మసూద్ అజర్ కుమారుడు హమ్మద్ అజర్, సోదరుడు ముఫ్తీ రవూఫ్‌ను నిర్బంధించిన పాకిస్తాన్

అజర్ మసూద్

ఫొటో సోర్స్, Getty Images

జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుమారుడు హమ్మద్ అజర్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్‌లను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది.

విచారణ కోసం వీరిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

నేషనల్ యాక్షన్ ప్లాన్(ఎన్ఏపీ)ని అమలు చేయడంలో భాగంగా మార్చి 4న పాకిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

పాక్ అరెస్ట్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం

ఈ సమావేశానికి దేశంలోని అన్ని ప్రావిన్సులకు సంబంధించిన ప్రభుత్వాలు హాజరయ్యాయి. నిషేధిత సంస్థలపై చర్యలను వేగవంతం చేయాలని ఈ సమావేశంలో అందరూ నిర్ణయించారు.

అన్ని ప్రావిన్సు ప్రభుత్వాల అంగీకారంతో మసూద్ అజర్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్, హమాద్ అజర్, సహా నిషేధిత సంస్థలకు సంబంధించి పరిశీలనలో ఉన్న మొత్తం 44 మందిని విచారణ కోసం నిర్బంధంలోకి తీసుకున్నారు.

పాక్ అరెస్ట్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటన

నిర్బంధంలో ఉన్న అబ్దుల్ రవూఫ్‌, ఇతరులకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపిందని బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మాణీ తెలిపారు.

నేషనల్ యాక్షన్ ప్లాన్‌ సమీక్ష సమయంలో నేషనల్ సెక్యూరిటీ కమిటీ(ఎన్ఎస్‌సి) తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ చర్యలు కొనసాగుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా, ఈ నిర్బంధాలు బయటి నుంచి వచ్చిన ఒత్తిళ్లవల్ల తీసుకున్న చర్యలు కావని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందకుండా నిరోధించడంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది.

భారతదేశంతో సంబంధాలు సంక్షోభంతో పడటానికి ముందే తాము ఈ చర్యలు తీసుకోవడం మొదలు పెట్టామని పాకిస్తాన్ అంతర్గత శాఖ మంత్రి చెప్పారని సికందర్ కిర్మాణీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)