'గగన్‌యాన్‌'లో మటన్, చికెన్ రుచిచూడనున్న భారత వ్యోమగాములు, ఇస్రోకు చేరిన ఆహార పదార్థాలు

మటన్, చికెన్ రుచిచూడనున్న భారత వ్యోమగాములు
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

భారత వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్తూ తాము తినబోయే కోడికూర, పాలకూర పప్పును అప్పుడే రుచిచూడబోతున్నారు. వాటిలో ఉప్పూకారం ఎంతుండాలో స్వయంగా చెప్పబోతున్నారు.

వ్యోమగాములు ఎంచుకున్న తర్వాత ఈ ప్రత్యేక ఆహార పదార్థాలను 2021లో జరిగే 'గగన్‌యాన్' కోసం అంతరిక్షంలోకి పంపించబోతున్నారు.

మైసూర్‌లో ఉన్న డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబరేటరీ (డీఎఫ్ఆర్ఎల్) అంతరిక్ష మిషన్‌లో వ్యోమగాములు తినడం కోసం 22 రకాల ఆహార పదార్థాలు తయారు చేసింది. వాటిలో తేలికపాటి ఆహారం, ఎక్కువ ఎనర్జీ అందించే ఆహారం, డ్రై ఫ్రూట్స్, పండ్లు లాంటివి ఉన్నాయి.

ఈ ఆహార పదార్థాలను పరీక్షించేందుకు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు డీఎఫ్ఆర్ఎల్ పంపించింది.

రెండు రోజుల క్రితం గగన్‌యాన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశామని, వారికి బెంగళూరులో ఉన్న 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్' (ఐఏఎమ్)లో వివిధ పరీక్షలు నిర్వహించామని ఇస్రో ప్రకటించింది.

ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ఈ నెల మూడో వారంలో శిక్షణ కోసం రష్యా వెళ్లబోతున్నారు.

అయితే, ఆ వ్యోమగాముల పేర్లు చెప్పడానికి ఇస్రో చీఫ్ కె.శివన్ నిరాకరించారు.

మటన్, చికెన్ రుచిచూడనున్న భారత వ్యోమగాములు

వ్యోమగాములు రుచిచూడనున్న వంటకాలు

"మేం తయారు చేసిన ఈ ఆహార పదార్థాలన్నింటినీ వ్యోమగాములు రుచిచూస్తారు. ఎందుకంటే, వారికి అవి ఎంత నచ్చాయి అనే దాన్ని బట్టి వాటి ఎంపిక ఆధారపడుతుంది. ఇస్రోకు చెందిన ఒక టీమ్ వీటిని పరీక్షిస్తుంది" అని డీఎఫ్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ దత్ సేమ్వాల్ బీబీసీతో చెప్పారు.

"వ్యోమగాముల కోసం శాకాహారం, మాంసాహారం రెండు రకాల పదార్థాలూ చేశాం. వీటిని వేడిచేసి తినాలి. మన భారతీయులు వేడి వంటకాలను ఇష్టపడతారు. మేం వీటిని వేడి చేసుకోడానికి ఒక పరికరం కూడా ఇస్తున్నాం. దానితో దాదాపు 92 వాట్ కరెంటుతో ఆహార పదార్థాలను వేడిచేయచ్చు. ఈ పరికరం వాటిని 70 నుంచి 75 డిగ్రీల వరకూ వేడి చేస్తుంది" అని ఆయన చెప్పారు.

"ఈ ఆహారం ఆరోగ్యకరం, ఏడాది వరకూ పాడవకుండా ఉంటుంది. వ్యోమగాములకు మటన్ లేదా చికెన్ కావాలని ఇస్రో అడిగింది. మేం చికెన్ కర్రీ, బిర్యానీ తయారు చేసి ఇచ్చాం. వాళ్లు వాటిని ప్యాకెట్ నుంచి తీసి వేడిచేసి తినేయవచ్చు" అన్నారు.

"మేం పైనాపిల్, పనస లాంటి పండ్లు కూడా ఇచ్చాం. స్నాక్స్ కోసం అవి చాలా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇడ్లీ-సాంబార్ లాంటి పదార్థాలన్నీ మేం రెడీమేడ్‌గా ఇస్తున్నాం. అంటే, సాంబారులో నీళ్లు కలుపుకుని తినేయవచ్చు" అన్నారు.

"అయితే.. ఒకసారి ప్యాకెట్ తెరిచాక, 24 గంటల్లోపు దాన్ని తినేయాల్సి ఉంటుంది. ఆ ఆహారాన్ని సగంలో అలా వదిలేయడానికి కుదరదు. మనం ప్యాకెట్ తెరవగానే అది మామూలు ఆహారం లాగే అయిపోతుంది".

మటన్, చికెన్ రుచిచూడనున్న భారత వ్యోమగాములు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నాసా ప్రమాణాల ప్రకారం ఆహార పదార్థాలు

డీఎఫ్ఆర్ఎల్ అంతరిక్ష మిషన్ కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలన్నీ నాసా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తయారయ్యాయి.

వ్యోమగాములు ఆ ఆహార పదార్థాల ప్యాకెట్ తెరిచినప్పుడు, వారి చుట్టూ ఎలాంటి సూక్ష్మక్రిములూ ఉండకూడదు.

అంతరిక్షంలో ఆహార పదార్థాలకు చాలా ప్రత్యేకమైన ప్రమాణాలు ఉంటాయి.

కానీ, ఇస్రోకు పంపినవాటిలో ఆ ఆహార పదార్థాలను తినడానికి ఉపయోగించే స్పూన్, చిన్న ప్లేట్ లాంటివి లేవని సేమ్వాల్ చెప్పారు.

1984లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ కోసం డీఎఫ్ఆర్ఎల్ ఆహార పదార్థాలు తయారు చేసింది. "మా దగ్గర ఆ నైపుణ్యం ఉంది" అని డాక్టర్ సేమ్వాల్ చెప్పారు.

అంతరిక్షంలో ఉపయోగించే ఆహారం ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్‌లో మన సైనికులకు ఇచ్చే ఆహార పదార్థాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)