అమెరికా పాఠశాలలో కాల్పులు: పది మంది మృతి

టెక్సాస్‌లోని ఒక హైస్కూలులో జరిగిన కాల్పుల్లో పది మంది చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో పది మంది గాయపడ్డారు.

చనిపోయిన అందరూ విద్యార్థులేనని వివరించారు.

హూస్టన్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంటా ఫె హైస్కూల్‌లో ఈ కాల్పులు జరిగాయి. దాడి తర్వాత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు.

తరగతులు ప్రారంభం కాగానే కాల్పులు మొదలయ్యాయని, దీంతో చాలామంది గాయపడ్డారని వెల్లడించారు.

సీబీఎస్ న్యూస్ ప్రకారం 17 ఏళ్ల దిమిత్రిస్ పగోర్టిజ్ అనే అనుమానితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టెక్సాస్‌లోని అతిపెద్ద కౌంటీ.. హారిస్ కౌంటీ షరీఫ్ ఎడ్ గొంజలెజ్ ఈ కాల్పుల ఘటనపై ట్వీట్ చేస్తూ.. పలువురు మృతి చెందిన ఈ సంఘటనపై అధికారులు స్పందించారని వెల్లడించారు.

గాయాలపాలైన ఒక పోలీసు అధికారికి చికిత్స అందుతోందని, అయితే గాయాల తీవ్రతపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని కూడా వెల్లడించారు.

పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోవాలని హెచ్చరించే ‘ఫైర్ అలారమ్’ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ముందే వినిపించిందని విద్యార్థులు వివరించారు. అయితే, అది ఎలా మోగిందో స్పష్టంగా తెలియదు.

ఆర్ట్ క్లాసులో షూటింగ్ జరిగిందని, కాల్పులకు గురైంది ఒక బాలిక అని ప్రత్యక్ష సాక్షి అయిన ఒక విద్యార్థిని కేటీఆర్‌కే టీవీతో చెప్పారు.

‘షాట్ గన్‌తో ఒకరు లోపలికి నడుచుకుంటూ వచ్చి, కాల్పులు మొదలు పెట్టారు’’ అని ఆమె తెలిపారు. క్లాసు నుంచి బయటపడే తొందరలో కాల్పులకు పాల్పడిన షూటర్‌ను తాను చూడలేదని వివరించింది.

పాఠశాల బయట ఉన్న ఖాళీ స్థలంలో సాయుధ అధికారుల సమక్షంలో విద్యార్థులు తమ బ్యాగుల్ని ఖాళీ చేస్తున్న దృశ్యాలను హెలీకాప్టర్లు చిత్రీకరించాయి.

సంఘటనా స్థలానికి బాంబు స్క్వాడ్ చేరుకుంది. గాయపడిన వారిని పలు అంబులెన్స్ హెలీకాప్టర్లు దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు చేర్చాయి.

ఈ సంఘటనపై అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారులు, స్థానిక ఏటీఎఫ్ బ్యూరోతో కలసి దర్యాప్తు చేపట్టారు.

దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేస్తూ.. ‘‘టెక్సాస్ పాఠశాలలో కాల్పులు. ప్రాథమిక సమాచారం బాగోలేదు. అందరికీ దేవుని ఆశీస్సులుండాలి’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)