కరోనావైరస్ వ్యాక్సిన్: ‘200 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారీకి ఒప్పందాలు చేసుకున్నాం.. సెప్టెంబరులో తొలి డెలివరీ’ - బ్రిటన్ సంస్థ వెల్లడి, భారత్‌లోనూ తయారీ

కరోనావైరస్ కోసం తాము టీకా తయారు చేశామని.. అది ప్రస్తుతం పరీక్షల దశలోనే ఉన్నప్పటికీ భారీ ఎత్తున ఉత్పత్తి చేయటం కూడా ప్రారంభిస్తున్నామని బ్రిటన్‌కు చెందిన ఔషధ సంస్థ అస్ట్రాజెనెకా యజమాని బీబీసీకి చెప్పారు.

"ఒకవేళ ఈ వ్యాక్సిన్ ప్రభావం చూపించగలదని నిరూపితమైతే.. తర్వాత వచ్చే డిమాండును అందుకోడానికి, మా సంస్థ ఇప్పుడే డోసులు తయారుచేయడం ప్రారంభించాలి" అని పాస్కల్ సోరియట్ చెప్పారు.

"మేం ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఇప్పుడే ప్రారంభిస్తున్నాం. పరీక్షల ఫలితాలు వచ్చే సమయానికి మనం ఉపయోగించడానికి అది రెడీగా ఉండాలి" అన్నారాయన.

ఈ టీకాను 20 లక్షల డోసులు సరఫరా చేయగలనని ఆస్ట్రాజెనెకా చెబుతోంది.

బీబీసీ టుడే కార్యక్రమంలో మాట్లాడిన సోరియట్ "వ్యాక్సిన్ తయారీ ఇప్పటికే ప్రారంభమైంది. ఎందుకంటే మేం వీలైనంత త్వరగా దాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాం. అయినా, ఈ నిర్ణయంలో రిస్క్ ఉంటుందని మాకు తెలుసు. కానీ, అది ఆర్థిక నష్టమే. వ్యాక్సిన్ పనిచేయకపోతేనే ఆ నష్టం వస్తుంది." అన్నారు.

"అప్పుడు మేం తయారు చేసిన అన్ని పదార్థాలు, అన్ని వ్యాక్సిన్లూ వృథా అవుతాయి. మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి, లాభాలు ఆర్జించాలని ఆస్ట్రాజెనెకా కోరుకోవడం లేదు" అని ఆయన చెప్పారు.

ఈ టీకా వ్యాక్సిన్ పనిచేస్తే, గురువారం రెండు కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేసిన తర్వాత ఈ కంపెనీ 20 లక్షల డోసులు ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇది ఒప్పందం చేసుకోబోతున్న సంస్థల్లో ఒక బిలియనీర్ బిల్ గేట్స్ కు సంబంధించినది.

ఆస్ట్రాజెనెకా ఈ వ్యాక్సిన్‌ను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కలిసి తయారుచేసింది. ఈ టీకా సగం డోసులను దిగువ, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేసేందుకు అంగీకరించింది.

బిల్‌గేట్స్‌ సహకారంతో నడిచే సంస్థలతోపాటు ఆస్ట్రాజెనెకాతో చేతులు కలిపిన మరో సంస్థ భారత్‌కు చెందిన ''సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా'' (ఎస్ఐఐ).

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరిమాణంలో వ్యాక్సిన్‌ను తయారు చేసే కంపెనీగా ''సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా''కు పేరుంది.

బిల్‌గేట్స్‌ మెలిండా గేట్స్‌ సహకారంతో నడిచే రెండు సంస్థలు మిగిలిన 750 మిలియన్‌ డాలర్లు (రూ. 566 కోట్ల) విలువైన ఒప్పందాన్ని దక్కించుకున్నాయి.

''ది కొయిలిషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌' (సీఈపీఐ-సెపి), గావి వ్యాక్సిన్‌ అలయన్స్‌ అనే రెండు ఛారిటీ సంస్థలు 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాకు సహకరిస్తాయి. ఈ సంవత్సరాంతానికల్లా డెలివరీ మొదలు కావచ్చని అంచనా.

ఎజెడ్‌డి 1222 వ్యాక్సిన్‌ ప్రభావం చూపించగలుగుతుందా లేదా అన్నది ఈ ఏడాది ఆగస్టు కల్లా తెలిసిపోతుందని ఆస్ట్రా జెనెకా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పాస్కల్ సొరియట్ అన్నారు.

కాగా, వ్యాక్సీన్ పని చేయకపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని సెపి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ హాచే అభిప్రాయపడ్డారు.

2020 సంవత్సరం ముగిసేనాటి 40 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేలా భారత్‌కు చెందిన ''సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌ ఇండియా''తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, అందులో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను మధ్య, దిగువ ఆదాయ దేశాలకు పంపిణీ చేస్తామని ఆస్ట్రాజెనెకా సంస్థ వెల్లడించింది.

''ఇప్పటికే 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందాలు చేసుకున్నాం.ఈ వ్యాక్సిన్‌ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం'' అని ఆస్ట్రాజెనెకా సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యుటివ్ సొరియట్ అన్నారు.

''ఈ వైరస్‌ విశ్వవిషాదం, మానవకోటికి సవాల్‌'' అని అభిప్రాయపడ్డారు సొరియట్‌.

అమెరికాకు 30 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు, బ్రిటన్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ సరఫరాకు ఆస్ట్రాజెనెకా సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. సెప్టెంబర్‌ నాటికి తొలి డెలివరీ ఉంటుంది.

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీకి ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు భారీగా నిధులు కేటాయించాయి. అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ పరిశోధనలతో పోటీపడుతున్నాయి.

''వ్యాక్సిన్‌ మానవాళికి మేలు చేసేదిగా ఉండాలి. ప్రజావ్యాక్సిన్‌గా మారాలి. ఇదే ప్రపంచ దేశాల నేతలంతా కోరుకుంటున్నది'' అని గురువారం నాడు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ అభిప్రాయపడ్డారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)