సజ్జన్ కుమార్‌: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేతకు యావజ్జీవ కారాగార శిక్ష

సజ్జన్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సజ్జన్ కుమార్

సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌ కుమార్‌కు దిల్లీ హైకోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

డిసెంబరు 31లోగా ఆయన లొంగిపోవాలని ఆదేశించింది.

సజ్జన్ కుమార్‌పై అభియోగాలను కొట్టివేస్తూ కిందికోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలుపుదల చేసింది.

''ఎన్ని సవాళ్లు ఎదురైనా సత్యమే నిలుస్తుందని చెప్పడం ద్వారా బాధితులకు నమ్మకం కల్పించడం చాలా అవసరం'' అని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

వీడియో క్యాప్షన్, 1984 అల్లర్లు: 3 రోజుల్లో 3 వేల మంది హత్య

ఇందిరాగాంధీ 1984 అక్టోబరు 31న తన సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన తరువాత దేశంలో సిక్కులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి.

ఆ సందర్భంగా సుమారు 2,800 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోనే అత్యధిక సంఖ్యలో ప్రాణ నష్టం నమోదైంది.

సజ్జన్ కుమార్‌ ఈ అల్లర్లను ప్రేరేపించారని, ఎందరో మరణానికి కారణమయ్యారని ఆరోపణలున్నాయి.

అజయ్ మాకెన్, జైపాల్ రెడ్డి, సజ్జన్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పదేళ్ల కిందట దిల్లీలో ఓ సభలో అప్పటి కేంద్ర మంత్రులు అజయ్ మాకెన్, జైపాల్ రెడ్డిలతో సజ్జన్ కుమార్

దిల్లీ కంటోన్మెంటు ప్రాంతంలో అయిదుగురి మరణానికి సజ్జన్ కుమార్ కారణమయ్యారన్న కేసులో ఆయనకు ఇప్పుడు యావజ్జీవ శిక్ష పడింది.

చామ్ కౌర్ అనే ప్రత్యక్ష సాక్షి గతంలోనే దీనికి సంబంధించి కోర్టులో సాక్ష్యం చెప్పారు.

'మన అమ్మను సిక్కులే చంపేశారు' అంటూ సజ్జన్ ప్రజలను రెచ్చగొట్టారని.. ఆయనలా రెచ్చగొట్టిన మరునాడే జనం గుంపులుగుంపులుగా చేసిన దాడిలో తన కుటుంబ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని చామ్ కౌర్ సాక్ష్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)