కరోనావైరస్: చైనా కిట్లను, మాస్కులను తిరస్కరిస్తున్న యూరప్ దేశాలు

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం చైనాలో తయారు చేసిన వైద్య పరికరాలను యూరప్‌లోని పలు దేశాలు తిరస్కరించాయి.

చైనా నుంచి వచ్చిన వేలాది కోవిడ్-19 టెస్టింగ్ కిట్లు, సర్జికల్ మాస్కులు ప్రమాణాలకు తగినట్లుగా లేవని స్పెయిన్, టర్కీ, నెదర్లాండ్స్ అధికారులు చెప్పారు.

యూరప్ దేశాల్లో కరోనావైరస్ ప్రభావం ప్రస్తుతం తీవ్రంగా ఉంది. లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో ఈ మహమ్మారి బారినపడి 10,000 మందికి పైగా మరణించారు.

ఈ వైరస్ మొదట చైనాలోని వూహాన్ నగరంలో 2019 ఆఖరులో బయటపడింది. దీనిని కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేసింది.

లోపం ఏంటి?

నాసీరకంగా ఉన్న 6,00,000 ఫేస్ మాస్కులను వెనక్కి పంపిస్తున్నట్లు నెదర్లాండ్స్ ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. అవి మార్చి 21న చైనాలోని ఓ సంస్థ నుంచి వచ్చాయి, వెంటనే దేశంలోని వైద్య బృందాలకు వాటిని పంపిణీ చేశారు. కానీ, వాటిలో లోపాలు ఉన్నాయని తాజాగా అధికారులు గుర్తించారు.

వాటి నాణ్యతకు సంబంధించి ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, ప్రమాణాలకు తగినట్లుగా మాస్కులు లేవని, వాటిలోని ఫిల్టర్లు సరిగా పనిచేయడం లేదని డచ్ అధికారులు అంటున్నారు.

"ఆ లోపాలను గుర్తించిన వెంటనే మిగిలిన మాస్కుల పంపిణీని నిలిపివేశాం. ఆ షిప్‌మెంట్‌లో వచ్చిన మాస్కుల్లో దేనినీ ఉపయోగించకూడదని నిర్ణయించాం" అని చెప్పారు.

చైనా కంపెనీల నుంచి వచ్చిన టెస్టింగ్‌ కిట్ల విషయంలో స్పెయిన్ ప్రభుత్వం కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంది.

కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని లక్షల కిట్లను చైనా నుంచి తెప్పించామని, వాటిలో లోపాల కారణంగా దాదాపు 60,000 మందిలో వైరస్ ఉందా? లేదా? అని కచ్చితంగా నిర్ధరించలేకపోయామని స్పెయిన్ తెలిపింది.

అయితే, ఆ కిట్ల వెనకున్న షెన్‌జెన్ బయోఈజీ బయోటెక్నాలజీ సంస్థకు, తన ఉత్పత్తులను విక్రయించేందుకు చైనా వైద్య అధికారుల నుంచి అధికారిక అనుమతులు లేవని స్పెయిన్‌లోని చైనా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

చైనా ప్రభుత్వంతో పాటు, అలీబాబా గ్రూపు విరాళంగా పంపించిన వైద్య పరికరాల్లో షెన్‌జెన్ బయోఈజీ సంస్థ తయారు చేసినవి లేవని చైనా వివరణ ఇచ్చింది.

చైనా కంపెనీల నుంచి తెప్పించిన కొన్ని టెస్టింగ్ కిట్లు సరిగా లేవని టర్కీ కూడా ప్రకటించింది. అయినా 3,50,000 కిట్లు బాగానే పనిచేశాయని తెలిపింది.

తన ప్రభావాన్ని విస్తరించేందుకు కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని చైనా వాడుకుంటుందోని విమర్శకులు హెచ్చరించిన తర్వాత, నాణ్యతలేని పరికరాలకు సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి.

ధాతృత్వ రాజకీయాలతో తన ప్రభావాన్ని చూపించేందుకు చైనా ప్రయత్నిస్తోందని యూరోపియన్ యూనియన్ ప్రధాన దౌత్యవేత్త జోసెఫ్ బొరెల్ ఇటీవల తన బ్లాగులో రాశారు.

అలాంటి ఎత్తుగడలను యూరప్ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

యూరప్‌లో పరిస్థితి ఏంటి?

సోమవారం నాడు, స్పెయిన్‌లో 24 గంటల వ్యవధిలోనే 812 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 7,300 దాటింది. ఈదేశంలో మొత్తం కేసుల సంఖ్య 85,000 దాటిపోయింది.

స్పెయిన్‌లో కొత్త ఆంక్షలు కూడా అమలులోకి వచ్చాయి. అత్యవసరం కాని పనులకు ఎవరూ బయటకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. కనీసం మరో రెండు వారాల పాటు కఠిన ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది.

ప్రపంచంలో కరోనావైరస్ వల్ల ఇటలీ కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఈ దేశంలో 10,000 మందికి పైగా మరణించారు. దాదాపు లక్ష మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మొత్తం కరోనా కేసుల విషయంలో ప్రస్తుతం అమెరికా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ, మరణాల రేటు మాత్రం ఇటలీ చాలా ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి:

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)