కరోనావైరస్ మాస్క్: మాస్కు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రేమ జంటకు జరిమానా విధించిన కోర్టు

    • రచయిత, అరవింద్ ఛాబ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమ తల్లిదండ్రులకు, బంధువులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో వారి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కోర్టు మెట్లు ఎక్కింది ఓ జంట. తమకు పోలీసు రక్షణ కల్పించాలని వేడుకుంది. అయితే ఆ జంట పెళ్లి ఫోటోలు చూసిన న్యాయమూర్తి వివాహ సమయంలో ఇద్దరూ మాస్కులు ధరించలేదని, అది వాళ్ల ప్రాణాలకే ముప్పంటూ పది వేల రూపాయల జరిమానా విధించారు. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది.

కరోనావైరస్ కల్లోలం సృష్టిస్తున్న ఈ పరిస్థితుల్లో దేశంలో ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి చేశాయి ప్రభుత్వాలు.

కానీ ఆ జంట పెళ్లికి హాజరైన వారు కానీ, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కానీ మాస్కులను ధరించలేదు. దీంతో వారికి పది వేల రూపాయల జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని 15 రోజుల్లో హోషియార్‌పూర్ డిప్యూటీ కమిషనర్‌కు అందజేయాలని పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశించింది.

అంతే కాదు వారు చెల్లించి జరిమానా మొత్తం ప్రజలుకు ఉచితంగా మాస్కులు అందజేసేందుకు వినియోగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

పిటిషన్‌తో పాటు పెళ్లి ఫోటోలను కూడా జత చేయడం సర్వ సాధారణం. ఈ జంట కూడా అలా చేయడం వల్ల తమ వివాహానికి మరింత చట్టబద్ధత ఉంటుందని భావించింది. వారి పెళ్లి ఉత్తర పంజాబ్‌లోని ఓ గురద్వారలో జరిగింది.

అయితే తాను సాధారణంగా మాస్కును ధరిస్తానని, కానీ పెళ్లి సమయంలో కూడా మాస్కు వేసుకోవాలని గుర్తించలేకపోయానని పెళ్లి కుమారుడు పవన్ దీప్ సింగ్ బీబీసీతో అన్నారు.

“వివాహానికి హాజరైనవారు కూడా మాస్కులు ధరించారు. కానీ ఫోటో షూట్ కోసం వారు వాటిని తొలగించారు. అన్ని వేళల్లోనూ మాస్కులు ఉంచాలన్న విషయం వాళ్లకు కూడా తెలియదు. ఇక నుంచి జాగ్రత్త పడతాం” అని పవన్ తెలిపారు.

అంతే కాదు.. “ మా ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో మా కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. అమ్మాయి కుటుంబం తమ కులానికి చెందిన వ్యక్తితోనే ఆమె పెళ్లి చెయ్యాలని భావించింది. ప్రస్తుతం వారి అనుమతి లేకుండా తాము ఇద్దరం వివాహం చేసుకోవడంతో వాళ్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు” అని ఆయన చెప్పుకొచ్చారు.

మాస్క్ ధరించకపోవడం వల్ల కల్గిన నష్టం బహుశా ఆ దంపతులకు కాస్త భరించలేనిదే కావచ్చు. కానీ మాస్కు ధరించడం ఎంత ముఖ్యం అన్నది ఈ తీర్పు ద్వారా ప్రజలకు తెలుస్తుందని గుర్మిత్ సింగ్ అనే న్యాయవాది అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం చంఢీఘర్‌లో మాస్కు ధరించకపోతే రూ.500 జరిమానా విధిస్తున్నారు.

మరోవైపు ఆ జంటకు వారి కుటుంబ సభ్యుల నుంచి తగిన రక్షణ కల్పించాలంటూ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు కోర్టు ఆదేశించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)