కరోనావైరస్: మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే రోగ నిరోధక వ్యవస్థ, మీ శరీరంపైనే దాడి చేస్తే..

    • రచయిత, ఎంబర్ డాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోని చాలా ఆస్పత్రులు ప్రస్తుతం కోవిడ్-19 రోగులతో నిండిపోయి ఉన్నాయి. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా చనిపోయారు.

వీరిలో ఎక్కువగా రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారే చనిపోయారు. అంతమాత్రాన, మిగతా వారికి దీని వల్ల ప్రమాదం ఉండదని కాదు. కోవిడ్-19 మృతుల్లో చాలా మంది యువకులు, ఆరోగ్యవంతులు కూడా ఉన్నారు.

దీనికి కారణం

మన శరీరంలో ఎప్పుడైనా, ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ ప్రవేశిస్తే, మన రోగ నిరోధక శక్తి వాటితో యుద్ధం చేస్తుంది. దానిని బలహీనపరిచి అంతం చేస్తుంది.

కానీ, చాలాసార్లు మన శరీరంలో శత్రువుతో లేదా వ్యాధితో పోరాడే ఆ కణాల సైన్యం తిరుగుబాటు చేస్తుంది. శత్రువును అంతం చేసే ప్రయత్నాల్లో మన శరీరానికే నష్టం కలిగించడం మొదలెడుతుంది.

ఈ కణాల సైన్యం, మన శరీరాన్ని కాపాడే మిగతా కణాలపైన దాడి చేస్తుంది.

మన రోగ నిరోధక వ్యవస్థ అవసరానికి మించి చురుగ్గా మారినపుడు, అది వ్యాదులతో పోరాటం చేయడానికి బదులు అది మన శరీరానికే నష్టం కలిగిస్తుంది. దానిని ‘సైటోకైన్ స్టార్మ్’ అంటారు.

ఇందులో రోగ నిరోధక వ్యవస్థ కణాలు ఊపిరితిత్తుల దగ్గర పేరుకుపోతాయి. ఊపిరితిత్తుల్ని కాపాడాల్సిన కణాలే వాటిపై దాడి చేస్తాయి. ఆ ప్రక్రియలో రక్తనాళాలు పగిలిపోతాయి. వాటిలోని రక్తం లీక్ అవడం మొదలవుతుంది. ఫలితంగా శరీరంలో రక్తపోటు పడిపోతుంది. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం లాంటి సున్నితమైన అవయవాలు పనిచేయడం ఆగిపోతుంది లేదా అవి రిలాక్స్ అయిపోతాయని చెప్పవచ్చు.

రోగులు కోమాలోకి వెళ్లే ప్రమాదం

శరీరంలో ఎప్పుడు ‘సైటోకైన్ స్టార్మ్’ సంభవించినా, అది ఆరోగ్యవంతుల కణాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. రక్తంలో ఎర్ర, తెల్ల రక్త కణాలు అంతరించడం మొదలవుతుంది. కాలేయానికి నష్టం జరుగుతుంది.

‘సైటోకైన్ స్టార్మ్’ వచ్చిన సమయంలో రోగికి తీవ్ర జ్వరం, తలనొప్పి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది రోగులు కోమాలోకి కూడా వెళ్లవచ్చు. అలాంటి రోగులు మనకు అంతుపట్టని విధంగా అనారోగ్యానికి గురవుతారు. అయితే, డాక్టర్లు ఇప్పటివరకూ ఆ పరిస్థితిని మాత్రమే అర్థం చేసుకోగలిగారు.సైటోకైన్ స్టార్మ్‌ను పరీక్షించే ఎలాంటి విధానం మన దగ్గర లేదు. కోవిడ్-19 రోగులకు సైటోకైన్ స్టార్మ్ రావచ్చనే సమాచారాన్ని ప్రపంచానికి చెప్పింది వుహాన్ డాక్టర్లే. వారు 29 మంది రోగులపై ఒక పరిశోధన చేశారు. వారిలో ఐఎల్-2, ఐఎల్-6 ‘సైటోకైన్ స్టార్మ్’ లక్షణాలను గుర్తించారు.

వుహాన్‌లోనే 150 కరోనా కేసులపై జరిగిన మరో పరిశోధనలో కూడా కోవిడ్ వల్ల చనిపోయేవారిలో ఐఎల్-6, సీఆర్పీ ‘సైటోకైన్ స్టార్మ్’ మాలిక్యులర్ ఇండికేటర్ ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. అయితే దీన్నుంచి బయటపడినవారిలో ఆ ఇండికేటర్లు తక్కువగా ఉన్నాయి.

అమెరికాలో కూడా కోవిడ్ రోగుల్లో ‘సైటోకైన్ స్టార్మ్’ వచ్చినట్టు ఎక్కువగా కనిపించింది.

ఇది ఎలా తెలుస్తుంది?

కోవిడ్-19 వైరస్‌కు గురైన వారిలో రోగ నిరోధక సామర్థ్యం ఉన్న కణాలు ఊపిరితిత్తులపై చాలా త్వరగా, వేగంగా దాడి చేస్తాయి. దానివల్ల ఊపిరితిత్తులపై ఫైబ్రోసిస్ అనే గుర్తులు ఏర్పడుతాయి. వైరస్ యాక్టివ్‌గా ఉండడం వల్లే బహుశా అలా జరుగుతుంది.

“సైటోకైన్ స్టార్మ్ కు ఒక మహమ్మారితో లింకు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 1918లో ఫ్లూ, 2003లో సార్స్ మహమ్మారి(సార్స్ వ్యాధికి కూడా కరోనావైరస్ కుటుంబంలోని ఒక వైరసే కారణం) వచ్చిన సమయంలో కూడా ఎక్కువ మంది బహుశా దీనివల్లే చనిపోయారు. హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూలో కూడా చాలా మందిలో రోగనిరోధక కణాల తిరుగుబాటు వల్లే ఎక్కువ మరణాలు సంభవించి ఉండచ్చు” అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఫ్లూ మహమ్మారి వచ్చినపుడు, రోగులు బహుశా వైరస్ వల్ల చనిపోలేదని, వారి శరీరంలో రోగ నిరోధక శక్తి అత్యంత చురుగ్గా మారడం వల్లే జరిగాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శరీర రోగనిరోధక సామర్థ్యంలోనే సమతుల్యం లేనప్పుడు మనిషి కచ్చితంగా చనిపోతారని చెప్పారు.

ఈ తుపానుకు చికిత్స?

మన రోగనిరోధక కణాలు అదుపు తప్పిపోకుండా ఉండడానికి రోగ నిరోధక సామర్థ్యాన్ని శాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. దాని చికిత్సకు మొదటి ఎంపిక స్టెరాయిడ్ మాత్రమే. కానీ కోవిడ్-19 చికిత్సలో స్టెరాయిడ్ వల్ల ప్రయోజనం ఉంటుందా, లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

కొన్ని ప్రత్యేక రకం సైటోకైన్‌లను అడ్డుకోడానికి మార్కెట్లో చాలా రకాల మందులు లభిస్తున్నాయి.

సైటోకైన్‌తో పోరాడ్డానికి స్టెరాయిడ్‌ బాంబు లాంటిదైతే, దానికి వాడే మిగతా మందులు టార్గెటెడ్ మిసైళ్ల లాంటివి. రోగనిరోధక వ్యవస్థ చక్కగా పనిచేసేలా, గందరగోళానికి గురైన కణాలను తొలగించడానికి రోగికి ఈ మందులు ఇస్తారు.

ఉదాహరణకు అనాకిన్రా(కినెరెట్) అనేది మనిషిలోని సహజ ప్రొటీన్ మోడిఫైడ్ వర్షన్. ఇది సైటోకైన్ ఐఎల్-1 కోసం రిసెప్టర్స్ ను అడ్డుకుంటుంది. రిహ్యూమటైడ్ ఆర్థరైటిస్ చికిత్స కోసం ఈ మందు అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందింది.

అలాగే టోసిలిజుమాబ్(ఎక్టెమ్రా) కూడా కోవిడ్-19 చికిత్సలో ప్రయోజనకరంగా నిరూపితం కావచ్చు.

సాధారణంగా ఈ మందును కూడా ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, ఇమ్యోథెరపీ చేయించుకునే క్యాన్సర్ రోగుల్లో సైటోకైన్ స్టార్మ్ అదుపు కావడానికి ఇస్తుంటారు.

ఫిబ్రవరిలో చైనాలో 21 మంది కోవిడ్ రోగులపై దీనిని ప్రయోగించారు. కొన్ని రోజుల్లోనే వారిలో కోవిడ్ లక్షణాలు తగ్గినట్లు కనిపించాయి. వారిలో 19 మందిని వారంలోనే డిశ్చార్జ్ చేశారు. కోవిడ్-19 కోసం సైటోకైన్ బ్లాకర్స్ పై చాలా రకాల క్లినికల్ రీసెర్చులు జరుగుతున్నాయి. టోసిలిజుమాబ్ పై ఇటలీ, చైనాలో పరిశోధనలు జరుగుతున్నాయి.

కోవిడ్ రోగుల్లో సైటోకైన్ స్టార్మ్ ను నియంత్రించడంలో టోసిలిజుమాబ్ చాలా సమర్థంగా పనిచేస్తుందని తేలింది. అసలు సైటోకైన్ స్టార్మ్ ను గుర్తించడమే చాలా పెద్ద విషయం అని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల తరచూ జనం మరణిస్తున్నా, డాక్టర్లు దానిని తెలుసుకోలేకపోతున్నారు.

రోగనిరోధక శక్తి మనల్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది. కానీ అదే మనల్ని మృత్యువు ఒడిలోకి చేరిస్తే. అలా జరగకుండా మనం ఏం చేయాలి. కచ్చితంగా ఆ శక్తి మనపై తిరుగుబాటు చేయకుండా అడ్డుకోవాలి. పరిశోధకులు అదే దిశగా పనిచేస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)