కేరళ: కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో 21కి పెరిగిన మృతులు

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కేరళలోని మున్నార్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.

గురువారం ఈ ప్రమాదం తరువాత తొలుత 18 మృతదేహాలను గుర్తించగా శుక్రవారం ఉదయం మరో మూడు మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి.

బురద ప్రవాహంలో సుమారు 60 మంది కూరుకుపోయారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు వెతుకుతునాయి.

కాగా బురదలో కూరుకుపోయిన 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి.

అంతకుముందు, గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ ఘటనపై విలేఖరులతో మాట్లాడుతూ, "ఈ దుర్ఘటనలో 15 మంది చనిపోయారు. మరో 15 మందిని సహాయక బృందాలు కాపాడాయి" అని చెప్పారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 21కి పెరిగింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు పొంగి పొరలుతూ, వంతెనలు తెగిపోవడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో, కేరళ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను ఆదుకోవడానికి భారత వైమానిక దళం సహాయాన్ని కోరింది.

మున్నార్‌లోని రాజమాలా గ్రామంలో ఈ విషాదం సంభవించింది. బురదలో, రాళ్లలో ఇంకా చాలా మంది కూరుకుపోయారని కేరళ రెవెన్యూ మంత్రి ఇ. చంద్రశేఖరన్ చెప్పారు.

"ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న కొంతమంది అటవీశాఖ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. కానీ, రోడ్డు లింకు తెగిపోవడంతో వారు ముందుకు వెళ్లలేకపోయారు" అని కేరళ పోలీసు శాఖ పబ్లిక్ రిలేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ వీపీ ప్రమోద్ కుమార్ బీబీసీ హిందీతో చెప్పారు.

ప్రధాని మోదీ సంతాపం

రాజమాలా ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందిస్తామని మోదీ ప్రకటించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం, ఎన్‌డీఆర్ఎఫ్ సహాయ చర్యలు చేపడుతున్నాయని, బాధితులకు అవసరమైన చేయూత అందిస్తున్నాయని మోదీ తెలిపారు.

ధ్వంసమైన ఆదివాసీ పల్లెలు

రాజమాలా ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసీల పల్లెలు ఉంటాయి. శుక్రవారం ఉదయం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎక్కువగా ఇక్కడి ప్రజలే చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పశ్చిమ కనుమల వెంబడి కురిసిన భారీ వర్షాలతో కేరళ, కర్నాటక రాష్ట్రాలలో చాలా చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాల ఉద్ధృతి గత కొన్ని రోజులుగా పెరిగి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)