భారత్, చైనా యుద్ధం: వెయ్యి మంది చైనా సైనికులతో 124 మంది భారత జవాన్ల పోరాటం

రెజాంగ్ లా యుద్ధ చిత్రం

ఫొటో సోర్స్, BHARAT RAKSHAK

ఫొటో క్యాప్షన్, రెజాంగ్ లా వద్ద యుద్ధ చిత్రం
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్, చైనా దళాల మధ్య గతేడాది సెప్టెంబర్ 7న వాస్తవాధీన రేఖ దగ్గరున్న రెజాంగ్ లా పాస్ సమీపంలో కాల్పులు జరిగాయని వార్తలొచ్చాయి. ఆ తరువాత విదేశీ వ్యవహారాల మంత్రుల స్థాయిలో చర్చలు జరిగి ఉద్రిక్తతలు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు.

గతంలో కూడా ఇదే రెజాంగ్ లా పాస్ దగ్గర భారత దళాలు చైనాతో భీకరంగా పోరాడాయి. ఆ రోజు వారు చూపిన సాహసం ఇండియన్ ఆర్మీ చరిత్రలో ఒక మరచిపోలేని అధ్యాయం.

1962 భారత్-చైనా యుద్ధంలో మేజర్ సైతాన్ సింగ్ నేతృత్వంలో ఇండియన్ ఆర్మీ 13 కుమావు రెజిమెంట్ తమ ఫ్రంట్‌ను కాపాడుకోడానికి తుదిశ్వాస వరకూ పోరాడింది.

మేజర్ సైతాన్ సింగ్‌కు మరణానంతరం అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర్ చక్ర ప్రకటించారు.

రేజాంగ్ లా పాస్ ఇటీవల ఘర్షణలతో మరోసారి వార్తల్లో నిలిచింది. అక్కడ 58 ఏళ్ల కిందట మేజర్ సైతాన్ సింగ్ నేతృత్వంలో జరిగిన యుద్ధాన్ని గుర్తుచేసుకోవడం, ఆ పోరాటంలో 124 మంది భారత జవాన్లు ఎలా పోరాడారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అది 1963.. చైనాతో యుద్ధం ముగిసిన మూడు నెలల తర్వాత ఒక లద్దాఖ్ గొర్రెలకాపరి చుషుల్ నుంచి రెజాంగ్ లా పాస్ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ అతడికి ధ్వంసమైన బంకర్లు, భారీగా పడివున్న ఖాళీ తూటాలు కనిపించాయి. మరింత దగ్గరగా వెళ్లి చూసిన అతడికి అక్కడంతా చెల్లాచెదురుగా పడి ఉన్న సైనికుల శవాలు కనిపించాయి.

సైనిక చరిత్ర, ఇండియన్ ఆర్మీ పరమవీర్ చక్ర విజేతల గురించి ‘ద బ్రేవ్’ అనే పుస్తకం రాసిన రచయిత రచనా బిస్త్ రావత్ ఆ భీకర యుద్ధం గురించి అందులో రాశారు.

“ఆ గొర్రెలకాపరి వెంటనే పరుగెత్తుతూ కొండ కిందికి వచ్చాడు. సమీపంలోని ఇండియన్ ఆర్మీ పోస్టు దగ్గరకు వెళ్లి తాను చూసిందంతా చెప్పాడు.

దాంతో వెంటనే భారత సైనికులు అక్కడకు వెళ్లారు. వారికి భారత జవాన్ల శరీరాలపై ఎన్నో బుల్లెట్ గాయాలు కనిపించాయి. వారిలో చాలామంది చేతుల్లో రైఫిళ్లు అలాగే ఉన్నాయి. సైన్యంలోని నర్సింగ్ అసిస్టెంట్ చేతిలో సిరంజి, బాండేజ్ కూడా ఉన్నాయి” అని రాశారు.

కొంతమంది జవాన్ల రైఫిళ్లు బుల్లెట్ దెబ్బలకు ముక్కలైనా, వాటి బట్ వారి చేతుల్లోనే ఉంది. నిజానికి అక్కడ ఏం జరిగిందంటే, ఆ యుద్ధం ముగిసిన తర్వాత భారీగా మంచు కురిసింది. దాంతో, ఆ ప్రాంతాన్ని ‘నో మాన్స్ లాండ్‌’గా ప్రకటించారు. దాంతో, అక్కడకు ఎవరూ వెళ్లలేకపోయేవారు” అని వివరించారు.

దాంతో, ఆ యుద్ధం తర్వాత 113 మంది సైనికులు ఏమయ్యారో అంతవరకు ఎవరికీ తెలియలేదు. చాలా మంది వారిని యుద్ధఖైదీలుగా చైనా సైన్యం పట్టుకుందని అనుకున్నారు. వారంతా భయంతో యుద్ధం నుంచి పారిపోయారని, పిరికిపందలని ప్రచారం జరిగింది.

ప్రాణాలతో తిరిగి వచ్చిన ఇద్దరుముగ్గురితో కూడా జనం మాట్లాడడం మానేశారు. వారి పిల్లలను స్కూళ్ల నుంచి కూడా బయటకు పంపేశారు. వారందరూ నిజానికి పిరికివారు కాదని, హీరోలని చెప్పడానికి ఒక ఎన్జీవో ఎంతో ప్రచారం చేయాల్సి వచ్చింది.

రెజాంగ్ లా వద్ద యుద్ధంలో మరణించినవారు

ఫొటో సోర్స్, Bharat Rakshak

ఫొటో క్యాప్షన్, రెజాంగ్ లా వద్ద యుద్ధంలో మరణించినవారు

వేకువన 3 గంటల నుంచి కాల్పులు

1962లో 13 కుమావు రెజిమెంటును చుషుల్ ఎయిర్‌స్ట్రిప్ రక్షణ కోసం పంపించారు. దాన్లో ఎక్కువగా హరియాణా జవాన్లే ఉన్నారు. వాళ్లు జీవితంలో అప్పటివరకూ మంచు కురవడం చూడలేదు. వారికి రెండు రోజుల నోటీసులో జమ్ముకశ్మీర్ బారాముల్లా నుంచి అక్కడికి తీసుకొచ్చారు.

వారికి ఎత్తైన ప్రాంతాల్లో, చలిలో ఉన్న అనుభవం లేదు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఉండేందుకు వారి దగ్గర తగిన దుస్తులు, బూట్లు లేవు. వేసుకోడానికి వారికి జెర్సీలు, కాటన్ ప్యాంట్లు, తేలికపాటి కోట్లు ఇచ్చారు.

మేజర్ సైతాన్ సింగ్ తన జవాన్లను కొండ ముందు వాలులో మోహరించారు. ఆరోజు 1962 నవంబర్ 18. చలి మామూలు రోజుల కంటే కాస్త ఎక్కువగానే ఉంది. రేజాంగ్ లాలో మంచు కూడా పడుతోంది.

ఆ యుద్ధం నుంచి సజీవంగా బయటపడిన ఆనరరీ కెప్టెన్ సుబేదార్ రామచంద్ర యాదవ్ ప్రస్తుతం రేవాడీలో ఉంటున్నారు. ఆయన ఆ రోజును గుర్తు చేసుకున్నారు.

“వేకువజామున మూడు గంటలకు భారీగా కాల్పులు జరిగాయి. కొండలంతా ఆ శబ్దం ప్రతిధ్వనించింది. నేను మేజర్ సైతాన్ సింగ్‌తో ‘8 ప్లటూన్ ముందు నుంచి ఫైరింగ్ వస్తోందని’ చెప్పాను. నాలుగు నిమిషాల తర్వాత 8 నుంచి 10 మంది చైనా సైనికులు మనవైపు వస్తున్నారని హరిరామ్ నుంచి మాకు ఫోన్ వచ్చింది”.

“వాళ్లు మా రేంజిలోకి రాగానే, మా జవాన్లు చాలాసేపు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నలుగురైదుగురు చైనా జవాన్లు అక్కడే చనిపోయారు. మిగతా వాళ్లు పారిపోయారు. తర్వాత నేను మళ్లీ నా లైట్ మెషిన్ తెప్పించుకున్నాను. అది వినగానే మేజర్ సాబ్ ‘మనం ఎదురుచూస్తున్న సమయం, వచ్చింది’ అన్నారు. హరిరాం ‘మీరేం కంగారు పడకండి సర్.. మా జవాన్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. మేం ముందు పట్టు సాధించాం’ అన్నారు”.

రెజాంగ్ లా యుద్ధం

ఫొటో సోర్స్, Bharat Rakshak

నలువైపుల నుంచి చైనా దాడి

7వ ప్లటూన్ జమాదార్ సూర్జారామ్ దాదాపు 400 మంది చైనా జవాన్లు తన పోస్టు వైపు వస్తున్నారని కంపెనీ కమాండర్‌కు సమాచారం అందించాడు. అప్పుడే, శిఖరం వైపు నుంచి 800 మంది చైనా జవాన్లు తమ దిశగా వస్తున్నారని 8వ ప్లటూన్ కూడా రిపోర్ట్ చేసింది.

చైనా జవాన్లు మన ఫైరింగ్ రేంజిలోకి రాగానే, వారిపై కాల్పులు ప్రారంభించాలని మేజర్ సైతాన్ సింగ్ వారిని ఆదేశించారు. సుబేదార్ రామచంద్ర యాదవ్ అప్పుడు ఏం జరిగిందో చెప్పారు.

“చైనా జవాన్లు 300 గజాల రేంజిలోకి రాగానే, మేం వారిపై ఫైర్ ఓపెన్ చేశాం. సుమారు 10 నిమిషాలు భారీగా కాల్పులు జరిపాం. మేజర్ సైతాన్ సింగ్ మాటిమాటికీ బయటికెళ్తున్నారు. మీరు అలా వెళ్లద్దు అని నేను ఆయన్ను హెచ్చరిస్తూనే ఉన్నా. ఎందుకంటే చైనా ఆర్మీ ఎప్పుడు కాలుస్తుందో ఎవరికీ తెలీదు”.

“సూరజ్‌రామ్ రేడియోలో మేం చైనా జవాన్లను తరిమికొట్టామని చెప్పాడు. మా జవాన్లు అందరూ సురక్షితంగా ఉన్నారు. వారికి చిన్న దెబ్బ కూడా తగల్లేదు. మేం ఎత్తుల్లో ఉన్నాం. చైనీయులు కింది నుంచి వస్తున్నారు. అదే మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా, చైనా మొదటి ఫిరంగి గుండు మా బంకర్ మీద పడింది. మేజర్ సైతాన్ సింగ్ వెంటనే ఫైరింగ్ ఆపమన్నాడు. తర్వాత ఆయన మోర్టార్ ప్రయోగించే జవానుకు ‘టార్గెట్ తోతా’ అని కోడ్‌వర్డ్ ఆదేశం ఇచ్చాడు. మా మోర్టార్ ఫైరింగ్‌తో చైనా సైన్యం బెదిరిపోయింది. వారి ఆ దాడి కూడా విఫలమైంది”.

సుబేదార్ రామచంద్ర యాదవ్
ఫొటో క్యాప్షన్, సుబేదార్ రామచంద్ర యాదవ్

భారత్ దగ్గర లైట్ మెషిన్ గన్, 303 రైఫిళ్లు

అన్ని దాడులూ విఫలమవడంతో చైనా సైన్యం తమ ప్లాన్ మార్చింది. ఉదయం నాలుగున్నరకు అన్ని పోస్టుల మీదా ఒకేసారి గుండ్ల వర్షం కురిపించారు. 15 నిమిషాల్లో అంతా అయిపోయింది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, భారీ విధ్వంసం కనిపించింది.

“మొదటి దాడిని వారు తిప్పికొట్టారు, కొండ కింద చైనా జవాన్ల శవాలు చెల్లాచెదురుగా పడి ఉండడం వారికి కనిపిస్తోంది. కానీ, తర్వాత చైనా సైన్యం మోర్టార్లతో దాడి ప్రారంభించినప్పుడు, అది 15 నిమిషాలపాటు ఏకధాటిగా కొనసాగి ఉంటుంది” అన్నారు రచనా బిస్త్ రావత్.

“అప్పుడు భారత జవాన్ల దగ్గర లైట్ మెషిన్ గన్స్, 303 రైఫిళ్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా సింగిల్ లోడ్, అంటే బుల్లెట్ పేల్చిన తర్వాత దాన్ని మళ్లీ లోడ్ చేయాలి. అంత చలిలో జవాన్ల వేళ్లు గడ్డకట్టినట్టు అయిపోయుంటాయి”

“15 నిమిషాల్లోపే చైనా జవాన్లు భారత బంకర్లను ధ్వంసం చేశారు. గుడారాలకు మంటలంటుకున్నాయి. జవాన్ల శరీర భాగాలు అక్కడంతా చెల్లాచెదురుగా పడున్నాయి.

కానీ, ఆ తర్వాత కూడా మేజర్ సైతాన్ సింగ్ తన జవాన్లలో ధైర్యం నూరిపోస్తూ వచ్చారు. పొగ చెదిరిన తర్వాత శిఖరం మీద వారికి ఆయుధాలు మోసుకొస్తున్న జడలబర్రెలు, గుర్రాలు కనిపించాయి.

జవాన్లకు కాసేపు అల్ఫా కంపెనీ తమను కాపాడ్డానికి వస్తోందేమో అనిపించింది. సంతోషంతో బైనాకులర్స్ అందుకున్నారు. దాన్లోంచి చూశాక, వస్తున్నవారు చైనా జవాన్లనే విషయం వారికి తెలిసింది. తర్వాత చైనా సైన్యం మూడో దాడి మొదలైంది”.

రెజాంగ్ లా

ఫొటో సోర్స్, Getty Images

సైతాన్ సింగ్ పేగులు బయటికొచ్చాయి

ఈలోపు మేజర్ సైతాన్ సింగ్ భుజానికి షెల్ తగిలింది. ఆయన బాండేజ్ కట్టుకునే తన జవాన్లను ముందుకు నడిపించాడు. శిఖరం మీద ఉన్నప్పుడు, నేరుగా ఆయన కడుపుపై కాల్పులు జరిపారు. సైతాన్ సింగ్ మీద కాల్పులు జరుపుతున్న చైనా జవాన్ మీద హర్‌ఫూల్ లైట్ మెషిన్‌ గన్‌తో ఫైరింగ్ చేశాడు.

హర్‌ఫూల్‌కు కూడా బుల్లెట్లు తగిలాయి. అతడు పడిపోతూ రామచంద్రతో “మేజర్ సాబ్‌ను శత్రువు చేతుల్లో ఓడిపోనివ్వకు” అన్నాడు. మేజర్ సైతాన్ సింగ్‌కు రక్తం తీవ్రంగా పోయింది. దాంతో ఆయన మాటిమాటికీ స్పృహతప్పిపోతున్నారు.

ఆ కష్ట సమయంలో సుబేదార్ రామచంద్ర యాదవ్ ఆయన వెంటే ఉన్నారు. ఆయన్ను సజీవంగా చూసిన కొద్ది మందిలో యాదవ్ కూడా ఒకరు. ఆ రోజును ఆయన గుర్తు చేసుకున్నారు

“మేజర్ సాబ్ నాతో ‘రామచంద్ర కడుపులో చాలా నొప్పిగా ఉంది. నా బెల్టు విప్పు’ అన్నాడు. నేను ఆయన చొక్కా పైకి తీశాను. ఆయన పేగులన్నీ బయటికొచ్చాయి. కానీ, నేను ఆయన బెల్ట్ తీయలేదు. ఎందుకంటే, అలా చేస్తే, పేగులన్నీ బయటికొస్తాయి. అక్కడ ఫైరింగ్ జరుగుతూనే ఉంది. స్పృహతప్పిన మేజర్ సైతాన్ సింగ్‌కు మళ్లీ తెలివొచ్చింది”.

“ఆయన కష్టంగా ఊపిరి తీసుకుంటూ ‘నేను చెప్పేది విను. నువ్వు బెటాలియన్‌లోకి వెళ్లిపో. కంపెనీ ఇలా పోరాడింది అని అందరికీ చెప్పు. నేను ఇక్కడే చచ్చిపోవాలనుకుంటున్నా, అన్నాడు. సరిగ్గా 8.15కు మేజర్ సాబ్ ప్రాణాలు పోయాయి” అన్నారు.

“ఆలోపు చైనా జవాన్లు మా బంకర్లలోకి చొరబడడం నేను చూశాను. మా 13 కుమావు జవాన్లు, చైనా జవాన్లతో చేతులతోనే ఘర్షణకు దిగారు. మా సహచరుడు సిగ్రాం దగ్గర బుల్లెట్లు అయిపోవడంతో చైనా జవాన్లతో పోరాడుతూ చనిపోయాడు. అతడు ఒక చైనా జవాన్‌ను కాళ్లు పట్టుకుని రాయి కేసి కొట్టి చంపాడు. తర్వాత 7 ప్లటూన్‌లో ఒక్క జవాన్ కూడా ప్రాణాలతో బతకలేదు. బందీలుగానూ చిక్కలేదు”.

సుబేదార్ రామచంద్ర యాదవ్
ఫొటో క్యాప్షన్, సుబేదార్ రామచంద్ర యాదవ్

మేజర్‌ను రాయికి ఆన్చి కూచోపెట్టారు

చుట్టూ శవాలు చెల్లాచెదురుగా పడున్నాయి. మేజర్ సైతాన్ సింగ్ గుడారం పూర్తిగా ధ్వంసమైంది. ఆయన స్నేహితుడు చిమన్ తల మొండెం నుంచి వేరయింది. మండోలాకు చెందిన మహేందర్ సింగ్ కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి.

ఈ యుద్ధంలో 13 కుమావుకు చెందిన 124 మంది జవాన్లలో 113 మంది చనిపోయారు. అయితే, అంత బీకర యుద్ధంలో మీరు ప్రాణాలతో ఎలా బయటపడగలిగారు? అని నేను యాదవ్‌ను అడిగాను.

ఆయన “నాకు సాధారణ గాయాలయ్యాయి. నేను పూర్తిగా తెలివితో ఉన్నాను. కానీ నా మనసులో మేజర్ సాబ్‌ను చైనా చేతిలో ఓడిపోనివ్వకు అని చెప్పిన హర్‌ఫూల్ మాటలే తిరుగుతున్నాయి. నేను మేజర్ సాబ్‌ను నా చేతుల్లోకి తీసుకుని ఆయనతో పాటూ ఒక గుంతలోకి దొర్లాను. తర్వాత ఆయన్ను నా వీపుమీద మోస్తూ దాదాపు 800 మీటర్లు నడిచాను. తర్వాత ఒక పెద్ద రాయి దగ్గర మేజర్ సైతాన్ సింగ్‌ను కూర్చోపెట్టాను. సరిగ్గా 8.15 గంటలకు ఆయన ప్రాణాలు వదిలారు”.

“నేను మేజర్ శవాన్ని అక్కడే వదిలేశాను. చైనా జవాన్లకు కనిపించకుండా దానిపై కొంత మంచు కప్పాను. కిందికి వెళ్లి ఎవరినైనా తీసుకొచ్చి మేజర్ సాబ్ శవాన్ని తీసుకెళ్దామని క్వార్టర్ మాస్టర్ దగ్గరకు వచ్చాను.

కానీ నేను కిందికొచ్చేసరికే అక్కడంతా మంటలు కనిపించాయి. దానిని మా వాళ్లే తగలబెట్టారు. వాటన్నిటినీ ధ్వంసం చేసి చుషుల్‌లో హెడ్ క్వార్టర్స్ కు తిరిగిరావాలని వారికి ఆదేశాలు అందాయి. అప్పుడే నాకు ఒక జీప్ వచ్చింది. దాన్లో నేను హెడ్ క్వార్టర్స్ చేరుకోగలిగాను” అని యాదవ్ చెప్పారు.

సుబేదార్ రామచంద్ర యాదవ్‌తో రేహాన్ ఫజల్
ఫొటో క్యాప్షన్, సుబేదార్ రామచంద్ర యాదవ్‌తో రేహాన్ ఫజల్

పేరుకే సైతాన్.. ఎంతో మంచివారు

మేజర్ సైతాన్ సింగ్ 1924 డిసెంబర్ 1న జోధ్‌పూర్ జిల్లా బనాసర్‌లో జన్మించారు. పేరులో సైతాన్ అని ఉన్నప్పటికీ, భారత సైన్యంలో అత్యంత నిజాయతీపరులైన అధికారుల్లో ఆయన కూడా ఒకరని చెబుతారు.

“మేజర్ సైతాన్ సింగ్ ఒక సైనిక కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి ఒక సైనికాధికారి. ఆయన చాలా హుందాగా ఉండేవారు. సాధారణంగా సైనికాధికారులు కఠినంగా ఉంటారని చెబుతారు. కానీ ఆయన అలా ఉండేవారు కాదు” అని రచనా రావత్ చెప్పారు.

సైతాన్ సింగ్ తన జవాన్లతోనే ఉండాలనుకునేవారు. ఖాళీగా ఉన్నప్పుడు వారితో కలిసి ఆలిండియా రేడియోలో వార్తలు వినేవారు. ప్రతి చోటా చైనాతో ఓడిపోయినట్లు వార్తలు వస్తుంటే, ఆయన రక్తం మరిగిపోయేది. సైనికులు కూడా ఆయనతో ‘సాహెబ్ మనకు అవకాశం వస్తే, వారిని ఎదురొడ్డి పోరాడుదాం’ అనేవారు. వారికి సైతాన్ సింగ్ చిరునవ్వే సమాధానం అయ్యేది. కానీ అది నిజం అయినప్పుడు, ఆయన నేతృత్వంలో పోరాడిన జవాన్లలో ఒక్కరు కూడా శత్రు సైన్యానికి వెన్ను చూపలేదు.

రచనా బిస్త్
ఫొటో క్యాప్షన్, రచనా బిస్త్

చివరి జవాన్, చివరి బుల్లెట్ వరకూ యుద్ధం

ఇండియన్ ఆర్మీ చరిత్రలో అతిపెద్ద యుద్ధాల్లో రెజాంగ్ లా పోరాటం ఒకటిగా చెబుతారు. ఇక్కడ ఒక ప్రాంతాన్ని కాపాడుతున్నవారిలో దాదాపు అందరూ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు.

“రెజాంగ్ లా యుద్ధం అంత భీకరంగా జరగడానికి కారణం, తుదిశ్వాస వరకూ పోరాడాలని తమకు వచ్చిన ఆదేశాలను 13 కుమావు జవాన్లు తు.చ. తప్పకుండా పాటించడమే.

‘మీలో చివరి జవాన్, చివరి బుల్లెట్ ఉన్నంత వరకూ యుద్ధం చేస్తూనే ఉండండి’ అన్న బ్రిగేడియర్ టీఎన్ రైనా(తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యారు) లిఖితపూర్వక ఆదేశాలను వారు అక్షరాలా పాటించారు” అంటారు రచనా బిస్త్.

“అక్కడ 124 మంది జవాన్లే ఉన్నారు. సుమారు వెయ్యి మంది చైనా సైనికులు వారిపై దాడి చేశారు. 114 మంది జవాన్లు యుద్ధరంగంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు బందీలు అయ్యారు. వారిలో ఒకరు బందీగానే చనిపోయాడు. నేను దీనిపై పరిశోధన చేస్తున్నప్పడు, ఆ యుద్ధంలో చనిపోయిన 13 కుమావు సైనికుల పేర్లు అడిగాను. వారి పేర్లతో నా లాప్‌టాప్‌లో మూడు పేజీలు నిండిపోయాయి. ఆ యుద్ధంలో అంతమంది తమ ప్రాణాలు అర్పించారని తెలిసి నా కళ్లు చెమర్చాయి. ఆ యుద్ధం ఉదయం 3.30కి మొదలై రాత్రి 8.15కి ముగిసింది. కానీ అసలు యుద్ధమంతా ఆఖరి గంటలోనే జరిగింది” అని చెప్పారు.

మేజర్ సైతాన్ సింగ్‌కు పరమవీర్ చక్ర ప్రకటించారు

ఫొటో సోర్స్, GALLANTRYAWARDS.GOV.IN

ఫొటో క్యాప్షన్, మేజర్ సైతాన్ సింగ్‌కు పరమవీర్ చక్ర ప్రకటించారు

మేజర్ సైతాన్ సింగ్‌కు పరమవీర్ చక్ర

రెజాంగ్ లాలో పోరాడిన ప్రతి జవాన్ హీరోగా నిలిచాడు. తిరుగులేని సాహసం చూపిన మేజర్ సైతాన్ సింగ్‌కు మరణానంతరం పరమవీర్ చక్ర పురస్కారం ప్రకటించారు.

ఆ సైనికులే లేకుంటే లేహ్, కార్గిల్, జమ్ము-కశ్మీర్ అన్నీ ప్రమాదంలో పడుండేవి. చైనా సైన్యాన్ని అడ్డుకుంది వారే. తమకు భారీ నష్టం జరగడంతో చైనా స్వయంగా యుద్ధ విరమణ చేసింది. మనం యుద్ధ విరమణ చేయించలేదు అంటారు సుబేదార్ రామచంద్ర యాదవ్

“నేను మీకొకటి చెప్పాలి. యుద్ధానికి నాలుగు రోజుల ముందు మాకు ‘మీరు వెనక్కు వచ్చేయండి’ అని ఒక సందేశం వచ్చింది. మేజర్ సైతాన్ సింగ్ ‘నా జవాన్లతో మాట్లాడిన తర్వాతే నేను అలా చేయగలను’ అన్నాడు. ఆయన నా అభిప్రాయం అఢిగాడు. నేను ‘సాబ్ జవాన్లు ప్రాణం పోయినా, ఈ పోస్ట్ వదిలి వెళ్లరు’ అన్నాను. తర్వాత మేజర్ సాబ్ ప్రతి ప్లటూన్ దగ్గరకు వెళ్లారు. ఆయనతో అందరూ, ‘మేం చావనైనా చస్తాం.. కానీ, శత్రువును ఇక్కడే చంపుతాం, ఎక్కడికీ వెళ్లం’ అని చెప్పార”ని ఆయన వివరించారు.

“మూడు ప్లటూన్లు అలా చెప్పిన తర్వాత మేజర్ సైతాన్ సింగ్ ‘నా ఉద్దేశం కూడా అదే’ అన్నారు. ‘కంపెనీ ఈ ప్రాంతం నుంచి వెనకడుగు వేయదు’ అని ఆయన బ్రిగేడియర్ టీఎన్ రైనాకు సందేశం పంపించారు”.

రెజాంగ్ లా యుద్ధ మృతుల స్మారకం

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, రెజాంగ్ లా యుద్ధ మృతుల స్మారకం

యుద్ధం ముగిసిన మూడు నెలల తర్వాత మేజర్ సైతాన్ సింగ్ మృతదేహానికి జోధ్‌పూర్‌లో సైనిక లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి.

రెజాంగ్ లాలో బెటాలియన్ హెడ్ క్వార్టర్ ఎదురుగా మిగతా సైనికులకు సామూహిక దహన సంస్కారాలు నిర్వహించారు. వారి స్మారకం ఇప్పటికీ అక్కడ ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)