కుమారస్వామి: కుర్చీ ఇస్తే ఖాళీ చేయలేదు

ఫొటో సోర్స్, facebook/HDkumaraswamy
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్ణాటక రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ కూటమి, బీజేపీ మధ్య జరిగిన పోరు ముగిసిపోగా.. ఇప్పుడు అధికారం పంచుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ల మధ్య పోరు మొదలైంది.
బీజేపీకి అధికారం దక్కకుండా చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ.. ఫలితాలు వెలువడిన వెనువెంటనే జేడీఎస్కు మద్దతు పలకడమే కాకుండా ముఖ్యమంత్రి పీఠమూ ఆ పార్టీకే ఇవ్వడానికి సిద్ధమైంది.
ఫలితంగా రెండు పార్టీలు కలిసి బీజేపీ రాజకీయాన్ని తిప్పికొట్టగలిగాయి. యడ్యూరప్ప విశ్వాసపరీక్షలో నెగ్గలేనని తెలుసుకుని ముందే రాజీనామా చేశారు.
కానీ, బీజేపీని అడ్డుకున్నంత వరకు కలిసికట్టుగా ఉన్న జేడీఎస్-కాంగ్రెస్లు ఇప్పుడు పదవుల పంపకం విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి.
'సీఎం పీఠం మీదే' అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు పదవుల విషయంలో పట్టుపడుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలకు కుమారస్వామి సోమవారం దిల్లీ వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో గతంలో కుమారస్వామితో కాంగ్రెస్, బీజేపీలు కుదుర్చుకున్న పొత్తులు, ఒప్పందాలు ఎలా విఫలమైందీ చర్చకొస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2006లో కాంగ్రెస్కు షాకిచ్చిన కుమారస్వామి
2004లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 79 సీట్లు, కాంగ్రెస్కు 65, జేడీఎస్కు 58 సీట్లు వచ్చాయి. ఎవరికీ సంపూర్ణ ఆధిక్యం రాకపోవడంతో హంగ్ తప్పలేదు.
ఆ సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించడంతో కాంగ్రెస్కు చెందిన ధరమ్సింగ్ సీఎం అయ్యారు.
కానీ.. రెండేళ్లయినా కాకముందే కుమారస్వామి అడ్డం తిరిగారు సీఎం సీటు కోరారు. పొత్తు ధర్మాన్ని తప్పుతున్న కుమారస్వామిని, తండ్రి దేవెగౌడ వారించారు.
అయినా.. కుమారస్వామి మాత్రం 2006 జనవరిలో 42 మంది ఎమ్మెల్యేలతో సొంత పార్టీనే చీల్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
2007లో బీజేపీతోనూ అదే తీరు
కాంగ్రెస్ను వీడిన తరువాత కుమారస్వామి బీజేపీతో కలిశారు. కుమారస్వామి, బీజేపీల మధ్య అధికార బదలాయింపులకు సంబంధించి పొత్తు కుదిరింది.
2006 నుంచి 2009 వరకు మిగిలి ఉన్న కాలంలో కుమారస్వామి, బీజేపీలు సగం సగం కాలం అధికారం పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఆ ప్రకారం 2006 జనవరి చివర్లో కుమారస్వామి సీఎం కుర్చీలో కూర్చున్నారు.
ఒప్పందం ప్రకారం 2007 అక్టోబరు 3 నుంచి తమకు సీఎం పదవి ఇవ్వాలంటూ బీజేపీ 2007 సెప్టెంబరు చివర్లో కోరింది.
కుమారస్వామి అందుకు ససేమిరా అన్నారు. కానీ.. బీజేపీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడం, వారు మద్దతు ఉపసంహరించుకునేవరకు వెళ్లడంతో 2007 అక్టోబరు 8న ఆయన రాజీనామా చేశారు.
వెంటనే ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో రాష్ర్టపతి పాలన వచ్చింది. అయితే.. బీజేపీతో రాజీ కుదిరి వారికి మద్దతివ్వడంతో యడ్యూరప్ప సీఎం అయ్యారు.
అంతలోనే కుమారస్వామి మనసు మార్చుకుని మద్దతు ఉపసంహరించుకోవడంతో యడ్యూరప్ప ప్రభుత్వం వారం రోజులకే పడిపోయింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








