అమెరికావి బాధ్యతారహిత వ్యాఖ్యలు: చైనా

ఫొటో సోర్స్, GOOGLE/DIGITAL GLOBE
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో క్షిపణులు, యుద్ధ విమానాలను మోహరించి చైనా తమ పొరుగు దేశాలను భయపెడుతోందన్న అమెరికా వ్యాఖ్యలను చైనా ఖండించింది.
చైనా చర్యలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయన్న అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని వ్యాఖ్యానించింది. సింగపూర్లో జరుగుతున్న భద్రతా సదస్సులో చైనా లెఫ్టినెంట్ జనరల్ హీ లీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బాధ్యతారహిత వ్యాఖ్యలు ఎవరు చేసినా సహించేది లేదని స్పష్టం చేశారు. తమ దేశ భద్రతలో భాగంగా సైనిక మోహరింపులు జరుగుతాయని, ఇవి ఆత్మరక్షణ కోసం ఉద్దేశించినవని ఆయనన్నారు.
"మీ భూభాగంలో ఎక్కడైనా మీరు సైన్యాన్ని మోహరించవచ్చు, ఆయుధాలను సిద్ధం చేయవచ్చు, మేము చేసింది ఇదే. దీనిపై ఎవరు వ్యాఖ్యానించినా అది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే" అని హీ లీ అన్నారు.
దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద భూభాగంలో ఓడలను ధ్వంసం చేసే క్షిపణులు, భూమి నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఎలక్ట్రానిక్ జామర్ల లాంటి మిలిటరీ సామగ్రిని చైనా మోహరించిందని జేమ్స్ మాటిస్ ఇంతకు ముందు వ్యాఖ్యానించారు.
అలా మిలిటరీ వినియోగించే ఆయుధ సామగ్రిని దించడం అంటే పొరుగు దేశాలపై జులుం ప్రదర్శించి, బెదింపులకు పాల్పడటమే అవుతుందని అభిప్రాయపడ్డారు.
"చైనాతో నిర్మాణాత్మక సంబంధాలను ట్రంప్ పాలకవర్గం కోరుకుంటోందని, అదే సమయంలో అవసరమైతే గట్టిగా బదులిచ్చేందుకూ సిద్ధమే" అని మాటిస్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఏమిటీ వివాదం?
అంతర్జాతీయ జల రవాణాకు కీలక మార్గంగా ఉన్న దక్షిణ చైనా సముద్రంపై తమకే హక్కులు ఉన్నాయంటూ ఆరు దేశాలు వాదిస్తున్నాయి.
ఇక్కడ మత్స్య సంపద అపారంగా ఉంది. పెద్ద మొత్తంలో చమురు, సహజయవాయువు నిక్షేపాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. ఈ ప్రాంతం మీద సార్వభౌమాధికారం కోసం చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేషియా, బ్రూనై దేశాల మధ్య వివాదం నడుస్తోంది.

ఫొటో సోర్స్, VCG
ఈ సముద్ర జలాల్లో చైనా కొన్నాళ్లుగా చిన్నచిన్న దీవులను, మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేస్తోంది.
ఇటీవల ఇక్కడి వివాదాస్పద భూభాగం పారాసెల్ ద్వీపంలో తొలిసారిగా ఆ దేశ వైమానికదళం బాంబు దాడులకు ఉపయోగించే యుద్ధవిమానాలను దించింది.
దీవులు, రీఫ్లలో ఆ యుద్ధవిమానాలతో విన్యాసాలు నిర్వహించింది. వాటిలో ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల హెచ్-6కే బాంబర్ కూడా ఉంది.
చైనా తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తన చర్యలతో దక్షిణ చైనా సముద్రంతో ముడిపడిన ప్రాంతాన్ని అస్థిరపరుస్తోందని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









