అల్లు అర్జున్: ‘బాధిత కుటుంబానికి నా క్షమాపణలు. త్వరలో వారిని కలుస్తా’

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జైలు నుంచి విడుదలయ్యాక తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. తాను బాగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. తనకు మద్దతు నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

శనివారం (డిసెంబర్ 14) ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాక గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు అల్లు అర్జున్.

ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ భార్య, పిల్లలను ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.

‘'బాధిత కుటుంబానికి నా క్షమాపణలు. త్వరలో ఆ కుటుంబాన్ని కలుస్తా’’ అని ఆయన అన్నారు.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ ఏమన్నారంటే..

‘‘నా పట్ల ఎంతో ప్రేమను చూపించినందుకు, నాకు అండగా నిలబడ్డందుకు అందరికీ ధన్యవాదాలు. నా అభిమానులకు కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చట్టాన్ని గౌరవిస్తాను. వారికి (పోలీసులకు) అన్ని రకాలుగా సహకరిస్తా. బాధిత కుటుంబానికి మరోసారి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలా జరగడం చాలా దురదృష్టకరం. సినిమా చూసేందుకు మేం వెళ్లాం. ఆ ఘటన జరిగింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అందుకు చాలా చింతిస్తున్నాం. దాదాపు 20 ఏళ్లుగా నా సినిమాలతో పాటు, నా అంకుల్స్ సినిమాలు విడుదలైనప్పుడు కూడా చూసేందుకు వెళ్తున్నాను. దాదాపు 30 సార్లు వెళ్లి ఉంటాను. ఎప్పుడూ అలా జరగలేదు. అది పూర్తిగా అనుకోకుండా జరిగిన ప్రమాదమే. అది చాలా దురదృష్టకర ఘటన. బాధిత కుటుంబానికి అండగా నిలబడతాను. మనిషిని కోల్పోయిన లోటును ఆ కుటుంబానికి తీర్చలేం, కానీ వారికి చేయగలిగినంత సాయం చేస్తా’’ అని అల్లు అర్జున్ అన్నారు.

కేసు గురించి మీడియా ప్రశ్నించగా.. ''నేను చట్టాన్ని గౌరవిస్తాను. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమీ మాట్లాడను'' అని అల్లు అర్జున్ చెప్పారు.

రాత్రంతా జైలులో ఉన్న అల్లు అర్జున్

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ఆయన్ను హైదరాబాద్‌ పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 13) అరెస్టు చేశారు.

తొలుత నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, ఆ తీర్పు పత్రాలు జైలు అధికారులకు రాత్రి ఆలస్యంగా అందాయి. దాంతో, ఆయన రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది.

చంచల్‌గూడ జైలులోని మంజీరా బ్యారక్‌లో అల్లు అర్జున్‌ను ఉంచారు. శనివారం (డిసెంబర్ 14) ఉదయం ఆయన్ను విడుదల చేశారు.

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, Getty Images

అల్లు అర్జున్‌ కేసు గురించి మరిన్ని వివరాలు..

డిసెంబర్ 5న 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలైంది. ఒకరోజు ముందు అంటే డిసెంబరు 4న ఏపీ, తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించారు.

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లోనూ బెనిఫిట్ షో వేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్ తన భార్య రేవతి (35), కుమారుడు శ్రీతేజ (9), కుమార్తె శాన్వికతో కలిసి అక్కడికి వచ్చారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు. థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట, తోపులాట కారణంగా రేవతి, శ్రీతేజకు ఊపిరి ఆడలేదని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనలో రేవతి చనిపోగా, శ్రీతేజ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీనిపై చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 5వ తేదీన 376/2024 కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఏ1గా సంధ్య 70ఎంఎం థియేటర్ యాజమాన్యం, సిబ్బందితో పాటు అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ సిబ్బందిని పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు.

రిమాండ్ రిపోర్టులో అల్లు అర్జున్‌ను ఎ11గా పేర్కొన్నారు.

ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, లోయర్ బాల్కనీ ఇన్చార్జిని అరెస్టు చేయగా, డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు.

ఈ కేసులో మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి:

''సంధ్య థియేటర్ యజమానులు ఎ.రాంరెడ్డి( పెద్దరాంరెడ్డి), ఎ.రాంరెడ్డి, ఎ.సందీప్, ఎ.సుమిత్, ఎ.వినయ్ కుమార్, ఎ.అశుతోష్ రెడ్డి, ఎం.రేణుకా దేవి, ఎ.అరుణరెడ్డి, థియేటర్ మేనేజర్ ఎం.నాగరాజు లోయర్ బాల్కనీ ఇన్చార్జి విజయ చందర్, సినీ నటుడు అల్లు అర్జున్, అల్లు అర్జున్ మేనేజర్ జేబి.సంతోష్ కుమార్, శరత్ బన్నీ, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది రమేష్, రాజు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు టీ.వినయ్ కుమార్, మహమ్మద్ పర్వేజ్, మైత్రిమూవీస్, పుష్ప 2 నిర్మాతలు, ఇతరులు'' అని పోలీసులు పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)