కరోనావైరస్‌ను న్యూజీలాండ్ ఎలా ఎదుర్కోగలిగింది?

    • రచయిత, వెట్ టాన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఐదు వారాల లాక్ డౌన్ తర్వాత న్యూజీలాండ్‌లో కాఫీ షాపులు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం న్యూజీలాండ్‌లో మూడో స్థాయి అలర్ట్ అమలులో ఉంది. దీంతో కొన్ని అత్యవసర సేవలు కాని వ్యాపారాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి.

‘ఒక్క కప్ కాఫీ తాగగానే నా జీవితం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చినట్లనిపించింది’ అని ఒక కాఫీ ప్రేమికురాలు చెప్పారు.

బరిస్టాలో దొరికే కాఫీ రుచి మరెక్కడా లభించదని ఆక్లాండ్ నివాసి విక్టోరియా హొవి బీబీసీతో చెప్పారు.

కొన్ని వారాల పాటు సొంతంగా చేసుకున్న కాఫీ తాగాక ఎవరైనా చేసిచ్చిన కాఫీ తాగడంలో ఆనందమే వేరు అని వెల్లింగ్టన్ నివాసి డాక్టర్ సమంత కీన్ అన్నారు.

మెక్ డొనాల్డ్స్ దుకాణాలు తెరుచుకోవడం చాలా మందిలో ఉత్సాహాన్ని నింపింది.

ఈ షాపుల ముందు క్యూ కట్టిన కార్లు, ఫాస్ట్ ఫుడ్‌తో ప్రజలు ఫొటోలు తీసుకోవడం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన చిత్రాలలో కనిపించింది.

లాక్ డౌన్ అనంతరం నచ్చిన ఆహారం ఆర్డర్ చేసుకుని తినడం చాలా ఆనందంగా ఉంటుందని క్రిస్టోఫర్ బిషప్ అనే స్థానిక పార్లమెంట్ సభ్యుడు బీబీసీతో అన్నారు.

కెఫేల దగ్గర గుమిగూడొద్దు

ప్రస్తుతానికి కేసుల సంఖ్య నిలకడగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం మంచిది కాదని ఆరోగ్య నిపుణుడు ఒకరు హెచ్చరించారు.

"చాలా మంది లాగే నేను కూడా టేక్ అవే కాఫీని తీసుకుని చాలా ఉత్సాహపడ్డాను. కానీ, కార్ పార్కింగుల దగ్గర, కెఫేలలో గుమిగూడటం మంచిది కాదు. ఇతర దేశాలలో తలెత్తిన పరిస్థితి ఇక్కడ జరగకుండా చూసుకోవాలి” డాక్టర్ యాష్లే బెలూంఫిల్డ్ అన్నారు.

మూడో స్థాయి అలర్ట్ అమలులో ఉన్నప్పుడు ప్రజల్ని ఇంటి వద్ద నుంచే పని చేయమని సలహా ఇస్తారు. ఇతరులెవరినీ తాకకుండా సేవలు అందించగలిగితే కొన్ని వ్యాపారాలు తెరవడానికి అనుమతి ఇస్తారు.

స్కూల్స్ కూడా తెరవడానికి అనుమతి ఇస్తారు. అయితే, సామాజిక దూరం నియమం తప్పకుండా పాటించాలి. ఎక్కువ మంది హాజరయ్యే భారీ కార్యక్రమాలకి అనుమతి ఉండదు. బహిరంగ స్థలాలు మాత్రం మూసే ఉంచుతారు.

50 లక్షల జనాభా ఉండే న్యూజీలాండ్‌లో ప్రస్తుతం 1124 కేసులు నమోదు కాగా 19 మరణాలు చోటు చేసుకున్నాయి. కొత్తగా నమోదు అయిన కేసులు చాలా తక్కువగా ఉండటంతో ప్రభుత్వం వైరస్‌ని అరికట్టినట్లు ప్రకటించింది.

న్యూజీలాండ్ ఏం చేసింది?

న్యూజీలాండ్‌ వైరస్‌ని ఎదుర్కోవడానికి కారణం చాలా సత్వర చర్యలు చేపట్టడం అని ప్రముఖంగా చెప్పవచ్చు.

మార్చ్ 19 నుంచి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందు నుంచి ప్రయాణాల మీద ఆంక్షలు అమలు చేసింది. దీంతో విదేశాల నుంచి వచ్చే కేసులు తగ్గిపోయాయి. న్యూజీలాండ్‌లో నమోదైన 33 శాతం కేసులు బయట నుంచి వచ్చినవే. ఆ సమయంలో న్యూజీలాండ్‌లో 102 కేసులు ఉన్నట్లు ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ చెప్పారు.

ఆస్ట్రేలియాలో మూడింట రెండు వంతుల కేసులు బయట నుంచి వచ్చినవే అని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సంజయ్ సేనానాయకే చెప్పారు. సరిహద్దులు మూసివేయడం చాలా ముఖ్యమైన చర్య అని, అది న్యూజీలాండ్ సమర్థంగా చేసిందని ఆయన అన్నారు.

మార్చ్ 21న న్యూజీలాండ్ నాలుగు స్థాయులలో ఉండే పబ్లిక్ అలెర్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పూర్తి లాక్ డౌన్‌ని అత్యధిక స్థాయిగా, వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగితే అతి తక్కువ స్థాయిగా వర్గీకరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

అప్పటికి న్యూజీలాండ్‌లో వైరస్ సామాజిక వ్యాప్తి జరిగే ముప్పు ఉన్న రెండో స్థాయిలో ఉంది. కొన్ని రోజులకే నాలుగో స్థాయికి చేరింది.

ఆఫీసులు, స్కూళ్లు, పబ్లిక్ స్థలాలు బార్లు, రెస్టారెంట్లు కూడా పూర్తిగా మూసేశారు.

80 శాతం కేసులలో వ్యాధి నిర్ధరణ అయిన 48 గంటలలోపే ఆ రోగి కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. దీంతో, చాలా మంది ఇంక్యుబేషన్ సమయం ముగిసేవరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. రోజుకి 8000 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెప్పారు.

ప్రజలు ఎవరెవరిని కలుస్తున్నారనే విషయంపై డైరీలో రాయమని సూచించారు. సింగపూర్, ఆస్ట్రేలియాలో వాడిన కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌ని తయారు చేసేందుకు న్యూజీలాండ్ ప్రయత్నాలు చేస్తోంది.

ప్రజలు తమ ఇంటికే పరిమితం కావాలని కచ్చితమైన ఆదేశాలు ఇవ్వలేదు. దగ్గరి బంధువులు, స్నేహితులతో కలవవచ్చని చెప్పింది. ఇలా చేయడం వలన లాక్ డౌన్ నియమాలని ఉల్లఘించాలనే ఆలోచన రాదని నిపుణులు అన్నారు. ఒకరి నుంచి ఒకరు 2 మీటర్ల దూరం పాటించమని సలహా ఇచ్చారు.

ప్రభుత్వం అందరికీ అర్ధం అయ్యేలా ఇచ్చిన సందేశాలను ప్రజలు ప్రశంసించారు.

ఒక దేశ ప్రధాని చాలా సున్నితమైన సందేశాన్ని జాగ్రత్తగా ప్రజలకు చేరవేయడం వల్ల వారిలో ధైర్యం కలగిందని ప్రొఫెసర్ సేనానాయకే అన్నారు.

అయితే లాక్ డౌన్ నిబంధనల్ని తొందరగా సడలించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్‌ని తీసివేసినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

నమోదవుతున్న కేసులపై దృష్టి పెట్టి నిబంధనల్ని ఒక్కటొక్కటిగా సడలిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.

“కేసుల పర్యవేక్షణ, పరీక్షల సంఖ్యని పెంచడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తగ్గింది. కానీ, ఏ మాత్రం కేసుల సంఖ్య పెరిగినా మళ్ళీ నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి” అని సేనానాయకే హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)