బాణాసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం దిల్లీ కాలుష్యాన్ని తగ్గించిందా?

ఫొటో సోర్స్, Getty Images
కాలుష్యం పెరుగుతుందనే కారణంతో దిల్లీలో బాణాసంచా అమ్మకాలను సుప్రీంకోర్టు నిషేధించింది.
కానీ ఈ ప్రభావం పెద్దగా కనిపించలేదు. టపాసుల మోతతో దిల్లీ మారుమోగింది. ఆశించినంతగా కాలుష్యం తగ్గలేదు.
దీపావళి టపాసుల మోతతో దిల్లీలో పొగ దట్టంగా కమ్ముకుంది. ఆకాశంలో దుమ్ముధూళి చేరింది. దీనికి పొగమంచు తోడవడంతో గాలితో గాఢత పెరిగింది.
అయితే, గత దీపావళి కంటే ఈసారి కాలుష్యం కాస్త తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా గాలి కాలుష్యం తీవ్రతను లెక్కిస్తారు. దీపావళి రోజు దిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 319గా ఉంది. గతేడాది దీపావళి రోజు ఇది 431గా ఉంది. అంటే గతేడాది కంటే ఈసారి కాలుష్యం కాస్త తగ్గింది.
అయితే, ఈ రెండు గణాంకాలు ప్రమాదకరమేనని వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న హరిజిత్ సింగ్ బీబీసీకి చెప్పారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకరంగానే భావించాల్సి ఉంటుంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 401 కంటే ఎక్కువుంటే మరింత ప్రమాదకరం. కోర్టు ఆంక్షలు, ప్రజల్లో చైతన్యం రావడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి కాలుష్య తీవ్రత కాస్త తగ్గిందని హరిజిత్ సింగ్ చెప్పారు.
దీపావళి రోజు సాయంత్రం 6 గంటలకు వాయు, శబ్ధ కాలుష్యం తక్కువగానే ఉన్నప్పటికీ.. అర్ధరాత్రి 12గంటల సమయంలో వీటి తీవ్రత చాలా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
దీపావళి మరుసటి రోజు
- దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం దీపావళి మరుసటి రోజు అంటే అక్టోబర్ 20న ఉదయం 7.25 గంటలకు దిల్లీలో క్యూబిక్ మీటర్ గాలిలో పర్టిక్యులర్ మ్యాటర్ 2.5గా, కాలుష్య కణాలు 985 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి. గాలిలో ఉన్న కాలుష్య కణాల సంఖ్యను పర్టిక్యులర్ మ్యాటర్ అంటారు.
- ఆర్కేపురంలో క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5గా ఉంది. కాలుష్య కణాలు 1179 మైక్రో గ్రాములగా రికార్డయ్యాయి.
- టెంపుల్ ఏరియా రోడ్లో పీఎం 2.5గా, పీఎం 10, 941గా నమోదైంది.
- శుక్రవారం ఉదయం 7.50కి ఆనంద్ విహార్లో పీఎం 2.5గా, పీఎం 10, 473గా రికార్డయింది.

ఫొటో సోర్స్, AFP
సాధారణం కంటే పదిరెట్ల ఎక్కువ కాలుష్యం
పర్టిక్యులర్ మ్యాటర్ అంటే గాలిలో ఉన్న కాలుష్య కణాల సంఖ్య. పీఎం 2.5 అంటే క్యూబిక్ మీటర్ గాలిలో 100 మైక్రోగ్రాముల కాలుష్య కణాలు ఉన్నట్లు లెక్క.
60 మెక్రోగ్రాములు ఉంటే సాధారణంగా పరిగణిస్తారు. అంటే దీపావళి రోజు సాధారణం కంటే పదిరెట్లు అధికంగా కాలుష్యం ఉన్నట్లు తెలుస్తోంది.
దిల్లీలో నవంబర్ 9 వరకు టపాసులు విక్రయించొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, బాణాసంచా కాల్చొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు. అందుకే దిల్లీలో టపాసుల మోత మోగింది.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి
దీపావళి సందర్భంగా హైదరాబాద్లోనూ కాలుష్యం పెరిగింది. ఉదయం 11గంటలకు గాలిలో పీఎం 2.5 గాలి నాణ్యత 177గా నమోదైంది. శుక్రవారం ఒక్కరోజులోనే కాలుష్యం భారీగా పెరిగింది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ కాలుష్యం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








