You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్ వాకౌట్: అమెరికా షట్డౌన్ చర్చలకు మధ్యలోనే ‘బై - బై’
అమెరికా ప్రభుత్వ పాక్షిక స్తంభన 19వ రోజుకు చేరుకోగా.. డెమొక్రటిక్ పార్టీ నాయకులతో చర్చల సమావేశం నుంచి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిష్క్రమించారు.
దీంతో షట్డౌన్ పరిష్కారం కోసం ఉద్దేశించిన ఈ చర్చలు విఫలమయ్యాయి.
అమెరికా - మెక్సికో సరిహద్దులో గోడ కట్టటానికి నిధులు సమకూర్చటాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ, చుక్ షూమర్లు పట్టువిడువలేదు. దీంతో, ఈ సమావేశం ‘‘పూర్తిగా టైం వేస్ట్.. బై - బై’’ అంటూ ట్రంప్ వాకౌట్ చేశారు.
అధ్యక్షుడు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని డెమోక్రాట్లు మరోసారి విమర్శించారు.
ప్రభుత్వం పాక్షికంగా స్తంభించిన తర్వాత.. ఈ నెల 11న శుక్రవారం వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈసారి దాదాపు 8,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులకు వేతనాలు లభించవు.
ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం 5 బిలియన్ డాలర్ల నిధులు కేటాయించాలన్న ట్రంప్ డిమాండ్ను.. ప్రతినిధుల సభలో మెజారిటీగా ఉన్న డెమోక్రాట్లు వ్యతిరేకించడంతో డిసెంబర్ 21 అర్ధరాత్రి నుంచి షట్డౌన్ ప్రారంభమైంది.
ఈ అంశంపై చర్చల కోసం అధ్యక్ష భవనం వైట్హౌస్లో తాజాగా ట్రంప్ ఏర్పాటు చేసిన సమావేశం కేవలం 14 నిమిషాల్లోనే ముగిసింది.
‘‘నా గోడ నిర్మాణానికి మీరు అంగీకరిస్తారా?’’ అని స్పీకర్ నాన్సీ పెలోసీని ట్రంప్ నేరుగా ప్రశ్నించారని షూమర్ చెప్పారు.
‘‘ఆయన లేచి నిల్చుని‘ మరైతే చర్చించటానికి ఏమీ లేదు’ అంటూ బయటకు వెళ్లిపోయారు. ఆయన అనుకున్నది జరగలేదు కాబట్టి హఠం చేస్తున్నారు’’ అని షూమర్ విమర్శించారు.
‘‘ఇవి రాజకీయాలు కాదు. దేశ ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నిస్తున్నా’’ అని ట్రంప్ చెప్పినట్లు శ్వేతసౌధం అధికారి ఒకరు న్యూయార్క్ టైమ్స్ పత్రికకు తెలిపారు.
సమావేశం అనంతరం ట్రంప్ ట్విటర్లో ‘‘చుక్, నాన్సీలతో సమావేశం నుంచి ఇప్పుడే బయటకొచ్చా. పూర్తిగా టైం వేస్ట్’’ అని వ్యాఖ్యానించారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)