You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్: హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
- రచయిత, వద్ది ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేవాటిలో నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్, అందులోని బుద్ధ విగ్రహం తప్పక ఉంటాయి.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ విగ్రహం హైదరాబాద్ ప్రత్యేకతల్లో ఒకటి.
అయితే ఈ విగ్రహం చుట్టూ ఓ విషాద గాథ ఉందని, ఇది హుస్సేన్ సాగర్ అడుగున రెండేళ్లు ఉందని ఈ తరం వారిలో చాలా మందికి తెలియదు.
అప్పట్లో విగ్రహం తరలింపు సమయంలో దీని కింద పడి ఎనిమిది మంది చనిపోయారు.
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ద వాషింగ్టన్ పోస్టు అప్పట్లో ఈ విషాదంపై విమర్శనాత్మక కథనం కూడా రాసింది.
58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బరువు
తేదీ 1990 మార్చి 10.
అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ బుద్ధ విగ్రహం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.
58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బరువు గల ఈ విగ్రహం హుస్సేన్ సాగర్ మధ్యలో కొలువుదీరడానికి సిద్ధంగా ఉంది.
అదే రోజు బుద్దుడి విగ్రహం తరలింపులో అపశృతి చోటుచేసుకుంది.
విగ్రహం 35 అడుగుల లోతున నీటిలో పడిపోయింది. ఆ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారని ద వాషింగ్టన్ పోస్ట్ 1990లో 'బుద్ధ ఆఫ్ ది లేక్ బాటమ్' శీర్షికతో రాసిన ఒక కథనంలో ప్రస్తావించింది.
బుద్ధ విగ్రహం మునిగిన ఘటనపై రాజకీయ నాయకులు, జాతీయ, అంతర్జాతీయ మీడియా నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
దాదాపు రెండేళ్లు విగ్రహం అలా 'సాగర' గర్భంలోనే ఉండిపోయింది.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి...
ఆంధ్రప్రదేశ్లో 1984లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.
ఈ బుద్ధ విగ్రహం నెలకొల్పడానికి ఎన్టీఆర్ 1984 అమెరికా పర్యటన మూలమని ద వాషింగ్టన్ పోస్టు తన కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం... ఎన్టీఆర్ అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి అలాంటిదే తన రాష్ట్రంలో నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. ఆ విగ్రహం న్యూయార్క్ నగరంలోని లిబర్టీ ద్వీపంలో 1886వ సంవత్సరంలో ప్రతిష్టించారు.
'‘151 అడుగుల ఎత్తులో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా స్వేచ్ఛను ప్రతిబింబిస్తుంది, నేనూ అలాంటిదే కోరుకున్నాను. అది సమాజానికి నా వంతు సేవగా ఉంటుంది'’ అని ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారని ఆ కథనం తెలిపింది.
బుద్దుడి విగ్రహమే ఎందుకు?
గౌతమ బుద్దుడి విగ్రహం చెక్కించాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు.
బుద్దుడు గొప్ప మానవతా వాది అని, ప్రజలకు సత్యాన్ని బోధించాడని, ఆయన తమకు గర్వకారణమని, అందులోనూ భారతదేశంలో జన్మించాడని ఎన్టీఆర్ చెప్పారు.
అతిపెద్ద బుద్ధ విగ్రహం తయారు చేయడానికి స్తపతి గణపతిని నియమించారు. అప్పటికే ఆయనకు పలు ఆలయాలు, భవనాలు నిర్మించిన అనుభవం ఉంది.
విగ్రహం ఏక శిలతో రూపుదిద్దుకోవాలని ఎన్టీఆర్ కోరుకున్నారు.
విగ్రహం తయారీ కోసం హైదరాబాద్ సమీపంలోని నేటి యాదాద్రి భువనగిరిలో ఒక గ్రానైట్ కొండను గుర్తించారు.
ఎన్టీఆర్ చేతుల మీదుగా పని ప్రారంభమైంది.
విగ్రహానికి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయింది. గణపతి ఆధ్వర్యంలో రెండేళ్లు కష్టపడి ఈ ఏకశిల విగ్రహాన్ని చెక్కారు.
విగ్రహం హుస్సేన్ సాగర్ తీరంలోకి రావడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది.
ఈ భారీ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లోకి తరలించే బాధ్యతలు ఏదైనా కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హుస్సేన్ సాగర్లో విగ్రహం ప్రతిష్టించడానికి 15 అడుగుల వేదిక కూడా నిర్మించారు.
ఇక విగ్రహం ప్రతిష్టాపన ఒకటే మిగిలింది. అంతలోనే ఎదురుదెబ్బ తగిలింది ఎన్టీఆర్కు.
విగ్రహం మునిగిన క్షణం
విగ్రహ ప్రతిష్టాపనకు మూడు నెలలు ఉందనగా (1989 డిసెంబర్లో) ఎన్టీఆర్ ప్రభుత్వం దిగిపోయింది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. విగ్రహం ప్రతిష్టాపన ఆలస్యం అయింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
బుద్దుడి విగ్రహం ప్రతిష్టించాలని చెన్నారెడ్డి నిర్ణయించడంతో పనులు ముందుకు సాగాయి.
ఏబీసీ ఇండియా అనే కంపెనీకి హుస్సేన్ సాగర్కు విగ్రహం తీసుకొచ్చే బాధ్యత అప్పగించింది అప్పటి ప్రభుత్వం.
హైదరాబాద్లో అప్పట్లో రోడ్లు ఇరుకుగా ఉండటంతో ఆ విగ్రహాన్ని తరలించడం కష్టమైంది. విగ్రహం తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్లు సైతం వేసింది. కొన్ని రోడ్లు వెడల్పు చేసింది. 1990 మార్చి 10 రోజున విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లోకి తరలించారని ప్రణాళిక వేశారు.
ముందుగా ట్రక్లో విగ్రహాన్ని హుస్సేన్ సాగర్కు ప్రణాళిక ప్రకారమే సురక్షితంగా తరలించారు. రిబ్బన్ కట్ చేసిన తర్వాత విగ్రహాన్ని అప్పటికే సిద్ధం చేసిన భారీ పడవలోకి తరలించారు.
100 మీటర్లకు పైగా దూరం ప్రయాణించాక పడవ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఎంతలా అంటే ఆ అలల ధాటికి పక్కన ప్రయాణిస్తున్న ఓ పడవ పైకి లేచి నీటిలో పడిపోయింది.
పడవ కుదుపుల కారణంగా విగ్రహం నీటిలోకి మెల్లగా జారిపోవడం మొదలైంది. విగ్రహం తరలించడానికి ఏబీసీ కంపెనీ ఏర్పాటుచేసిన వర్కర్లు దాని కిందే ఉండిపోయారు, పైకి రాలేకపోయారు.
ఏబీసీ కంపెనీ ప్రతినిధి ఎస్.కె. ముంద్రా సహా ఎనిమిది మంది విగ్రహం కింద చిక్కుకొని చనిపోయారని ద వాషింగ్టన్ పోస్ట్ అప్పట్లో రాసింది.
ఓ ఐదు గంటల అనంతరం విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
నన్ను క్షమించండి: ఎన్టీఆర్
ఈ హఠాత్పరిణామానికి దేశం అంతా ఉలిక్కిపడింది. విగ్రహం తరలింపు ప్రక్రియపై విమర్శలు తలెత్తాయి.
రాజకీయ పార్టీలు ధ్వజమెత్తాయి. తరలింపు బాధ్యతలు చేపట్టిన ఏబీసీ కంపెనీపై ఆరోపణలు వచ్చాయి.
భారీ విగ్రహాల తరలింపులో ఎలాంటి అనుభవం లేని కంపెనీకి అలాంటి పెద్ద బాధ్యతను ఎలా అప్పగించారని విమర్శించారు.
అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి కూడా ఎన్టీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని వాషింగ్టన్ పత్రిక తన కథనంలో రాసింది.
అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఏకశిల కాదని పలు భాగాలను రూపొందించి ఒక విగ్రహంగా పేర్చారని ఆ పత్రిక గుర్తుచేసింది. ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్లో ప్రతిష్టించే విగ్రహం భారీగా ఉండాలని, గ్రానైట్ ఏకశిలతో రూపొందించారని తెలిపింది.
దీనిపై అప్పటి సీఎం చెన్నారెడ్డి '' స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఏక శిల కాదని ఆయన (ఎన్టీఆర్) తెలుసుకోలేదు'' అని చెప్పారు.
విగ్రహం నీటిలో మునిగిపోవడంపై ఎన్టీఆర్ "చాలా కష్టపడి రాయిని కనుగొన్నాను, చాలా దూరం నుంచి తీసుకువచ్చాను. నన్ను క్షమించండి. హుస్సేన్ సాగర్ నీటిలో గొప్ప సాధువు గల్లంతయ్యాడు" అని చెప్పినట్లు వాషింగ్టన్ పత్రిక తెలిపింది.
విగ్రహం నెలకొల్పాలని ఎన్టీఆర్ సంకల్పించినపుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్టీఆర్పై విమర్శలు చేశారు. ఎన్టీఆర్ వినే స్థితిలో లేరని, మబ్బుల్లో విహరిస్తున్నారంటూ ఆరోపించారు.
రాష్ట్రంలో లక్షల మంది పేదరికం, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఇలాంటి ప్రాజెక్టులకు పూనుకుంటున్నారని వారు మండిపడ్డారు.
విగ్రహ తరలింపుకు జరిగిన 'ఏబీసీ ఇండియా డీల్'లో అవినీతి ఆరోపణలు కూడా వినిపించాయని ఆ కథనం రాసింది. అయితే ఏబీసీపై వచ్చిన ఆరోపణలను ఆ సంస్థ ప్రతినిధులు అప్పట్లోనే ఖండించారు.
‘‘ఏదైనా అనుకున్నట్లు జరిగితే, మీరు సాధించిన దాని గురించి ఎవరూ మాట్లాడరు, అదే విఫలమైతే ప్రతి ఒక్కరూ విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు’’ అని ఏబీసీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్పీ షా వ్యాఖ్యానించారు.
విగ్రహాన్ని ఎలా బయటకు తీశారు?
ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఏడాది పాటే ఉన్నారు. అనంతరం 1990 డిసెంబర్లో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆయన హయాంలోనూ బుద్ధ విగ్రహాన్ని బయటకు తీయించలేదు.
1992 అక్టోబర్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక విగ్రహాన్ని బయటకు తీసే పనులు చేపట్టారు.
అదే ఏడాది ప్రత్యేక క్రేన్ల సాయంతో హుస్సేన్ సాగర్లో మునిగిపోయిన బుద్దుడి విగ్రహాన్ని బయటకు తీశారు.
1992 డిసెంబర్ 1న విగ్రహాన్ని ప్రతిష్టించారు.
1994లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు.
అనంతరం ట్యాంక్బండ్ పరిసర ప్రాంతంలో సుందరీకరణ పనులు చేయించారు.
అంతకుముందు ట్యాంక్బండ్ చుట్టూ పలువురు చరిత్రకారుల విగ్రహాలు ఎన్టీఆర్ చెక్కించి, నెలకొల్పారు.
సందర్శనకు సీఎంల విముఖత: మల్లేపల్లి లక్ష్మయ్య
బుద్ధుడి విగ్రహం నిర్మాణం, ప్రతిష్టాపన గురించి బుద్ధ వనం ప్రాజెక్టు తెలంగాణ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తన అనుభవాలు పంచుకున్నారు.
''ఏ రాజకీయ నాయకుడూ అలాంటి బుద్ధుడి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించలేదు. హైదరాబాద్లోని ముఖ్యమైన ప్రదేశంలో అది కూడా హుస్సేన్ సాగర్ మధ్యలో ఆ విగ్రహం పెట్టడం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైంది. కారణమేదైనా, పరిస్థితులు ఏమైనా అది మంచి ప్రయత్నం. ఇప్పుడు హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో చార్మినార్తో పాటు గుర్తింపు తీసుకురావడంలో ఉపయోగపడింది. ఈ విగ్రహం హైదరాబాద్లో సెక్యులర్, హిస్టారికల్ పాత్రను పోషించింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
తరలింపులో విగ్రహం నీట మునిగినప్పుడు ఎన్టీఆర్ పైనే కాకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా విమర్శలు వచ్చాయని చెప్పారు.
అప్పట్లో 'బుద్ధుడి' గురించి కూడా చాలా చర్చ జరిగిందని లక్ష్మయ్య తెలిపారు.
బుద్ధుడికి విగ్రహం పెట్టాల్సింది కాదని, బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్లాడని గుర్తుచేస్తూ విమర్శలు చేశారని చెప్పారు.
"చాలా వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఆ విగ్రహం సందర్శించడానికి విముఖత చూపించారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రామ్నాథ్ కోవింద్ మాత్రం బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు'' అని ఆయన ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)