ఏపీ: ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ల పేరిట 100 కోట్లకుపైగా భూ దందా జరిగిందా, ప్రాథమిక నివేదికలో అధికారులు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిందటేడాది డిసెంబర్ 31వ తేదీన అరెస్టయిన ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ లాలాబాల నాగధర్మ సింగ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న లేఖ చర్చనీయాంశంగా మారింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారి చీమకుర్తి శ్రీకాంత్ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి, తనను బెదిరించి వందల కోట్ల రూపాయల విలువైన భూములను తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్లు చేయించారంటూ ధర్మసింగ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు రాసినట్టుగా ప్రచారంలో ఉన్న ఆ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తోంది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు ఇప్పటికే విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఆ శాఖ డీఐజీ రవీంద్రనాథ్కు అందజేశారు.

ఆ నివేదికలో ఏముందంటే?
గత ప్రభుత్వ హయాంలో నిబంధనలేమీ పాటించకుండా చీమకుర్తి శ్రీకాంత్ పేరిట దాదాపు రూ.106 కోట్ల విలువైన భూములు, ఆస్తుల లావాదేవీల రిజిస్ట్రేషన్లు జరిగాయని ప్రాథమికంగా తేలినట్టు నివేదికలో పేర్కొన్నారు.
శ్రీకాంత్ తో పాటు ఆయన భార్య వనం దివ్య, తండ్రి చీమకుర్తి శేషుబాబు ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు రిజిస్టర్ అయ్యాయని సదరు నివేదికలో పొందుపరిచారు.
ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ అవకాశం ఉండటంతో ధర్మసింగ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన కార్యాలయాల్లోనే విజయవాడతో పాటు విశాఖ, రాజమండ్రిల్లోని భూములను రిజిస్టర్ చేశారని రవీంద్రనాథ్ బీబీసీకి వెల్లడించారు.
నిబంధనల ఉల్లంఘన ఇలా..
ప్రాథమిక విచారణలో తేలిన అంశాలను డీఐజీ రవీంద్రనాథ్ బీబీసీకి తెలిపారు.
- డాక్యుమెంట్లు, వాటి లింక్ డాక్యుమెంట్లను ఒకే రోజు హడావిడిగా రిజిస్ట్రేషన్ చేశారు.
- ధర్మసింగ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 3469 / 2021 డాక్యుమెంట్ను, దాని లింక్ డాక్యుమెంట్ను కూడా ఒకేరోజు 2021 డిసెంబర్ 31న రిజిస్టర్ చేశారు
- 7027/2021 నెంబర్ డాక్యుమెంట్ను, దాన్ని లింక్ డాక్యుమెంట్ను 2021 ఆగస్టు 12న ఒకేరోజు రిజిస్టర్ చేశారు
- లింక్ డాక్యుమెంట్లను పరిశీలించగా, టైటిల్ రిజిస్ట్రేషన్లకు నిర్దిష్ట సాక్ష్యాలను చూపించలేదు
- వారసత్వ హక్కులను ప్రస్తావిస్తూ రిజిస్ట్రేషన్ చేసి యాజమాన్య హక్కులను బదిలీ చేశారు. దీంతో ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు సరైనవా కావా? అనే సందేహాలు ఉన్నాయి.
- పాన్ కార్డుల వివరాలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేశారు.
- నిబంధనల ప్రకారం ఐదు లక్షల కంటే ఎక్కువ విలువైన స్థిరాస్తిని కొనుగోలు చేసినా, విక్రయించినా పాన్ లేదా జనరల్ రిజిస్ట్రేషన్ నెంబర్ పేర్కొనాలి. ఒకవేళ పాన్ నెంబర్ లేకపోతే ఫామ్ 60 లేదా ఫామ్ 61లో డిక్లరేషన్ తీసుకోవాలి. కానీ చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీద చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పరిశీలిస్తే వాటిలో ఎక్కడా పాన్ వివరాలు లేవు.
ఇవన్నీ ప్రాథమిక విచారణలో తేలిన అంశాలేనని.. మరింతగా విచారిస్తే పూర్తి స్థాయి వివరాలు వెల్లడవుతాయని రవీంద్రనాథ్ బీబీసీకి చెప్పారు.
లేఖలో ఏముంది?
సీఎం చంద్రబాబుకు మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ రాసినట్టు ప్రచారంలో ఉన్న లేఖలో ''గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన చీమకుర్తి శ్రీకాంత్ నా వద్దకు వచ్చి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రిలోని వందల కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని నిరాకరించగా నన్ను బెదిరించారు. ఆ బెదిరింపులకు భయపడిన నేను కొన్ని వందల కోట్ల విలువైన భూములను వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశాను. వాళ్లు నాతో చేయించుకున్న రిజిస్ట్రేషన్లన్నీ అమాయకులైన సామాన్య ప్రజలవే'' అని ఆరోపించారు.

ఫొటో సోర్స్, UGC
ధర్మసింగ్ గతంలో ఎక్కడ పనిచేశారు?
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ 2023 నవంబర్ 17న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న ధర్మ సింగ్పై ఏసీబీ కేసులు నమోదు చేసింది.
అదే రోజు ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లపై, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. కేసు నమోదైన వారం రోజులకు అంటే నవంబర్ 24న ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది.
కాగా, తన ఇళ్లపై దాడి సమాచారం ముందే తెలుసుకున్న ఆయన పరారయ్యారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ధర్మసింగ్ గతేడాది 2024 డిసెంబర్ 31న ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. ఈ అరెస్టు నేపథ్యంలోనే సింగ్ గతంలో రాసినట్టు చెబుతున్న లేఖ ఇప్పుడు వెలుగు చూడటంతో ఆ లేఖపై ప్రభుత్వం తాజాగా విచారణ చేయిస్తోంది.
పరారీలో ఉన్న సమయంలోనే గతేడాది జూన్లో సింగ్ రిటైర్ అయ్యారు. 1992 నుంచి 2023 వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్గా ఉన్న ధర్మసింగ్ చివరిగా పనిచేసిన ఇబ్రహీంపట్నంతో పాటు గుణదల, విజయవాడ గాంధీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పదేళ్లపాటు పనిచేశారు.
ఆ రిజిస్ట్రేషన్లపై విచారణ: డీఐజీ
''ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఎనీ వేర్ రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం 2014లోనే అనుమతినిచ్చింది. ఈక్రమంలోనే ధర్మసింగ్ తాను సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అందులో ప్రభుత్వభూములు లేవు. సేల్, జీపీఎ, మార్ట్గేజ్ డాక్యుమెంటేషన్లలో నిబంధనలు పాటించలేదు. సింగ్ గతంలో పనిచేసిన గాంధీనగర్లో 19 రిజిస్ట్రేషన్లు, గుణదలలో 5, ఇబ్రహీంపట్నంలో 7 రిజిస్రేషన్లు,, ఇలా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సదుపాయంతో చేసిన రిజిస్ట్రేషన్ల వివరాలను పరిశీలిస్తున్నాం. ఆ రిజిస్ట్రేషన్లలో ఉన్న భూములు ఎవరివి? ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? వంటి వివరాలను సేకరిస్తున్నాం'' అని డీఐజీ రవీంద్రనాథ్ బీబీసీకి వెల్లడించారు.
మొత్తం వివరాలపై ఆరా తీస్తున్నామని, అన్యాయంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే, బాధితులు ఎవరైనా తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ రిజిస్ట్రేషన్ రద్దుకు వీలుంటుందని తెలిపారు.
సింగ్ను అరెస్టు చేసిన సమయంలో అతను చెప్పిన వివరాలపై కూడా పరిశీలన చేస్తున్నామని ఆ కేసు విచారణ అధికారి, ఏసీబీ సీఐ రమేష్ బీబీసీకి తెలిపారు.
'సింగ్ ఆరోపణలన్నీ అబద్ధం'
''ధర్మ సింగ్ నాకు ఒకప్పుడు నాకు బాగా పరిచయమే. గత ప్రభుత్వంలో ఓ పెద్దమనిషికి పీఏగా పనిచేసిన వ్యక్తి నాకు పరిచయం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన నేను కొన్ని భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న మాట నిజమే. అయితే అవన్నీ నా సొంత భూములు. నాకు మా నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన స్థలాలు, ఆస్తులనే నేను రిజిస్ట్రేషన్ చేయించాను. అన్నీ నిబంధనల మేరకే చేయించుకున్నాను, వాటి విలువ చాలా తక్కువ, కానీ వందల కోట్లు అని సింగ్ ఆరోపించినట్టు ప్రచారం చేయడం చాలా బాధేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న నాకు ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి కూడా లేదు'' అని ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీమకుర్తి శ్రీకాంత్ బీబీసీతో అన్నారు.
నాకు గత ప్రభుత్వ పెద్దలెవరూ తెలియదు.. అయితే ఆ ప్రభుత్వంలో పెద్దలకు, మంత్రులకు పీఏలుగా చేసిన వాళ్లు, ఓఎస్డీలుగా చేసిన వారితో పరిచయాలుండేవి. అయినాసరే నాపై గత ప్రభుత్వ హయాంలోనే ఏసీబీ కేసులు నమోదు చేసింది. సింగ్పై కేసు పెట్టడానికి చాలా ముందుగానే ఏసీబీ నాపై కేసులు పెట్టి నా ఆస్తులను స్తంభింపచేసింది. చివరికి బ్యాంక్ లాకర్లో ఉన్న నా భార్య మంగళసూత్రంతోపాటు నేను వాడే మూడు ఫోన్లను ఫ్రీజ్ చేశారు. గత ప్రభుత్వ పెద్దలు నాకు బాగా తెలిసుంటే ఏసీబీ అధికారులు అలా చేయరు కదా.. ఇప్పటికీ నా పై కేసు నడుస్తోంది. నేను ఏ తప్పు చేయలేదు. సింగ్ నాపై ఎందుకు ఆరోపణలు చేశారో నాకు తెలియదు.. నాకు ఆయన 30లక్షలు ఇవ్వాల్సి ఉండగా అడిగాను. అది మనసులో పెట్టుకుని నాపై ఆరోపణలు చేసి ఉంటారు. ఏదేమైనా ఏసీబీ విచారణకు సిద్ధంగా ఉన్నాను''' అని శ్రీకాంత్ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














