ఉత్తర ప్రదేశ్: చేతులకు బేడీలు, చుట్టూ పోలీసుల నడుమ అతీక్ అహ్మద్, అష్రఫ్‌ల హత్య

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌పై కాల్పులు జరిపి హత్య చేశారు.

అతీక్ అహ్మద్‌, అతని సోదరుడి హత్యను పోలీసులు ధృవీకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన వారు జర్నలిస్టుల వేషధారణలో వచ్చారు. కెమెరాల ముందే వీరిని దుండగులు హత్య చేశారు. ఈ దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు.

ఈ సంఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ప్రయాగ్‌రాజ్‌లో అతీక్ , అష్రఫ్ అహ్మద్‌ల హత్య నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి, భద్రతలను పరిరక్షించాలని యూపీ పోలీసులకు యోగి ఆదిత్యనాథ్ సూచించారు.

అంతేకాక, ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు కూడా యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

దీన్ని విచారించేందుకు ముగ్గురు సభ్యుల జ్యూడిషియల్ కమిషన్‌ ఏర్పాటు చేశారు.

వైద్య పరీక్షల కోసం అతీక్ , అష్రఫ్ అహ్మద్‌లను ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు ప్రయాగ్‌రాజ్ పోలీసు కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు.

కాల్పులకు పాల్పడ్డ వారు జర్నలిస్ట్‌ల పేరుతో వచ్చి, అతీక్ , అష్రఫ్‌లను అతి సమీపం నుంచి కాల్చారని ఆయన వెల్లడించారు.

దుండగులను వెంటనే పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

ఆస్పత్రికి దగ్గర్లోనే ఈ సంఘటన జరిగింది. వీరి మరణం తర్వాత పెద్ద ఎత్తున మతపరమైన నినాదాలు వినిపించాయి.

‘‘అతీక్ అహ్మద్, ఆయన సోదరుడితో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్న సమయంలో, జర్నలిస్ట్‌ల మాదిరిగా వచ్చిన దుండగులు ఈ కాల్పులు జరిపారు. కాల్పులకు పాల్పడ్డ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నాం’’ అని రమిత్ శర్మ తెలిపారు.

ఈ సంఘటనలో కొందరు పోలీసులకు, ఒక జర్నలిస్ట్‌కు కూడా గాయాలయ్యాయి.

అతీక్ అహ్మద్, అష్రఫ్‌ల హత్య తర్వాత ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని బ్లాక్ చేశారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమంతా సెక్షన్ 144 విధింపు

అతీక్, అష్రఫ్ అహ్మద్‌ల హత్య అనంతరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా సెక్షన్ 144 విధించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నారు.

ఈ ఘటనపై ఎలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ప్రజలకు యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఎవరైనా రూమర్లను సృష్టిస్తే ఊరుకునేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చట్టంతో ఎవరూ ఆడుకోవద్దని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటి వరకూ అతీక్, అష్రఫ్ హత్యకు సంబంధించి ఎలాంటి ప్రకటనలూ జారీ చేయలేదు. అతీక్, అష్రఫ్ హత్య కెమెరాలో రికార్డయ్యింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

వీడియోలో పోలీసులు దుండగులపై ఎదురు కాల్పులు జరుపుతున్నట్లు కనిపించడం లేదు.

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ హత్యపై సందేహాలు లేవనెత్తుతూ ఒక ట్వీట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో నేరాలు తారాస్థాయికి చేరాయని, నేరస్థుల్లో ధైర్యం పెరిగిందనీ విమర్శించారు.

పోలీసుల భద్రతలో ఉండగానే బహిరంగంగా కాల్పులు జరిపి వారిని హత్య చేశారంటే, ఇక సామాన్యుల భద్రత పరిస్థితేంటని ప్రశ్నించారు.

మరోవైపు “పాపపుణ్యాల లెక్క ఇదే జన్మలో జరుగుతుంది” అని ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఒక ట్వీట్ చేశారు.

లోక్‌సభ ఎంపీ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా యూపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

ఎన్‌కౌంటర్ రాజ్ అంటూ సంబరాలు జరుపుకునేవారు ఈ హత్యకు బాధ్యులని ట్వీట్‌లో పేర్కొన్నారు.

యూపీలో అతిక్ అహ్మద్, అతని సోదరుడి హత్యపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు.

యూపీలో రెండు హత్యలు జరిగాయని, మొదటిది అతీక్, అష్రఫ్‌ల హత్య కాగా, రెండోది లా అండ్ ఆర్డర్ అని సిబల్ ట్వీట్ చేశారు.

కాల్పులకు పాల్పడ్డ వారు ఎవరు?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాల్పులకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు వీరు ఎవరన్నది పోలీసులు ఇంకా తెలుపలేదు.

వీరిని విచారించిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలను చెబుతామని పోలీసులు చెప్పారు.

హత్య ఎలా జరిగింది?

వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చిన అతీక్ అహ్మద్‌ని పోలీసుల భద్రత నడుమ కారు నుంచి బయటికి దించారు. అతీక్ , ఆయన సోదరుడి చేతులకు బేడీలు వేసి ఉన్నాయి.

ఒక జర్నలిస్ట్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడితో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. స్వల్పవ్యవధిలోనే ఇద్దరు సోదరులు హత్యకు గురయ్యారు.

ఈ సంఘటనంతా వీడియోలో రికార్డయింది. ఆ వీడియోలో అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు పోలీసులతో కలిసి నడుస్తోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అతీక్ సమాధానం ఇచ్చే సమయంలో ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిగాయి. చాలా దగ్గర్నుంచి అతీక్‌ను దుండగులు కాల్చారు. ఏం జరిగిందో ఊహించే లోపే అష్రఫ్‌పై కూడా కాల్పులు జరిపారు. ఇద్దరు సోదరులు నేలపై కుప్పకూలిపోయారు.

ఈ హత్య జరిగిన సమయంలో అతీక్ అహ్మద్ న్యాయవాది విజయ్ మిశ్రా కూడా అక్కడే ఉన్నారు.

‘‘అతీక్ అహ్మద్‌, అష్రఫ్‌ని కారు నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాతనే కాల్పులు జరిగాయి. కాల్పులకు పాల్పడ్డ వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడంతా పరిస్థితి ఆందోళనకరంగా మారింది’’ అని అతీక్ అహ్మద్ న్యాయవాది మీడియాకు తెలిపారు.

కాల్పులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నా, హత్య చేసిన తర్వాత వారే పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్‌ హత్యకు గురయ్యారు. ఈ కేసు విషయమై అతీక్ అహ్మద్, అష్రఫ్‌లను పోలీసులు విచారిస్తున్నారు.

విచారణ పూర్తయిన తర్వాత, వారిని మరోసారి జ్యూడిషియల్ కస్టడీకి పంపాల్సి ఉంది. దానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలి.

పోలీసు కస్టడీలో తన భద్రతపై అతీక్ అహ్మద్ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

రాజు పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్, మరో ఇద్దరికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అష్రఫ్ మాత్రం నిర్దోషిగా విడుదలయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)