కరోనావైరస్: సంతానోత్పత్తి కేంద్రాల మూసివేత.. తల్లులు కాలేమేమోనని ఆందోళన చెందుతున్న మహిళలు

    • రచయిత, అమేలియా బటర్లీ
    • హోదా, 100 ఉమెన్

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సంతానోత్పత్తి కేంద్రాలూ మూత పడ్డాయి. దీంతో కొందరు మహిళలు తామెప్పటికీ తల్లులు కాలేమేమోనని విచారం వ్యక్తం చేస్తున్నారు.

"నాకు నా భర్త ద్వారా పిల్లల్ని కనాలనే కోరిక ఉంది. నేను ఈ బిడ్డ కోసం గత 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను" అని యూకేలోని ససెక్స్‌కి చెందిన సియాన్ బ్రిన్ద్లో చెప్పారు.

"నా కలలన్నీ కల్లలవుతాయని భయంగా ఉంది". సంతానోత్పత్తికి సంబంధించిన ప్రక్రియకు చికిత్స తీసుకోవాల్సిన కొందరిలో ఈమె ఒకరు.

కరోనావైరస్ ప్రబలడంతో వారి చికిత్స ఎప్పుడు తిరిగి మొదలవుతుందో తెలియదు. సియాన్‌కు ఇప్పుడు 40 ఏళ్లు.

ఈ కరోనావైరస్ ప్రబలే సమయానికి ఆమె , ఆమె భర్త ఐవీఎఫ్ మూడో దశ చికిత్స తీసుకుంటున్నారు.

అంతకు ముందు తీసుకున్న రెండు దశల చికిత్స విజయవంతం కాలేదు.

గతంలో తీసుకున్న చికిత్స ఆమె మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపించింది. ఇప్పుడు కరోనావైరస్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

"ఏమి జరుగుతుందో తెలియడం లేదు. చాలా కష్టంగా ఉంద’’న్నారు.

చాలా దేశాలలో సంతానోత్పత్తి కేంద్రాలని మూసివేశారు. అవి తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయి తెలియదు.

ఈ పరిణామం చికిత్స అందిస్తున్న కేంద్రాలకు, తీసుకుంటున్న తల్లితండ్రులకి కూడా కష్ట కాలమేనని యూకేకి చెందిన హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రయోలజీ అథారిటీ ప్రకటన చేసింది. యూఎస్‌లో అమెరికన్ సొసైటీ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ కూడా కొత్తగా ప్రారంభించే చికిత్సని మొదలుపెట్టడం ఆపేయమని సూచించింది.

సంతానోత్పత్తి కోసం చేసే చికిత్సని వాయిదా వేసుకోవాలని ఫెడరేషన్ అఫ్ ఒబెస్ట్ట్రిక్ అండ్ గైనకోలోజికల్ సొసైటీ అఫ్ ఇండియా పిలుపు నిచ్చింది.

జాప్యం.. విజయం

ఐవీఎఫ్ ఎందుకు వాయిదా పడిందో అర్ధం చేసుకోగలను అని చెబుతూ గత రెండు వారాల నుంచి తన మనసు చాలా కలత చెందుతోందని సియా అన్నారు.

ఈ వైరస్ వ్యాప్తి చెందక ముందు తాను చికిత్స కి వెయిటింగ్ లిస్టులో ఉండటంతో అండాలను ఫ్రీజ్ చేస్తే కొంత భద్రతా భావం కలుగుతుందేమోనని అభిప్రాయపడ్డారు

"వాళ్ళు అండాలను సేకరించి ఫ్రీజ్ చేసే దశ వరకు వెళితే బాగుంటుందని అనుకున్నాను. అప్పుడు నా వయసు గురించి చింతించాల్సిన పని ఉండేది కాదు", అని అన్నారు.

తనకి త్వరలోనే చికిత్స జరుగుతుందని ఆమె ఆశిస్తున్నారు.

"అది జరుగుతుందనుకుంటే నేను వేచి ఉండటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తన కలలు నిజం కావేమోనని ఆమెకి తెలుసు".

సంతానోత్పత్తి చికిత్సలని తాత్కాలికంగా ఆపేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తోడ్పడటం మాత్రమే కాకుండా వైద్య సిబ్బందిని కోవిడ్ 19 రోగులకు చికిత్స అందించేందుకు పంపించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఈ చికిత్స మహిళల వయస్సు, సమయం మీద ఆధారపడి ఉండటం వలన వాయిదా వేసిన ప్రభావం వారి పై ఉండవచ్చని, సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ మార్కో గౌడోయిన్ చెప్పారు.

"34 సంవత్సరాల నుంచి సంతానం కలిగే అవకాశం ప్రతి నెలా 0 . 3 శాతం తగ్గుతూ వస్తుంది. ఆరు నెలలు దాటితే సుమారు 2 శాతం అవకాశాలు తగ్గిపోతాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

"14 శాతం అవకాశాలు ఉన్నపుడు చికిత్స ప్రారంభిస్తే ఆరు నెలలు దాటితే సంతానోత్పత్తి అవకాశాలు 12 శాతానికి పడిపోతాయి". ఇది ఒక విధంగా ఐ వి ఎఫ్ చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలను తగ్గించేస్తుంది.

నేను పొట్ట గురించి కలలు కన్నాను

32 సంవత్సరాల కేటి బ్రన్టన్ కి సంతానోత్పత్తి చికిత్సలు వాయిదా వేయడం వలన తన సొంత పిల్లల్ని కనే అవకాశం తగ్గిపోతుందేమోననే భయం వెంటాడుతోంది.

గత మూడు సంవత్సరాల నుంచి కేటి , తన భర్త పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు.కేటికి గర్భం దాల్చేందుకు తగినంత అండాల శాతం లేదని తేలింది. దీంతో, సంతాన కేంద్రంలో చికిత్స అవసరం అయింది.

"పిల్లల్ని కనాలంటే అందరూ వయసు గురించి మాట్లాడతారని", కేటి అన్నారు.

"పిల్లల్ని కనడానికి నాకు వయసు ఉంది. కానీ తగినన్ని అండాలు లేవు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సమయం గడిచిపోతోంది. నాకు భయంగా ఉంది ", అని అన్నారు

కేటి కొత్తగా చికిత్స తీసుకోవడం మొదలు పెడదామని అనుకుంటున్నారు. కరోనా వైరస్ నిబంధనలు అమలులోకి వచ్చే కొన్ని రోజుల ముందే ఆమె చికిత్స కోసం సంతానోత్పత్తి కేంద్రానికి వెళ్లారు.

"మాకు చికిత్స అందుతుందని ఆశిస్తున్నాను. నాకు పెద్ద పొట్ట ఉండాలని కలలు కన్నాను, అని కేటి అన్నారు.

పిల్లలు లేని వయసులో ఉన్న జంట లాక్ డౌన్ లో కలిసి గడపడం ఎంత కష్టం గా ఉంటుందో వివరించారు.

" ఈ లాక్ డౌన్ సమయంలో కొంత మంది పిల్లల్తో కలిసి ఇంటిలో బంధించి ఉండటం ఎంత కష్టంగా ఉందో చెబుతున్నారు. కానీ, నేనైతే, అల్లరి చేస్తున్న పిల్లలతో ఇంటిలో ఎంత సేపు బంధించి ఉండమన్నా ఆనందంగా ఉంటానని అన్నారు.

ప్రసూతి విభాగంలో సహాయకురాలిగా పని చేస్తున్న ఎలీనార్ క్రాబ్ కి 35 సంవత్సరాల వయస్సు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఆమె, ఆమె భర్త పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు.

కొన్ని సార్లు చికిత్స విఫలమయ్యాక, దాతల అండాలు సేకరించి ఈ నెలలో చికిత్స మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ, ఆ అండాలు ఫ్రీజ్ చేసి ఉంచారు.

"ఇప్పట్లో ఇది జరిగేలా కనపడటం లేదు.ఎలీనార్ కి తాను చేస్తున్న పని ఇష్టమే. కానీ పిల్లలు లేని తాను గర్భిణీలను చూస్తున్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పారు.

కేక్ ఫ్యాక్టరీ లో పని చేస్తూ ఒక్క కేక్ కూడా తినలేకపోవడం లాంటిదే ఇది కూడా అని అన్నారు.

తన భావాలు తాను అందించే సంరక్షణ పై ప్రభావం చూపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

"కరోనావైరస్ మేము చేసే పనిని మరింత కష్టతరం చేసింది.ఇప్పుడు నేను గర్భధారణ చేయించుకోలేను. ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు.నేను పనిలోకి వెళ్లి, గర్భిణీల సంరక్షణ చూసుకుంటూ ఉండాలి. నేను మాస్క్, ఎప్రాన్, గ్లోవ్స్ , వైజర్ ధరించి దయతో అర్ధం చేసుకుంటూ చికిత్స అందించాలని ఆశిస్తారు".

"వాళ్ళు నా కళ్ళని మాత్రమే చూడగలరు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఈ పరిస్థితుల్లో కష్టమే".

ఓటమి కలిగిన భావన

38 సంవత్సరాల రచయత శీతల్ సావ్లా తాను పిల్లల్ని కనడానికి తీసుకున్న చికిత్సలో కలిగిన అనుభవాల గురించి వివరించారు.

"ఆ ఓటమి కలిగిన భావాన్ని చర్చించడం చాలా కష్టంగా ఉంటుంది".

"పిల్లల్ని కనడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటాయి.ఇది ఒక స్త్రీగా, భార్యగా కోడలిగా, కూతురిగా, మనుమరాలిగా నాకు ఓటమి కలిగిన భావనని కలుగ చేస్తుంది".

సంతోనాత్పత్తి కేంద్రాలు మూసివేస్తున్నట్లు ప్రకటించేటప్పటికి ఆమె, ఆమె భర్త నాల్గవ దశ ఐ వి ఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వారు ఒకే ఒక్క అండాన్ని ఫ్రీజ్ చేసి ఉంచారు.

చాలా మంది లాగే శీతల్ కూడా కృంగిపోయారు. కానీ, గతంలో కూడా చాలా బాధని అనుభవించి ఉండటంతో ఇప్పుడు కాస్త ధైర్యం తెచుకున్నానని చెప్పారు.

"అంటే ఇది అంత కష్టతరమైన పరిస్థితి అని కాదు, కొన్ని క్షణాల్లో చాలా నిరాశ ఆవహించేస్తుంది".

పిల్లల్ని కనడానికి చికిత్స తీసుకునే కొత్తలో ఇంస్టాగ్రామ్ లో ట్రయిన్గ్ టూ కన్సీవ్ ' లో కధలు చదివి తేలికపడేదానినని చెప్పారు.

ఇప్పుడు తన అనుభవాలని ఇతరులతో పంచుకోవాలని అనుకుంటున్నారు.

ఇది అనుభవిస్తున్న వారు ఈ బాధని అర్ధం చేసుకోగలరు. పిల్లల్ని కనడం గురించి భారతీయ మహిళలు ఎదుర్కొనే సామాజిక ఒత్తిడి గురించి ఎక్కువగా ఎవరూ మాట్లాడటం లేదు.

బీబీసీ 100 విమెన్ బృందంతో మాట్లాడిన చాలా మంది మహిళలు కొన్ని సంవత్సరాల నుంచి పిల్లల్ని కనడం కోసం వివిధ చికిత్సలు తీసుకుంటున్నారు. వారి జీవితాలలో ఈ సంతానోత్పత్తి చికిత్స ఎంత ముఖ్య భాగమైపోయిందో వివరిస్త్తూ, చాలా వరకు సమయం డాక్టర్ల దగ్గరకి వెళ్ళడానికే సరిపోయేదని చెప్పారు.

కొన్ని సార్లు డాక్టర్ల అప్పాయింట్మెంట్లు కేన్సెల్ అయ్యేవని చెప్పారు.

వచ్చే 12 నెలల్లో చోటు చేసుకున్న మార్పులే నా జీవితాన్ని నిర్ణయిస్తాయని, పూర్తి పేరు చెప్పడానికి ఇష్టపడని సిఓబన్ చెప్పారు.

"నేను నా పిల్లలకి జన్మనిస్తానో లేదో రానున్న సమయమే నిర్ణయిస్తుంది".

ఈమెకి 41 సంవత్సరాలు. గతంలో చాలా సార్లు గర్భస్రావాలు జరిగాయి. ఐ వి ఎఫ్ చికిత్స తీసుకోవడానికి ఆమె ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది.

ఇటీవలే డాక్టర్లు ఆమె పరిస్థితి మెరుగుపడిందని నిర్ణయించి చికిత్స అందించడానికి నిర్ణయించారు,

"రెండు నెలల క్రితం నా ఆరోగ్యం సరిగ్గా ఉంది. వచ్చే సంవత్సరానికి ఎలా ఉంటానో తెలియదు", అని అన్నారు.

చికిత్స కోసం వేచి ఉన్న వారి జాబితాని ఎలా నిర్వహిస్తారో కూడా చూడాల్సి ఉందని ఆమె విచారం వ్యక్తం చేసారు.

"నేను, నా భర్త ఏప్రిల్ నెలలో చికిత్స కి వెళ్లాల్సి ఉంది, అయితే, ఇప్పుడు ఎవరు ముందు వెళతామో తెలియదు".

"నా కంటే ముందు చాలా మంది చికిత్స తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లకి ముందు అవకాశం ఇవ్వడమే న్యాయం ".

(బీబీసీ 100 వుమన్' సిరీస్ 2013 నుంచి ఏటా స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన 100 మంది మహిళల గాథలను ప్రపంచవ్యాప్తంగా పాఠకులు, వీక్షకుల ముందుకు తెస్తోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)