకు పాలు తీసుకురావడానికి స్టేషన్ బయటకు పరిగెత్తాడు. ఒక షాపులో పాల ప్యాకెట్ కొని స్టేషన్ దగ్గరకు వచ్చాడు.

అదే సమయానికి రైలు బయల్దేరుతోంది. అది చూడగానే ఇంద్రయాదవ్ సాఫియా ఉన్న కోచ్ వైపు పరిగెత్తాడు. రైలు వేగం అందుకున్నప్పటికీ ఆమె ఉన్న బోగీ దగ్గరకు చేరుకుని ఆ పాల ప్యాకెట్ అందించగలిగాడు.

సాయానికి తల్లి కృతజ్ఞతలు

ఈ ఘటన జరిగిన తర్వాత సాఫియా ఇంద్రయాదవ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

గోరఖ్‌పూర్ చేరుకున్న తర్వాత పాప కోసం ప్రాణాలకు తెగించి సాయం చేసిన ఆ కానిస్టేబుల్‌కు సాఫియా ఒక వీడియో సందేశం పంపించారు. తన చిన్నారి కోసం అతడు చేసిన సాహసానికి ధన్యవాదాలు చెప్పారు.

ఆమె ఆ వీడియో సందేశంలో “రైలు వేగం అందుకోవడంతో, ఈసారైనా పాలు దొరుకుతాయిలే అనుకున్న నా ఆశలు ఆవిరైపోతూ వచ్చాయి. అదే సమయంలో ఎవరో పరిగెత్తుతూ కిటికీలోంచి పాలు లోపలికి అందించారు. ఇంద్ర భాయ్ లాంటి వారే మనకు అసలైన హీరోలు” అన్నారు.

వైరల్ అయిన వీడియో

ఈ ఘటన రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఇంద్రయాదవ్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.

అటు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ట్విటర్‌లో అతడిని ప్రశంసించారు. ఇంద్రయాదవ్‌కు క్యాష్ రివార్డు కూడా ఇస్తానన్నారు.

పీయూష్ తన ట్విటర్‌లో “రైల్వే కుటుంబం సాహసోపేత చర్య. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇంద్రయాదవ్ డ్యూటీ సమయంలో తన సాహస కార్యం చేశారు. నాలుగు నెలల పాప కోసం వెళ్తున్న రైలు వెనక పరుగులు తీశారు. నాకు గర్వంగా ఉంది. నేను ఇంద్ర యాదవ్‌ను నగదు పురస్కారంతో గౌరవిస్తామని ప్రకటిస్తున్నాను” అన్నారు.

దీనిపై సాఫియా హష్మీ “నేను బెలగావ్‌లో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయాను. మాకు శ్రామిక్ రైల్లో తిరిగి గోరఖ్‌పూర్ వెళ్లే అవకాశం దొరికింది. కానీ, దారిలో పాపకు పాలు అయిపోయాయి. భోపాల్ స్టేషన్లో నేను ఇంద్రయాదవ్‌ను సాయం చేయమని అడిగాను. పాప ఆకలితో ఏడుస్తోందని చెప్పాను” అన్నారు.

“ఆ తర్వాత ఆయన నన్ను అక్కడే ఉండమని వెంటనే బయటకు పరిగెత్తాడు” అన్నారు.

చిన్నారి ఆకలి తీర్చాడు

ఏడుస్తున్న పాపకు సాఫియా నీళ్లలో బిస్కెట్లు తడిపి తినిపిస్తోంది. కానీ వాటితో ఆకలి తీరకపోవడంతో పాప ఏడుస్తూనే ఉంది. అదే సమయంలో ఇంద్రయాదవ్ వారిపాలిట దేవుడులా వచ్చాడు.

ఈ ఘటన గురించి ఇంద్రయాదవ్ బీబీసీతో “రైల్లో ఆ మహిళ తన సమస్య చెప్పింది. పాలు దొరకలేదని, పాపకు బిస్కెట్లు నీళ్లు ఇస్తున్నానని చెప్పింది. దాంతో నేను ఆమెను అక్కడే ఉండమన్నా, ఆమెతో మాటల్లోనే ఐదు నిమిషాలు గడిచిపోయాయి” అన్నాడు.

“నేను వేగంగా బయటకు వెళ్లాను, షాపులో పాలు తీసుకుని వచ్చాను. అప్పటికే రైలు వెళ్లిపోతోంది. దాంతో దాని పక్కనే పరిగెత్తాను. ఫ్లాట్ ఫాం ముగిసేలోపే బోగీలో ఉన్న ఆ మహిళకు పాలు అందించగలిగాను” అన్నాడు.

ఒక పోలీస్ ఏం చేయాలో తను అదే పనిని చేశానని ఇంద్ర యాదవ్ చెబుతున్నాడు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)