16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సజీవదహనం

ఫొటో సోర్స్, Ravi prakash/bbc
తనపై అత్యాచారం చేశారని గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసిన 16 ఏళ్ల బాలికను నిందితులు సజీవదహనం చేసి చంపేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జార్ఖండ్లో శనివారం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసుకు సంబంధించి 14 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్యాచారానికి గురైన బాలిక, ఆమె తల్లిదండ్రులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు.
గ్రామ పెద్దలు ఇద్దరు నిందితులకు రూ.50 వేల జరిమానా విధించి 100 చొప్పున గుంజీలు తీయించారు.
దీంతో ఆగ్రహించిన నిందితులు బాలిక తల్లిదండ్రులను కొట్టి.. ఆమెను సజీవదహనం చేశారు.
‘‘బాలికపై అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు మరికొందరితో వెళ్లి.. బాలిక తల్లిదండ్రులను కొట్టి ఆమెను సజీవ దహనం చేశారు.’’ అని స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచార్జి అశోక్ రామ్ వెల్లడించారు. ఈ మేరకు వార్తా సంస్థ ఏఎఫ్పీ తెలిపింది.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages
తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లినపుడు ఈ బాలికను ఇంటి నుంచి అపహరించినట్లు భావిస్తున్నారు.
రాజా కెండువ అనే గ్రామం సమీపంలోని అడవుల్లో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో నిందితులైన మరో నలుగురి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.
ఈ కేసులో గ్రామ పెద్దలపై కూడా కేసు నమోదు చేశారు.
ఇవికూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








