‘మేం ఇజ్రాయెల్, హమాస్ ఇద్దరి చేతిలో బందీలం’- ఉత్తర గాజాలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

ఇజ్రాయెల్ బలగాలు ఉత్తర గాజాపై జల, వాయు, భూతల మార్గాల్లో పెద్దయెత్తున దాడులు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి. దీంతో లక్షల మంది ప్రజలు కుటుంబాలతో సహా ఈ ప్రాంతాన్ని వదిలి ‘సురక్షిత ప్రాంతాల’కు వలస వెళుతున్నారు.

ఉత్తర గాజాలో 11 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతాన్ని ఖాళీ చెయ్యడం అసాధ్యమైన పని అని అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి.

ఉత్తర గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ ఆదేశాలు తీవ్రమైన మానవీయ సంక్షోభానికి దారితీస్తాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ ఆదేశాలు గాజాను అగాథంలోకి తోసేస్తున్నాయని చెప్పింది.

ఎప్పుడనేది చెప్పకున్నా.. “మా దగ్గరున్నలక్షల మంది సైనికులతో సంపూర్ణ దాడికి ఏర్పాట్లు చేస్తున్నాం” అని ఇజ్రాయెల్ భద్రత బలగాలు ప్రకటించాయి.

ఈ ప్రాంతంలో పాగా వేసిన హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను ఇక్కడ నుంచి తుడిచివెయ్యడమే తమ ఆపరేషన్ “ఐరన్ స్వోర్డ్స్” లక్ష్యమంటోంది ఇజ్రాయెల్.

“ హమాస్‌లో ప్రతి ఒక్కర్ని చంపేస్తాం” అని అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ భీకర దాడిలో 1300 మంది మరణించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు చెప్పారు.

గాజాను హమాస్‌ 2007 నుంచి పాలిస్తోంది.

పారిపోయిన నాలుగు లక్షల మంది

ఇజ్రాయెల్ సైనికులు గాజా స్ట్రిప్‌లో ఇంటింటికి వెళ్లి సోదాలు చెయ్యడం, నగరాల్లో యుద్ధం చెయ్యడం వల్ల స్థానికులకు ఇబ్బంది ఏర్పడవచ్చు.

వైమానిక దాడుల వల్ల ఇప్పటికే వందల మంది చనిపోయారు. నాలుగు లక్షల మందికి పైగా స్థానికులు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.

వీరిలో ఎక్కువ మంది దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరానికి వస్తున్నారు. సొంత కార్లు ఉన్న వాళ్లు కార్లలో వస్తుంటే.. మిగిలిన వారంతా ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో నడిచే వస్తున్నారు.

వలస వస్తున్న శరణార్థులతో కొన్ని గంటల వ్యవధిలోనే ఖాన్ యూనిస్ జనాభా రెట్టింపవుతుందని అంచనా వేస్తున్నారు.

రోగులను తరలించాలనడం మరణ శాసనమే: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్దని చెబుతున్నా ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలోని ఆసుపత్రులకు కూడా అల్టిమేటం జారీ చేసింది.

“ఉత్తర గాజాకు 2 వేల మంది పేషంట్లను తరలించాలని ఒత్తిడి చెయ్యడం వారికి మరణ శాసనం రాయడం లాంటిదే” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేసింది.

కొంత మంది స్థానికులు మాత్రం తాము ఎక్కడకూ వెళ్లేది లేదని చెప్పారు.

“నేను దక్షిణ గాజా వెళ్లను. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక ప్రాంతంలో భద్రత ఉంది అనేది శుద్ధ అబద్దం” అని గజన్ మహమ్మద్ షలాబీ బీబీసీతో చెప్పారు. శుక్రవారం ప్రజల్ని తరలిస్తున్న సమయంలో జరిగిన పేలుడులో అనేక మంది మరణించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

ఈజిప్టు సరిహద్దులు తెరిస్తే, అక్కడ తమకు భద్రత లభిస్తుందని చాలా మంది ఆశతో ఉన్నారు.

“మాకు ఏమీ లేదు, ఎవరూ లేరు. అందుకే మేము ఇబ్బందులు పడుతున్నాం” అని 31 ఏళ్ల గాజన్ మహమ్మద్ బీబీసీతో చెప్పారు.

“పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి బయల్దేరడం కూడా ప్రమాదకరమే” అని ఆయన అన్నారు. మూడు రోజుల్లో వర్ణనాతీతమని చెప్పారు.

‘మేం వాళ్లద్దరి చేతిలో బందీలం’

“మేమిక్కడ హమాస్, ఇజ్రాయెల్ చేతిలో బందీలం” అని అన్నారు మహమ్మద్.

“ఇజ్రాయెల్ బలగాలు హమాస్ వారిని కనుక్కోలేకపోతే, వాళ్లు ప్రజల మీద, మౌలిక వసతుల మీద బాంబు దాడులు చెయ్యకూడదు. మేమేమీ జంతువులం కాదు, జూలో లేము. మేము మనుషులం’’ అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)