కేంద్ర బడ్జెట్: గృహ రుణాల వడ్డీపై పన్ను మినహాయింపు రూ.3.5 లక్షలకు పెంపు

చౌక ఇల్లు

ఫొటో సోర్స్, PMAY-G

అందరికీ అందుబాటులో ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి సంబంధించిన పన్ను మినహాయింపులను రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు.

అయితే, 2020 మార్చి 31లోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా ఇంటి విలువ రూ.45 లక్షలలోపు ఉండాలి.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ పథకం కింద 2022 నాటికి ప్రతి ఒక్కరికీ గూడు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

గత అయిదేళ్లలో గ్రామాల్లో 1.54 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే, 2019-20 నుంచి 2021-22 మధ్య 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. కొత్తగా కట్టే ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు కూడా ఉంటాయని నిర్మల వెల్లడించారు.

సాంకేతికత సాయంతో ఇళ్ల నిర్మాణానికి పట్టే సమయం గణనీయంగా తగ్గినట్లుగా మంత్రి చెప్పారు. 2015-16లో సగటున 314 రోజులు పడితే అది 2017-18 నాటికి 114 రోజులకు తగ్గినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)