సౌదీ అరేబియా: ఒక్క రోజే 81 మందికి మరణ శిక్ష అమలు.. ఏడాది పొడవునా అమలు చేసిన వాటికంటే ఇదే ఎక్కువ

శనివారం ఒక్క రోజే 81 మందికి మరణశిక్ష అమలు చేశామని వెల్లడించింది సౌదీ అరేబియా.

ఏడాది పొడవున అమలు చేసిన మరణశిక్షల కంటే ఈ సంఖ్య ఎక్కువ.

టెర్రరిజం సహా 'అత్యంత క్రూరమైన నేరాలు' చేసిన ఏడుగురు యెమన్ జాతీయులు, ఒక సిరియా జాతీయుడు కూడా వీరిలో ఉన్నారని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ఎస్‌పీఏ వెల్లడించింది.

వీరిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్‌) ఆల్‌ఖైదా లేదా యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఉన్నారని తెలిపింది.

అయితే, చాలామంది విషయంలో విచారణ న్యాయబద్ధంగా జరగలేదని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అయితే, ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది.

తాజా బృందాన్ని 13 మంది న్యాయమూర్తులు విచారించారని, మూడు దశల న్యాయ ప్రక్రియలో విచారణ జరిగిందని ఎస్‌పీఏ చెబుతోంది.

కీలక ఆర్థిక లక్ష్యాలపై దాడులకు కుట్ర, సైనికుల హత్య లేదా కిడ్నాప్, వేధించడం, అత్యాచారం, ఆయుధాలను దేశంలోకి స్మగ్లింగ్ చేయడం వంటి అభియోగాలు వారిపై ఉన్నాయని వివరించింది.

ప్రపంచంలో మరణ శిక్షలు అత్యధికంగా ఉన్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి.

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రూపొందించిన జాబితా ప్రకారం మరణ శిక్షల అమలులో సౌదీ అరేబియా ఐదో స్థానంలో ఉంది. మొదటి నాలుగు దేశాలు చైనా, ఇరాన్, ఈజిప్ట్, ఇరాక్‌ అని వెల్లడించింది.

సౌదీ అరేబియా గతేడాది 69 మందికి మరణ శిక్ష విధించింది.

2020లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణ శిక్షల సంఖ్యను పైమ్యాప్‌లో చూడొచ్చు. అయితే, ఇందులో చైనా, ఉత్తర కొరియా, సిరియా, వియత్నం దేశాల వివరాలు పొందుపరచలేదు.

ఈ దేశాల్లో అధికారిక సమాచారం అందుబాటులో లేదు. ఎంత మందికి మరణ శిక్ష విధించారో తెలుసుకోవడం కూడా అసాధ్యం. చైనాలో మరణ శిక్షలు వేలల్లో ఉంటాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)