సియాచిన్: అక్కడ నిద్రలో కూడా సైనికుల ప్రాణాలు పోతుంటాయ్!

ఫొటో సోర్స్, PRASHANT PANJIAR
- రచయిత, ముకేష్ శర్మ
- హోదా, బీబీసీ హిందీ ఎడిటర్
సియాచిన్.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమి. 13 ఏప్రిల్ 1984.. అంటే సరిగ్గా 34 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత సైనికులు అక్కడ తొలిసారిగా పాగా వేశారు.
అప్పట్నుంచీ అత్యంత కఠినతర పరిస్థితులను ఎదుర్కొంటున్న సైన్యం, ప్రాణాలొడ్డి మరీ ఆ ప్రాంతానికి పహారా కాస్తున్నారు.
సియాచిన్ అంటే గులాబీల లోయ అని అర్థం. కానీ భారత్-పాక్ సైనికులకు ఆ గులాబీలే ముళ్లయి గుచ్చుకుంటున్నాయి.
సియాచిన్కు సామాన్యులు అంత సులువుగా వెళ్లలేరు. సైన్యం సాయంతో కొద్దిమందికి మాత్రమే ఆ అవకాశం దొరుకుతుంది. కొన్నాళ్ల క్రితం నాకూ ఆ అవకాశం దక్కింది.
చలికాలంలో అక్కడి ఉష్ణోగత్రలు -50 డిగ్రీలకు పడిపోతాయి. సియాచిన్లో భారత సైనికుల చిట్టచివరి క్యాంప్ని ‘ఇంద్ర కాల్’ అని పిలుస్తారు. బేస్ క్యాంప్ నుంచి అక్కడికి చేరుకోవడానికి సైనికులు 20-22 రోజుల పాటు నడవాలి.
ఆ మంచులో, చలిలో ఒంటరిగా నడవడం కూడా ప్రమాదకరమే. మంచుగడ్డలు ఎప్పుడు కుంగిపోయి గోతులు ఏర్పడతాయో తెలీదు. అందుకే సైనికులంతా నడుముకు తాడు కట్టుకొని ఒకరి వెనక ఒకరు క్యూలో నడుస్తూ ఒక్కో చెక్ పోస్ట్కు చేరుకుంటారు.

ఫొటో సోర్స్, PRESS INFORMATION BUREAU DEFENCE WING
ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి సైనికులు వేగంగా నడవడానికి కూడా వీల్లేదు. ఒక్కో క్యాంపుకి ఎంత సేపట్లో చేరాలో, అక్కడ ఎంత సేపు ఆగాలోనన్న నియమాలు కూడా పక్కాగా ఉంటాయి.
దారి మధ్యలో ఎన్నో ఎత్తుపల్లాలు, గోతులు కనిపిస్తాయి. చెట్లు, పక్షులు, జంతువులు లాంటివేమీ కనిపించవు.
అక్కడ మంచుమీద పడే సూర్య కిరణాలను నేరుగా చూసినా కూడా కంటిపై ప్రతికూల ప్రభావం పడి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. రాత్రులు గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎగిరొచ్చే మంచు శరీరానికి ముళ్లలా గుచ్చుకుంటుంది.
అందుకే సైనికులు అనేక పొరలుగా మందపాటి దుస్తులను వేసుకుంటారు. ఆయుధాల బరువుకు తోడు దుస్తులు, బూట్ల బరువు సైనికులకు మరింత భారమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
సైనికులు చెక్క బళ్లలపై స్లీపింగ్ బ్యాగ్స్లో పడుకుంటారు. కానీ నిద్ర కూడా వాళ్లకు ప్రమాదకరమే. ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో ఒక్కోసారి నిద్రలోనే వాళ్లు ప్రాణాలు కోల్పోతారు.
ఆ ప్రమాదాన్ని నివారించడానికి సైనికులను గార్డులు మధ్య మధ్యలో మేల్కొలుపుతుంటారు. నిజానికి అంత ఎత్తులో నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
ఇక స్నానం గురించి ఆలోచించే సాహసం కూడా వారు చేయరు. ఆ వాతావరణానికి చర్మం చాలా సున్నితంగా మారిపోతుంది. షేవింగ్ చేసుకుంటే చర్మం ఊడొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ పనికి కూడా వాళ్లు దూరంగా ఉంటారు.

ఒక్కో సైనికుడికి మూడు నెలల పాటు అక్కడ పోస్టింగ్ వేస్తారు. వాళ్లకు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే సైనికులు ఆ మూడు నెలలూ పహారా కాయాల్సి ఉంటుంది.
భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండటంతో సైనికులకు అక్కడ పెద్దగా పనుండదు. ఉన్నంత సేపు ఖాళీగానే సమయాన్ని గడపాల్సి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
సియాచిన్ను గస్తీ కాయడంలో వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ సేవలందించే హెలికాప్టర్ పేరు ‘చీతా’. అంత ఎత్తుకు ఆ హెలికాప్టర్లు మాత్రమే వెళ్లగలవని ఆర్మీ చెబుతుంది.
కాల్పుల విరమణకు ముందు ఒక్కో చెక్ పాయింట్ దగ్గర కేవలం 30 సెకన్లు మాత్రమే అవి ఆగేవి. ప్రత్యర్థులు స్పందించే లోగానే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఇలా చేసేవి. ఇప్పుడు కూడా సైనికులను అన్ని పరిస్థితులకు సమాయత్తం చేసేందుకు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు.
సైనికులకు అక్కడ వినోదానికి ఎలాంటి సాధనాలూ అందుబాటులో ఉండవు. ఎటు చూసినా తెల్లగా మెరిసే మంచు కొండల మధ్యే నిత్యం అప్రమత్తంగా ఉంటూ కఠిన వాతావరణాన్ని ఎదుర్కొంటూ కాలం గడపాలి.
ఇవి కూడా చదవండి:
- ఆసిఫా బానో: బాలికపై అత్యాచారం, హత్యపై రగులుతున్న కశ్మీరం
- ‘అప్పుడు అంబేడ్కర్ పేరు పలకడానికి సిగ్గుపడేదాన్ని.. ఇప్పుడు గర్వపడుతున్నా’
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
- అమెరికాకు రష్యా హెచ్చరిక: సిరియాలో మీరు దాడి చేస్తే మనిద్దరి మధ్య యుద్ధమే!
- అమెరికా కొత్త సుంకాలు చైనాను ఎంతగా దెబ్బ తీస్తాయి?
- కామన్వెల్త్ గేమ్స్ వలసవాద అవశేషమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








