ఎవరీ దలైలామా, టిబెటన్ బుద్ధిజంలో ఆయన 'పునర్జన్మ'ను ఎలా గుర్తిస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
టిబెట్కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా(90) తన మరణం తర్వాత తనకు వారసుడు ఉంటాడని బుధవారం ఒక వీడియో సందేశంలో చెప్పారు.
తన వారసుడిని గుర్తించే ప్రక్రియ పూర్తిగా గాడెన్ ఫోడ్రాంగ్ ఫౌండేషన్ చూసుకుంటుందని, "ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు మరెవరికీ లేదని" ఆయన అన్నారు.
అంతేకాదు, తన వారసత్వం కొనసాగాలని 14 ఏళ్లుగా టిబెట్, మంగోలియా, రష్యా, హిమాలయ ప్రాంతం, చైనాలోని బౌద్ధ మద్దతుదారుల నుంచి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయని ప్రస్తుత దలైలామా చెప్పారు.
టిబెటన్ బుద్ధిజం విశ్వాసాల ప్రకారం, దలైలామాలు మరణం తర్వాత మరొక శరీరంలో 'పునర్జన్మ' పొందుతారు.
చైనా సొంతంగా దలైలామాను ఎంపిక చేయవచ్చనే ఆందోళనల మధ్య ఈ ప్రకటన వెలువడింది.
దీనిక ప్రతిస్పందిస్తూ, 'దలైలామా పునర్జన్మ'ను చైనాలోనే గుర్తించాలని, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో అని చైనా పేర్కొంది.
1951లో టిబెట్ను చైనా స్వాధీనం చేసుకుంది, దలైలామాను వేర్పాటువాదిగా చూస్తోంది.


ఫొటో సోర్స్, Christopher Michel
దలైలామా ఎవరు?
దలైలామాను అవలోకితేశ్వర (చెన్రెజిగ్- కరుణామయుడైన బుద్ధుడు) అవతారంగా భావిస్తారు.
హిందువులు, జైనుల మాదిరిగానే, బౌద్ధులు కూడా పునర్జన్మను విశ్వసిస్తారు.
టిబెటన్ బౌద్ధమత విశ్వాసాల ప్రకారం.. గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉన్న వ్యక్తులు ఎప్పుడు, ఎక్కడ పునర్జన్మ పొందాలో ఎంచుకుంటారు.
ప్రస్తుత దలైలామా 1935 జూలై 6న ఈశాన్య టిబెట్లోని ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు లామో ధోండుబ్.
రెండు సంవత్సరాల వయస్సులోనే లామోను 13వ దలైలామా పునర్జమ్మగా గుర్తించారు.
"ఒకే ఆత్మ మళ్లీ మళ్లీ పుడుతుందని టిబెటన్లు విశ్వసిస్తారు" అని 1985 నుంచి దలైలామాకు అనువాదకుడిగా ఉన్న డాక్టర్ తుప్టెన్ జిన్పా అన్నారు.
బౌద్ధమతానికి 2,500 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ దలైలామా వ్యవస్థ ఆ తర్వాతే పుట్టింది.
'మొదటి దలైలామా 1391లో జన్మించిన గెడున్ డ్రప్' అని అబెర్డీన్ యూనివర్సిటీలో స్కాటిష్ సెంటర్ ఫర్ హిమాలయన్ రీసర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మార్టిన్ ఎ మిల్స్ అన్నారు.
కానీ, ఈ బౌద్ధ గురువు పునర్జమ్మ భావన అంతకు 300 ఏళ్ల ముందు నుంచే ఉందని మార్టిన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Sanjay Baid/AFP via Getty Images
దలైలామాను ఎలా ఎంపిక చేస్తారు?
'దలైలామా ఎంపిక చాలా సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రక్రియ' అని డాక్టర్ తుప్టెన్ జిన్పా అంటున్నారు.
దీనికి సంవత్సరాలు పట్టవచ్చు. 14వ దలైలామాను కనుగొనడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.
దలైలామా మరణించిన తర్వాత, ఉన్నత స్థాయి సన్యాసులు అదే సమయంలో జన్మించిన బాలుడి కోసం వెతుకుతారు. దీనికోసం వారు కొన్ని సంకేతాలు, ఆధారాలను ఉపయోగిస్తారు.
ఎవరైనా సన్యాసికి బాలుడి గుర్తింపుపై కల రావొచ్చు. దలైలామా అంత్యక్రియల నుంచి వెళ్లే పొగ దిశను కూడా ఒక ఆధారంగా తీసుకుంటారు.
ఈ ప్రక్రియలో ఎవరైనా బాలుడిని గుర్తిస్తే, అతన్ని పరీక్షిస్తారు. అతనికి చాలా వస్తువులు చూపిస్తారు. చివరి దలైలామాకు చెందిన వస్తువులను అతను ఎంచుకుంటే, అది బలమైన సంకేతంగా పరిగణిస్తారు.
అత్యున్నత సన్యాసులు బాలుడి చర్యలపై సంతృప్తి చెందితే, అతన్ని దలైలామాగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత, అతను ఏళ్ల పాటు మతపరమైన, ఆధ్యాత్మిక శిక్షణ తీసుకుంటారు.
ఇప్పటి వరకు ఇద్దరు దలైలామాలు మాత్రమే టిబెట్ వెలుపల జన్మించారు. ఒకరు మంగోలియాలో, మరొకరు ఈశాన్య భారతదేశంలో.

ఫొటో సోర్స్, Getty Images
చైనా జోక్యం ఎందుకు?
1950లో చైనా వేల మంది సైనికులను టిబెట్లోకి పంపి ఆ ప్రాంతంపై నియంత్రణను ప్రారంభించింది. 1959లో టిబెటన్లు చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు, ఆ తర్వాత దలైలామా భారత్కు పారిపోయి ప్రవాస ప్రభుత్వాన్ని ప్రారంభించారు.
టిబెట్ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత నుంచి దలైలామా వైదొలిగినప్పటికీ, చాలామంది ఇప్పటికీ ఆయనను చైనా పాలనకు వ్యతిరేక చిహ్నంగానే చూస్తున్నారు.
ఈసారి తన పునర్జమ్మ టిబెట్ వెలుపల ఉండవచ్చని దలైలామా గతంలో చెప్పారు.
కాగా, దలైలామా రాజకీయ బహిష్కరణకు గురైన వ్యక్తి అని, మతాన్ని ఉపయోగించి దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని చైనా ఆరోపించింది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో దలైలామా వంటి టిబెట్ మత నాయకులను ఎలా ఎంపిక చేయాలనే దానిపై 2007లో చైనా ఒక ఆర్డర్ రూపొందించింది. ఇది దలై లామా ఎంపికను నియంత్రణలోకి తెచ్చుకునే ఉద్దేశంలా కనిపించింది.
టిబెట్ వ్యవహారాల్లో చైనా జోక్యంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి.
"టిబెట్ మతపరమైన ఆచారాలలో రాజకీయ జోక్యాన్ని చైనా అధికారులు వెంటనే ఆపివేయాలి. మతపరమైన వారసత్వాన్ని నియంత్రణకు ఒక సాధనంగా ఉపయోగించవద్దు" అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైనా డైరెక్టర్ సారా బ్రూక్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
దలైలామా భారత్లో ఎందుకు ఉంటున్నారు?
1959లో దలైలామా యువకుడిగా ఉన్న సమయంలో టిబెట్ నుంచి తప్పించుకుని వచ్చి భారత్లో నివసిస్తున్నారు.
1959 మార్చి 10న, ఒక చైనా జనరల్ దలైలామాను నృత్య ప్రదర్శనకు ఆహ్వానించారు. కానీ, ఇది ఆయనను కిడ్నాప్ చేయడానికి కుట్రగా చాలా మంది టిబెటన్లు భయపడ్డారు. దీంతో, వారంతా దలైలామా ప్యాలెస్ చుట్టూ చేరి, ఆయనకు రక్షణగా నిలిచారు.
దీంతో 1950 నుంచి టిబెట్పై మొదలైన చైనా నియంత్రణకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. చైనా సైన్యం హింసాత్మక అణచివేతతో స్పందించింది, వేలాది మంది ప్రజలు మరణించారని రిపోర్టులు చెబుతున్నాయి.
కొన్ని రోజుల తరువాత, దలైలామా సైనికుడి దుస్తులు ధరించి, వేలాది మంది అనుచరులతో కలిసి రాత్రి నిశ్శబ్దంగా బయలుదేరారు. హిమాలయాల మీదుగా 15 రోజుల ప్రయాణం తర్వాత, ఆయన భారత సరిహద్దుకు చేరుకున్నారు.
మార్చి 1959లో భారత దేశానికి చేరిన దలైలామాను, ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వాగతించారు.
అప్పటి నుంచి దలైలామా, ఆయన అనుచరులు ధర్మశాలలో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దొరకని పంచెన్ లామా ఆచూకీ
దలైలామా మాదిరే పంచెన్ లామాను కూడా బుద్ధుని అంశగా భావిస్తుంటారు. ఆయనను అమితాభ (అనంతమైన కాంతి కలిగిన బుద్ధుడు) పునర్జన్మగా విశ్వసిస్తారు. ఈయన టిబెట్ బౌద్ధ మతంలో రెండవ అతి ముఖ్యమైన వ్యక్తి.
టిబెట్ సంప్రదాయం ప్రకారం, దలైలామా, పంచెన్ లామా ఒకరినొకరు మార్గనిర్దేశం చేసుకుంటారు, తదుపరి పునర్జన్మను కనుగొనడంలో సహాయపడతారు. దలైలామా కంటే పంచెన్ లామా 50 ఏళ్ల చిన్నవాడు కాబట్టి, దలైలామా తదుపరి పునర్జన్మను గుర్తించడంలో సాధారణంగా ఆయనే సహాయం చేస్తారు.
పంచెన్ లామా 1989లో అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు (కొంతమంది చైనా ఆయనకు విషం ఇచ్చి ఉండవచ్చని నమ్ముతారు), ఆయన త్వరలోనే పునర్జన్మ పొందుతారని భావించారు.
కొత్త పంచెన్ లామా దొరికినట్లు దలైలామా 1995 మే 14న ప్రకటించారు. టిబెట్ పట్టణం నక్చుకు చెందిన ఒక వైద్యుడు, నర్సు కుమారుడైన గెధున్ చోకి నైమా అనే ఆరేళ్ల బాలుడే ఈ కొత్త పంచెన్ లామా. అయితే, ఆయన్ను పంచెన్ లామాగా గుర్తించిన మూడు రోజులకే(మే 17న) కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు పంచెన్ లామా ఆచూకీ దొరకలేదు. గెధున్ చోకి నైమా ఉత్తర చైనాలోని గన్సు ప్రావిన్స్లో నివసిస్తున్నారని చైనా అధికారి ఒకసారి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్కు తెలిపారు. మరొక వాదన ప్రకారం, అతన్ని బీజింగ్లో లేదా సమీపంలో నిర్బంధించారు.
చైనాలో తమ పాలనకు దలైలామాలాగే పంచెన్ లామా కూడా అడ్డుకాకూడదని, అతను ప్రజా నాయకుడిగా మారకూడదని చైనా భావించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గెధున్ అదృశ్యమైన తర్వాత వేరొకరిని పంచెన్ లామాగా చైనా ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














