సోషల్ మీడియా: కావాలనే యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు

- రచయిత, హిల్లరీ ఆండర్సన్
- హోదా, బీబీసీ పనోరమ
మనలో చాలా మంది ప్రతిరోజు గంటల తరబడి తల వంచుకునే ఉంటాము. దానికి కారణం మన సెల్ఫోన్లు. ఇంకా చెప్పాలంటే మన సెల్ఫోన్లలోని సామాజిక మాధ్యమాల యాప్స్. ప్రపంచ జనాభాలో మూడో వంతు ప్రజలు రకరకాల సోషల్ మీడియా సైట్లు, యాప్స్ను ఉయోగిస్తున్నారు. ఒకరకంగా ఈ సోషల్ మీడియానే మనల్ని మింగేస్తోంది.
ఈ పరిశ్రమలోని నిపుణులు.. ముఖ్యంగా సిలికాన్ వాలీ టెక్ డిజైనర్ అజార్ రాస్కిన్ బీబీసీతో మాట్లాడుతూ, సోషల్ మీడియా సంస్థలు వ్యూహాత్మకంగా మనం వారి సైట్లకు అడిక్ట్ అయిపోయేలా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయని చెప్పారు.
‘‘మన ప్రవర్తనకు సరిపోయే సాంకేతిక కొకెయిన్ తీసుకుని మన ఇంటర్ఫేస్ మీద చల్లేసి మనని మత్తులోకి దించుతున్నాయి. ఇవి (సోషల్ మీడియా యాప్స్) వీలైనంత ఎక్కువ వ్యసనంగా మారేందుకు మీ ఫోన్ తెర వెనుక కొన్ని వేల మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు’’ అని అజా రాస్కిన్ తెలిపారు.
ఈ సోషల్ మీడియాలో "లైక్" అన్నది చాలా బలమైన ఫీచర్. ఇది మనుషుల్ని మానసికంగా లాగేసే అంశంమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనలో చాలా మందిని ఇది "నా పోస్ట్కు ఎన్ని లైక్స్ వచ్చాయి" అన్న విషయం తెలుసుకునేందుకు తరచూ ప్రేరేపిస్తుంది.

స్మార్ట్ఫోన్లోని మరో సౌకర్యం, చూపుడు వేలితో అంతులేకుండా స్క్రోల్ చేసుకుంటూ పోవడం. ఈ స్క్రోల్ డౌన్ విధానాన్ని అజా రాస్కిన్ కనుగొన్నారు. స్క్రోల్ డౌన్ అలా అలా వెళుతూనే ఉంటుంది. చివరకు, మన ఆరోగ్యాన్ని మనకు తెలియకుండానే దెబ్బతీస్తుంది ఈ స్క్రోల్ డౌన్ ఫీచర్.
సాంకేతిక ఆవిష్కరణలు అవసరం లేకున్నా గంటల కొద్దీ యూజర్లు తమ ఫోన్లను చూసేలా చేస్తున్నాయని రాస్కిన్ అభిప్రాయపడ్డారు.
కంపెనీలు ఎంతో మంది డిజైనర్లకు ఉపాధి కల్పిస్తున్నాయని, వారంతా ఆయా కంపెనీల వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా.. యాప్స్ వ్యసనాన్ని పెంచే సరికొత్త ఫీచర్లను తయారు చేస్తున్నారని ఆయన చెప్పారు.
‘‘ఆ కంపెనీల షేర్ల ధరలు పెరగాలన్నా, మరిన్ని నిధులు రావాలన్నా.. ఆయా కంపెనీల యాప్స్పై యూజర్లు గడిపే సమయం పెరగాలి’’ అని రాస్కిన్ అన్నారు.

శాండీ పారాకీలిస్ ఫేస్బుక్లో పని చేసేవారు. ప్రజలను ఎలా ఆకర్షించాలో ఫేస్బుక్కు బాగా తెలుసని ఆయన అంటున్నారు.
‘‘మీకు ఒక కొత్త అలవాటును నేర్పించే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని ఎక్కువ సేపు ఆ యాప్లోనే నిమగ్నం అయ్యేలా చేసే వ్యాపార వ్యూహాలు వాళ్ళ వద్ద ఉన్నాయి. ఆలా మీరు ఏయే అంశాల మీద ఎంత సమయం వెచ్చిస్తున్నారు, వేటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారన్నది తెలిసిపోతుంది. ఆ సమాచారాన్ని వారు ప్రకటనదారులకు అమ్మేస్తారు’’ అని శాండీ పారాకీలిస్ వెల్లడించారు.
2012లో ఆయన ఫేస్బుక్ కంపెనీ నుంచి బయటికొచ్చారు. అప్పటి నుంచే ఆ యాప్ వాడటాన్ని కూడా మానేశారు. ‘‘సిగరెట్లు మానేసినట్లు అనిపించింది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నాన్సీ చీవర్ స్మార్ట్ఫోన్లు మనుషులపై చూపిస్తున్న ప్రభావాన్ని పరిశోధిస్తున్నారు. ఒక ప్రయోగంలో భాగంగా ఆమె నన్ను కంప్యూటర్ ముందు కూర్చోపెట్టారు. నా ఫోన్ను తీసేసుకున్నారు. ఆ తరువాత కంప్యూటర్లో నాకు థియరిటికల్ ఫిజిక్స్కు సంబంధించిన ఒక వీడియో చూపించడం ప్రారంభించారు. నేను ఆ వీడియో చూస్తున్నప్పుడు, రహస్యంగా నా ఫోన్కు మెసేజ్ లు పంపడం మొదలెట్టారు. ఆ తరువాత ఆ ప్రయోగం ఫలితాలను చూస్తే మెసేజ్ వచ్చిన ప్రతిసారి నాలో ఒత్తిడి స్థాయి పెరిగిందని తెలిసింది.
పాశ్చాత్య దేశాల్లో ప్రజలు రోజుకు సగటున రెండు మూడు గంటల పాటు తమ స్మార్ట్ఫోన్లలోని సామజిక మాధ్యమాలలోనే గడుపుతారు.
సామజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగించడం వల్ల నిద్ర లేమి సమస్యలు, కుంగుబాటు, ఆందోళన వంటి రుగ్మతలు కూడా పెరుగుతున్నాయని ఇటీవలి కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.
అయితే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలు బీబీసీతో మాట్లాడుతూ, తమ యాప్స్ ప్రజలను కలిపేందుకే తప్ప వారిని వ్యసనపరులుగా మార్చడం కోసం ఉద్దేశించినవి కావని అంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఫేస్బుక్లో పెరిగిన 'ద్వేషం'
- ఫేస్బుక్ సెక్స్ వీడియో వివాదం.. వెయ్యి మందిపై కేసు
- ఫేస్బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
- ఫేస్బుక్: సమాచారం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
- ఫేస్బుక్ మోడరేటర్: చూడలేనివెన్నో అక్కడ చూడాల్సి ఉంటుంది!
- బిజెపి, కాంగ్రెస్లు మీ ఫేస్బుక్ డేటా వాడుకుంటున్నాయా!
- అప్పట్లో ఫుట్బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్బాల్
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- థాయ్ గుహలో బాలలు: బయటకు ఎలా తీసుకురావాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










