రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన ఇండోనేషియా దేశాధ్యక్షుడు

జకర్తాలోని దాదాపు సగం ప్రాంతం ఇప్పుడు సముద్ర మట్టానికి దిగువన ఉంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జకర్తాలోని దాదాపు సగం ప్రాంతం ఇప్పుడు సముద్ర మట్టానికి దిగువన ఉంది

ఇండోనేషియా రాజధానిని బోర్నియో ద్వీపంలోని తూర్పు కాళీమంటన్ ప్రావిన్స్‌కు మార్చనున్నట్లు దేశాధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు.

ప్రస్తుతం రాజధానిగా ఉన్న జకర్తా జనాభా కోటికి పైగా ఉంది. ఈ నగరం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో నీట మునుగుతోంది.

నగరంలోని చాలా ప్రాంతాలు ఏటా 25 సెం.మీ. వరకు మునిగిపోతున్నాయి. దాదాపు సగం నగరం ఇప్పుడు సముద్ర మట్టానికి దిగువన ఉంది.

ప్రస్తుతం రాజధానిగా ప్రకటించిన బోర్నియా ద్వీపంలోని రెండు ప్రాంతాలు కుటాయ్ కెర్తనేగర, పెనాజమ్ పేసర్ ఉతారా ఇంకా అభివృద్ధి చెందలేదు.

''రాజధానిగా ఎంచుకున్న ప్రాంతం చాలా వ్యూహాత్మకమైంది. ఇండోనేషియాకు ఇది మధ్యభాగంలో ఉంటుంది. అలాగే, నగర ప్రాంతానికి దగ్గర'' అని అధ్యక్షుడు విడోడో తన టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు.

''పాలన, వ్యాపార లావాదేవీలు, ఆర్థికం, వాణిజ్యం, ఇతర సేవలకు కేంద్రంగా జకర్తా తీవ్రమైన భారాన్ని ఎదుర్కొంటుంది. కొత్తగా ఎంచుకున్న రాజధాని ప్రాంతంలో ప్రకృతి వైపరిత్యాలు వచ్చే అవకాశం తక్కువ'' అని పేర్కొన్నారు.

జకర్తా నగరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జకర్తా నగరం

రాజధాని మార్పునకు సంబంధింన ఈ ప్రతిష్టాత్మక పథకానికి దాదాపు 2.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. జకర్తాలో ట్రాఫిక్ సమస్య వల్ల ఆర్థికరంగంపై ఏడాదికి 1.47 వేల కోట్ల భారం పడుతోందని ప్రణాళిక మంత్రి గతంలో చెప్పారు.

ఒరంగుటాన్ల సహజ ఆవాసాలకు సంబంధించిన అతికొద్ది ప్రదేశాలలో రాజధానిగా ఎంచుకున్న కాళీమంటన్ ప్రాంతం ఒకటి కావడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజధానిగా మార్చడం వల్ల అక్కడున్న అరుదైన జాతులు అంతరించే ప్రమాదం ఉందని అంటున్నారు.

''కొత్త రాజధాని ప్రాంతం సహజ రక్షిత ఆవాసంలో నిర్మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'' అని ఇండోనేషియా గ్రీన్‌పీస్ ప్రచారకుడు జాస్మిన్ పుత్రి అన్నారు.

కాళీమంటన్ ప్రాంతం కార్చిచ్చుకు కేంద్రంగా ఉంది. 2015 నుంచి దేశంలో కార్చిచ్చు ప్రమాదాలు ఆందోళన కలిగించే స్థాయికి పెరిగాయి.

ప్రభుత్వం గత రెండు దశాబ్దాలుగా వికేంద్రీకరణ చర్యలు చేపడుతూనే ఉంది. మున్సిపాలటీలకు ఆర్థిక, రాజకీయ అధికారాలను కలిగించేందుకు భారీ కార్యక్రమాలు చేపట్టింది.

ఇండోనేషియానే కాదు గతంలో చాలా దేశాలు వివిధ కారణాలతో తమ రాజధాని నగరాలను మార్చాయి. బ్రెజిల్, పాకిస్తాన్, నైజీరియాలు రాజధాని ప్రాంతాలను మార్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)