అరటి పళ్లు: భారతీయులు పవిత్రంగా భావించే కదళీ ఫలాలు విదేశాలకు ఎలా వెళ్లాయి?

అరటి పండ్లు
    • రచయిత, మీనాక్షి జే
    • హోదా, బీబీసీ ట్రావెల్

భారత్‌ అరటి పళ్లకు పుట్టినిల్లు. ఏడాది పొడవునా అందుబాటులో ఉండటం, తక్కువ ధరకే లభించడంతో ప్రజల జీవితాల్లో వీటికి ప్రత్యేక స్థానం దక్కింది. భారత సంస్కృతీ సంప్రదాయాల్లో అడుగడుగునా దీని జాడలు కనిపిస్తాయి.

పదేళ్ల క్రితం, అప్పుడే నాకు పెళ్లి అయింది. ఓ పూజ కోసం నేను నాగర్‌కోయిల్‌లోని మా అత్తగారింటికి వెళ్తూ దారి మధ్యలో అరటిపళ్ల కోసం ఆగాను. పోషకాలు పుష్కలంగా ఉండే ఎరుపు, పసుపు, ఊదా రంగులోని ఈ పళ్లను చూశాను. వీటి గెలలను పైకప్పుకు వేళాడదీశారు.

ఒక్కో రకం అరటి పండుకు ఒక్కో పేరు ఉంది. పూవన్, చెవ్వళి, మట్టిపళ్లం ఇలా భిన్నమైన పేర్లతో వీటిని పిలుస్తున్నారు. ఇలాంటి రంగు రంగుల అరటి పళ్లను నేను పుట్టిపెరిగిన హైదరాబాద్‌లో ఎప్పుడూ చూడలేదు. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్.. నాగర్‌కోయిల్‌కు 1200 కి.మీ. దూరంలో ఉంటుంది. నాకు సాధారణ అరటిపళ్లు మాత్రమే తెలుసు. వీటిని తమిళంలో వళైపళం, హిందీలో కేలా అని అంటారు. కానీ నాగర్‌కోయిల్‌లో దాదాపు 12 నుంచి 15 రకాల అరటి పళ్లు కనిపిస్తాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. ఒక్కో అవసరానికి ఒక్కోలా వీటిని ఉపయోగిస్తుంటారు. ఒక్కసారిగా నా పెళ్లి ముందు జీవితం ఎంత హాయిగా గడిచిపోయిందో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని అరటిపళ్ల గురించి తెలుసుకోవాల్సి వచ్చింది.

భారత్‌లో విరివిగా లభించే పళ్లలో అరటిపళ్లు ప్రధానమైనవి. ఇవి ఏడాది పొడవునా లభిస్తాయి. తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి. అందుకే ప్రతి శుభకార్యం, పండుగ, ఇతరత్రా కార్యక్రమాల్లోనూ వీటికి ప్రత్యేక స్థానముంటుంది. అరటిపళ్లు మాత్రమే అరటి చెట్టు మొత్తానికీ భారత సంస్కృతీ, సంప్రదాయాలతో విడదీయరాని అనుబంధముంది. దేశీయ రకాలను ఇంటి వెనుక, తోటల్లో పెంచుతుంటారు. ఇక్కడి తేమతో కూడిన వాతావరణం, చిత్తడి నేలలు అరటిపళ్లు పెంచడానికి అనువైన ప్రాంతాలు. ముఖ్యంగా పశ్చిమ కనుమల వెంబడి ఇవి చక్కగా పెరుగుతాయి.

అరటిపళ్లు

ఫొటో సోర్స్, Getty Images

భూమిపై తొలినాళ్లలో పండించిన పంటల్లో అరటి కూడా ఒకటి. విస్తృతంగా పండించే పంటగా కూడా దీనికి పేరుంది. వీటికి భారత్, ఆగ్నేయాసియా పుట్టినిల్లు. అయితే, ఇప్పుడు ఇవి చాలా ప్రాంతాలు, దేశాలకు విస్తరించాయి. కరోనావైరస్ వ్యాప్తి నడుమ కూడా ఎక్కువ మంది వీటిని ఆహారంగా తీసుకున్నారు. సులభంగా తయారుచేసుకోగలిగే బనానా బ్రెడ్ అయితే, అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది.

కదళీ ఫలం రుచికి అలెగ్జాండర్ మంత్రముగ్ధుడైనట్లు చరిత్ర చెబుతోంది. అరటిని సంస్కృతంలో కదళీ ఫలంగా పిలుస్తారు. అలెగ్జాండర్ వీటిని పశ్చిమాసియాకు తీసుకెళ్లాడు. అక్కడే వీటికి బనాన్ అనే పేరు వచ్చింది. అరబిక్‌లో బనాన్ అంటే చేతి వేళ్లు అని అర్థం. ఆ తర్వాత ఇవి 15వ శతాబ్దంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులకు విస్తరించాయి. ఆ తర్వాత బెర్ముడాకు చేరాయి. 17,18 శతాబ్దాల్లో బెర్ముడా నుంచి ఇంగ్లండ్‌కు ఈ పళ్లను తీసుకెళ్లేవారు. 1835లో మూసా కేవెండిషిగా పిలిచే పసుపు అరటిపళ్లను ఇంగ్లండ్‌లోని డెబ్రీషైర్‌లో జోసెఫ్ ప్యాక్స్‌టన్ పెంచేవారు. తన యజమాని విలియం కేవెండిష్ పేరునే ఆయన ఈ అరటిపళ్లకు పెట్టారు.

మిగతా రకాలతో పోల్చినప్పుడు పరిమాణంతోపాటు రుచి కూడా కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఈ కేవిండిష్ రకాలు ప్రత్యేకమైనవి. ఇవి వ్యాధులను తట్టుకొని నిలబడతాయి. అదే సమయంలో దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పశ్చిమ దేశాలు ఈ రకానికి బాగా అలవాటుపడ్డాయి. భారత్‌లో అధిక దిగుబడినిచ్చే జీ9 కేవిండిష్ రకాలను వాణిజ్య అవసరాల కోసం పెంచుతుంటారు. అయితే, దేశీయ అరటి రకాలు కూడా చాలా ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్థానికులు పూవన్, మొండన్, పేయన్ (త్రిమూర్తులు) అంటూ పాటలు కూడా పాడుతుంటారు. రుచిలో భిన్నంగా ఉండటంతో వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తుంటారు.

మరోవైపు భారత్‌లో అరటిపళ్లను సర్వ రోగ నివారిణిగా కూడా పిలుస్తుంటారు. ఇటు శారీరక, అటు ఆధ్యాత్మిక చికిత్సల్లోనూ వీటిని ఉపయోగిస్తారు. జిగురుజిగురుగా ఉండే ఈ పళ్లు చిన్నప్పుడు నాకు అసలు ఇష్టముండేవి కాదు. పచ్చకామెర్ల తర్వాత వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు మా అమ్మ నాకు వీటిని ఇవ్వడం ఇప్పటికీ గుర్తుంది. మా అమ్మమ్మ అయితే వీటిని పూజ అయిన తర్వాత ప్రసాదంగా పెట్టేవారు.

అరటిపళ్లు

నేడు అరటి పళ్లలోని పోషక విలువల గురించి దాదాపు అందరికీ తెలుసు. పండిన తర్వాత వీటిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బీ3, విటమిన్ సీలతోపాటు కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. భారత్‌లో వేల ఏళ్ల నుంచీ వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. అరటి చెట్లను చాలా పవిత్రంగా చూస్తారు. దీనిలో ప్రతి భాగాన్ని ఉపయోగిస్తారు. పళ్లు, ఆకులు, పువ్వులు, అరటి దవ్వ ఇలా అన్నింటినీ వైద్యంలో ఉపయోగిస్తారు.

అరటి పళ్లలో చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారని దిల్లీలోని నాద్ వెల్‌నెస్‌కు చెందిన ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్. శ్రీలక్ష్మి తెలిపారు.

మరోవైపు ఆయుర్వేదంలో భాగంగా మధుమేహ నివారణకు అరటి పువ్వు, దవ్వలను ఉపయోగిస్తుంటారు. అరటి కాండం లోపలి రసాన్ని కీటకాలు కుట్టినప్పుడు, కుష్టు రోగ నివారణలో ఉపయోగిస్తుంటారు. రక్తపోటు, నిద్రలేమి లాంటి ఒత్తిడి సంబంధిత వ్యాధుల నివారణలోనూ అరటిని ఉపయోగిస్తారని శ్రీలక్ష్మి చెప్పారు. థలపొథ్తిచిల్‌గా పిలిచే చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. దీనిలో భాగంగా ఔషధ మిశ్రమాన్ని తలకు పట్టించి అరటి ఆకులో శరీరాన్ని చూడతారు. ఫలితంగా ప్రశాంతంగా అనిపిస్తుంది.

బౌద్ధ మతంలోని తెరవాద గ్రంథమైన పాలి కేనన్‌లో ప్రస్తావించిన ఏకైక పండు అరటి పండే. వేదాలు, భగవద్గీతలోనూ దీనికి చోటుంది. అరటి, మామిడి, పనసలను ముక్కానిగా తమిళ సంగం రచనల్లో పిలుస్తారు. అరటిని హిందువుల గురువైన బృహస్పతితో పోలుస్తారు.

మరోవైపు సంతాన ప్రాప్తికీ అరటి చెట్టుతో సంబంధముందని హిందువులు భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో అరటి చెట్లను గుమ్మానికి రెండు వైపులా కడతారు. పశ్చిమ బెంగాల్‌లో అయితే దుర్గాపూట సమయంలో అరటి చెట్లును దుర్గా మాతగా కొలుస్తారు. అరటి చెట్లుకు ఎర్ర రంగు అంచు ఉండే పసుపు చీరను కట్టి అమ్మవారిలా ముస్తాబు చేస్తారు. ఈ దేవతను కోలా బవుగా పిలుస్తారు. ఇక్కడ కోలా అంటే అరటి పండు, బవు అంటే మహిళ అని అర్థం.

అరటిపళ్లు

ఫొటో సోర్స్, Getty Images

అరట పళ్లు తినడం విషయానికి వస్తే భారత్‌లో చాలా విధానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొందరు పచ్చివి తింటారు. మరికొందరు పళ్లు తింటారు. మట్టి పళహం లాంటి తేలిగ్గా అరిగిపోయే రకాలను పిల్లలకు ఆహారంగా పెడుతుంటారు. మరోవైపు నేంద్రన్, రస్థలి లాంటి ఎక్కువరోజులు నిల్వ ఉండే, నీరు తక్కువగా ఉండే రకాలను వంటల్లో వాడుతుంటారు.

''మేం కొంకణిలో వీటిని కేలె అని పిలుస్తుంటాం. కొంకణీ వంటల్లో వీటికి ప్రత్యేక స్థానముంది''అని ద లవ్ ఆఫ్ స్పైస్ బ్లాగ్ రచయిత శంతల నాయక్ షెనోయ్ వివరించారు. ''అరటి కాయ వేపుడు(కేలె ఉపకారి) అంటే నాకు చాలా ఇష్టం. కొబ్బరి తురుముతో చేసుకునే కేలె కోడెల్, అరటి పళ్లతో చేసుకునే స్వీట్ కేలె హల్వో కూడా నాకు ఇష్టం''అని ఆయన వివరించారు.

''సైవ మెన్ కుళంబులో చేపకు బదులు అరటి కాయల్ని ఉపయోగిస్తాం. శాకాహారులు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. చేపలకు ప్రత్యామ్నాయంగా మేం అరటి కాయలను చాలా కూరల్లో ఉపయోగిస్తాం''అని వన్స్ అపాన్ ఏ టైమ్ రెస్టారెంట్ చెఫ్ పార్ట్నర్ విఘ్నేష్ రామచంద్రన్ తెలిపారు.

అరటిపళ్లు

ఫొటో సోర్స్, Getty Images

నాకు అరటి పళ్లను ఎలా ఉపయోగిస్తారో మొత్తం తెలుసు అనుకున్నప్పుడే నేను సీ శేఖర్ గారిని కలిశాను. ఆయన చెన్నై శివార్లలోని అంకపుథూర్‌లో చేనేత కార్మికుడు. ఆయన అరటి వ్యర్థాలతో, అరటి పీచుతో చీరలు కూడా తయారుచేస్తుంటారు. ఆయన దగ్గర దాదాపు వంద మంది మహిళలు పనిచేస్తుంటారు. వీరు ఏళ్ల నుంచి పత్తి, అరటి పీచుతో చీరలు తయారుచేస్తున్నారు.

పచ్చిదైనా లేదా పండినా, పళ్లు అయినా పువ్వులైనా, కేవెండిష్ అయినా పూవన్ అయినా.. అన్నింటికీ భారత సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానముంది. వీటి గురించి తెలుసుకున్న కొద్దీ కొత్త విషయాలు, ఆశ్చర్యకర సంగతులు బయటపడుతూనే ఉంటాయి.

ఇక నా విషయానికి వస్తే పూజల కోసం అయితే రసకడలి లేదా మట్టి పళంను ఎంచుకుంటాను. ఎందుకంటే వీటిని చాలా శుభప్రదంగా భావిస్తుంటారు. మరోవైపు సాయంత్రం హాయిగా తినేందుకు అరటి చిప్స్ కూడా కొనుక్కుంటుంటాను. వీటిని ఒక్కోటి తింటుంటే ఒక్కో కథ గుర్తుకు వస్తుంటుంది.

ఇవి కూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)