శబరిమల: అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు ఎందుకు వెళ్తారు?

ఫొటో సోర్స్, KERALA TOURISM
ప్రతి ఏటా వేలాది మంది భక్తులు మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్రకు వెళ్తుంటారు.
శబరిమల ఆలయం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఆలయంలో మహిళలు కూడా ప్రవేశించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేరళ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయినట్లైంది.
అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల ప్రయాణం కొంచెం కఠినంగా ఉంటుంది.
ఈ సుదీర్ఘ యాత్రలో భక్తులు కఠిన ఆహార నియమాలు, బ్రహ్మచర్యం పాటిస్తారు.
చాలా దూరం కాలినడకనే వెళ్తారు. 41 రోజుల పాటు చేసే అయ్యప్ప దీక్షలో భక్తులు ఇంకా ఎన్నో నియమాలు, ఆచారాలు అనుసరిస్తారు.
శబరిమల దారిలో ఇరుమలై (దీన్ని ఎరిమేలి అనీ అంటారు) అనే ఒక చిన్న పట్టణం ఉంది. అది అయ్యప్ప ఆలయానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇక్కడ ఆగడం అనేది అయ్యప్ప భక్తులకు ఒక నియమంగా వస్తోంది.

ఫొటో సోర్స్, KERALA TOURISM
అయ్యప్ప దర్శనం ముందు మసీదులో ప్రదక్షిణలు
మాల వేసిన భక్తులు ఇక్కడి తెల్లగా ఉండే భారీ మసీదులోకి వెళ్తారు. దీనిని వావర్ మసీదు అంటారు.
అయ్యప్ప స్వామిని, వావర్ స్వామిని ప్రార్థిస్తూ భక్తులు జయజయధ్వానాలు చేస్తారు.
మసీదులో ప్రదక్షిణలు చేసి, విభూది, మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రను కొనసాగిస్తారు.
అయ్యప్ప మాల ధరించిన భక్తులు తమ తమ సంప్రదాయాలను అనుసరించి మసీదులో పూజలు చేస్తారు.
అక్కడే నమాజు కూడా చేస్తారు. మసీదులో ప్రదక్షిణలు చేసే సంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది.
ఏటా శబరిమల ఆలయంతో మసీదుకు ఉన్న సంబంధాలను చెప్పేలా మసీదు కమిటీ ఒక ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ వేడుకను చందనకూడమ్( చందనం-కుంకుమ) అంటారు.
ఇరుమలైలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. కొండపైకి ఎక్కి వెళ్లే యాత్రికులు చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి వీరి ఇళ్లలో ఆగుతుంటారు.

ఫొటో సోర్స్, KERALA TOURISM
వావర్ స్వామి కథ
వావర్ అంటే ఒక సూఫీ సన్యాసి.
ఆయన అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. అయ్యప్పపై ఆయనకు ఉన్న భక్తి గురించి శతాబ్దాల నుంచీ చెప్పుకుంటున్నారు.
అందుకే భక్తులు శబరిమల యాత్రలో వావర్ స్వామి ఉన్న మసీదును దర్శించడం ఒక సంప్రదాయంగా మారింది.
వావర్ గురించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటికి చారిత్రక ఆధారాలు లభించడం లేదు. కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెబుతారు.
కొంతమంది మాత్రం మసీదులో ఒక కత్తి ఉందని, దానిని బట్టి వావర్ ఒక వీరుడు అయ్యుంటారని చెబుతారు.
కానీ వావర్ ఒక ముస్లిం, అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు.
కేరళ టూరిజం కూడా దీనిని రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా చేర్చింది.
అయ్యప్ప భక్తులు చేసే శబరిమల యాత్ర చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో పందల రాజవంశం యువరాజు మణికంఠన్ నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
- #MeToo: ఎం.జె. అక్బర్ మీద పోరాడేందుకు మహిళల ముందున్న మార్గాలేమిటి?
- #MeToo: ‘సోషల్ మీడియా లేకుంటే నా గోడు ఎవరూ వినేవారు కాదు’
- అమెరికా మధ్యంతర ఎన్నికలు: డోనల్డ్ ట్రంప్ భవిష్యత్తుకు ఇవెంత కీలకం?
- మొఘలుల పాలనలో నవరాత్రి వేడుకలు ఎలా జరిగేవి?
- #HisChoice: పాపకు తల్లిగా మారిన ఒక తండ్రి కథ
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- రఫేల్ ఒప్పందం: HAL ఉద్యోగులు వేల సంఖ్యలో రోడ్డున పడతారా?
- పాకిస్తాన్: ఆరేళ్ల జైనబ్ను రేప్ చేసి చంపిన నేరస్థుడికి ఉరి శిక్ష అమలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








