పాకిస్తాన్: సింహాల సఫారీలో చిక్కిన టీనేజర్

లాహోర్ సఫారీ
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో అతిపెద్ద జూ అయిన లాహోర్ సఫారీలో దాదాపు 40 సింహాలు ఉన్నాయి

పాకిస్తాన్‌లో కనిపించకుండా పోయిన ఒక టీనేజీ యువకుడు.. లాహోర్‌లోని ఒక జూలో సింహాల ఎన్‌క్లోజర్‌లో అస్థిపంజరంలా కనిపించాడు.

ముహమ్మద్ బిలాల్ (17) కంచె దాటి ఎన్‌క్లోజర్‌లోకి ఎలా వెళ్లాడు, అతడి మరణానికి కారణమేమిటి అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

అయితే.. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిలాల్ చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వారం ఆరంభంలో జూ కార్యాలయాలపై దాడులు జరిగాయి.

ప్రభుత్వ మద్దతుతో నడిచే లాహోర్ సఫారీని 1982లో స్థాపించారు. ఇది పాక్‌లో అతి పెద్దదైన, అత్యంత ప్రాచీనమైన పార్కు.

ముహమ్మద్ బిలాల్
ఫొటో క్యాప్షన్, పశువుల మేత కోసం ముహమ్మద్ బిలాల్ ఇల్లువదిలి వెళ్లాడు

యువకుడిని వెదకటానికి సాయం చేయాలని కోరుతూ సమీప గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు మంగళవారం రాత్రి తమ దగ్గరకు వచ్చారని డైరెక్టర్ చౌదరీ షాఫ్ఖాత్ బీబీసీకి చెప్పారు.

''అప్పటికే చాలా రాత్రి అయిందని, సఫారీలో చీకట్లో గాలింపు చేపట్టటం ప్రమాదకరం కావచ్చునని మేం వారికి చెప్పాం'' అని తెలిపారు.

జూ ఉద్యోగులు బుధవారం ఉదయం గాలింపు చేపట్టినపుడు.. రక్తపు మడుగులో పుర్రె, కొన్ని ఎముకలు, దుస్తుల ముక్కలు కనిపించాయి. అవి అదృశ్యమైన బాలుడి దుస్తులుగా బంధువులు గుర్తించారు.

ఆ బాలుడు పశువుల మేత కోసం గడ్డి కోయటానికి మంగళవారం మధ్యాహ్నం ఇల్లు వదిలి వెళ్లాడని అతడి బంధువులు తమకు చెప్పినట్లు అధికారులు తెలిపారు.

మరణానికి కారణం తెలుసుకోవటానికి బిలాల్ అస్తికలను పరీక్షలకు పంపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)