కరోనావైరస్.. సార్స్‌ వైరస్‌ని మించిపోతోందా

చైనాలో ఇప్పటివరకూ సంభవించిన కరోనావైరస్ మృతుల సంఖ్య 2003లో సంభవించిన సార్స్ మహమ్మారి మృతుల సంఖ్యను దాటేసింది.

కరోనావైరస్‌కు కేంద్రమైన చైనాలోని ఒక్క హుబే ప్రావిన్స్‌లోనే 780మంది చనిపోయారని ప్రాంతీయ ఆరోగ్య విభాగం అధికారులు చెబుతున్నారు.

చైనా, హాంకాంగ్‌లలో కలిపి ఇప్పటివరకూ మొత్తం 803 కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయి.

2003లో ప్రపంచాన్ని కుదిపేసిన సార్స్ (సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రమ్) కారణంగా 20కి పైగా దేశాల్లో 774 మంది చనిపోయారు.

ప్రస్తుతం వణికిస్తున్న కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 34,800 మంది బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం చైనాలోనే ఉన్నారు.

దీంతో గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.

ప్రస్తుత చైనాలో ఎలా ఉంది?

శనివారం నాడు 81మంది మరణించారని హుబే ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో మొత్తం మరణాల సంఖ్య 780కి చేరింది అని తాజా బులెటిన్‌లో వెల్లడించారు.

ఇప్పటివరకూ చైనా, హాంకాంగ్‌లతో పాటు, ఫిలిప్పీన్స్‌లో నమోదైన ఓ మరణంతో కలిపి కరోనావైరస్ కారణంగా 803మంది చనిపోయారు.

2019-ఎన్‌కోవ్ అని పిలిస్తున్న ఈ కొత్త వైరస్‌ను ముందుగా హుబే రాష్ట్ర రాజధాని వుహాన్‌లో గుర్తించారు. ప్రస్తుతం ఆ నగరం మొత్తాన్ని కొన్ని వారాలుగా మూసివేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. నగరం లోపలకి, లోపల నుంచి బయటకు ఎవరినీ అనుమతించడం లేదు.

చైనా నుంచి వచ్చే ఎవరైనా సరే రెండువారాల పాటు క్వారంటైన్ పిరియడ్‌లో ఉండాల్సిందేనని హాంకాంగ్ నిబంధన విధించింది. పర్యటకులు తమ హోటల్ రూములు లేదా ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్లలోనే ఉండాలని, స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్పష్టం చేసింది.

ఈ నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తామని హెచ్చరించింది. హాంకాంగ్‌లో 26 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

గురువారం నాడు వుహాన్‌లోని జిన్యింటాన్ హాస్పిటల్‌లో 60 ఏళ్ల అమెరికా పౌరుడు మరణించారు. చైనాలో కరోనావైరస్ కారణంగా నమోదైన తొలి విదేశీయుడి మృతి ఇది.

తమ హాటె-సవోయి ప్రాంతంలో ఐదు కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని శనివారం నాడు ఫ్రాన్స్ వెల్లడించింది. వీరిలో తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. దీంతో ఇప్పటి వరకూ ఫ్రాన్స్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 11కు చేరింది.

కొత్తగా గుర్తించిన ఐదుగురు బాధితులూ ఒకే చోట నివసించే బ్రిటన్ దేశీయులని, వీరిలో ఒకరు సింగపూర్‌ నుంచి ఇక్కడకు వచ్చారని ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రి ఆగ్నెస్ బుజీన్ తెలిపారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఏమీ లేదని, వారితో పాటు నివసిస్తున్న మరో ఆరుగురికి కూడా పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

కరోనావైరస్‌ను ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు ప్రయత్నించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ మరణంపై చైనా వ్యాప్తంగా ఆగ్రహం, విషాదం నెలకొంది. వుహాన్‌లో రోగులకు చికిత్స చేసే సమయంలో ఆయనకు కూడా వైరస్ సోకింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)