రైళ్లు మొదలయ్యాయి.. ప్రయాణ సమయంలో పాటించాల్సిన నిబంధనలేమిటి?

వీడియో క్యాప్షన్, రైళ్లు మొదలయ్యాయి.. ప్రయాణ సమయంలో పాటించాల్సిన నిబంధనలేమిటి?

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో జూన్ 1 నుంచి కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ప్రత్యేక రైళ్ల సేవలు ప్రారంభమయ్యాయి. వలస కూలీల కోసం మే 12 నుంచి రైల్వే శాఖ 30 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడిపిస్తోంది. వాటికి అదనంగా ఈ 200 రైళ్లు పరుగులు తీస్తున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీతో పాటు, నాన్ ఏసీ కోచ్‌లు కూడా ఉంటాయి. జనరల్ బోగీల్లోనూ కూర్చుని ప్రయాణించవచ్చు. కానీ ఇందుకు కూడా ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి.

ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల తొలిచార్ట్‌ను నాలుగు గంటల ముందే సిద్ధం చేస్తారు. రెండో చార్ట్ ను రెండు గంటల ముందు సిద్ధం చేస్తారు.

రైలు ప్రయాణికులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రయాణ సమయంలో పాటించాల్సిన నిబంధనలేమిటి?

ప్రయాణికులు ప్రత్యేక రైలు మొదలయ్యే సమయానికి క‌నీసం 90 నిమిషాల ముందే రైల్వే స్టేష‌న్‌కు చేరుకోవాలి.

టికెట్ బుక్ చేసుకున్న వారు తప్ప... మరెవరూ ప్రయాణించడానికి వీల్లేకుండా తనిఖీ కేంద్రాలు ఏర్పాలు చేసింది. కన్ఫం అయిన టికెట్ చూపించిన తర్వాతే స్టేషన్ లో ప్రవేశానికి అనుమతిస్తారు.

ప్రయాణికులకు అనువుగా ఉండేందుకు లోపలకు వచ్చే మార్గాన్ని, బయటకు వెళ్లే మార్గాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు.

రైల్వే స్టేషన్‌లో భౌతిక దూరం పాటించేలా, ఫ్లాట్ ఫాం మీద సంచరించేందుకు, వెళ్లాల్సిన మార్గాలను తేలిగ్గా తెలుసుకునేలా ప్రత్యేకంగా గుర్తులు ఏర్పాటు చేశారు.

ప్రయాణికులు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. కరోనా వైరస్ లక్షణాలు లేవని తేలితేనే... ప్రయాణానికి అనుమతిస్తారు.

స్క్రీనింగ్‌లో క‌రోనావైర‌స్ లక్షణాలు కనిపిస్తే, ప్రయాణానికి అనుమతించరు. వారి టికెట్ రద్దు చేస్తారు. డబ్బులు రిఫండ్ ఇస్తారు.

బీపీ, షుగ‌ర్‌, గుండె జ‌బ్బులు, క్యాన్సర్, రోగ నిరోధ‌క శ‌క్తి సమస్యలున్నవారు, గ‌ర్భిణులు, ప‌దేళ్ల కంటే త‌క్కువ వ‌య‌సుండే పిల్లలు, 65ఏళ్లకు పైబడ్డ వారు, తప్పనిసరి అయితేనే ప్రయాణానికి రావాలి.

స్టేష‌న్‌లోకి వ‌చ్చేట‌ప్పుడు, బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులంతా స్టేషన్‌లోకి వచ్చినప్పటి నుంచి జర్నీ పూర్తయ్యేవరకూ ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

రైలు ప్రయాణికులు

ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్లు తనిఖీ చేసే సిబ్బందితో పాటు, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ఏదైనా అవసరమైనప్పుడు వారిని సంప్రదించాలి.

మ‌రుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్ స‌హా ప్రయాణికులు ఉప‌యోగించే అన్ని ప్రాంతాల‌నూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారు. ప్రయాణికులు కూడా సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజ్ నిబంధనలు పాటించడంతో పాటు, రైల్వే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలని రైల్వే శాఖ కోరింది.

ప్రయాణంలో ఎలాంటి దుప్పట్లు ఇవ్వరు. వీటిని ఎవరికి వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది.

రైల్వే స్టేషన్లలో కేట‌రింగ్‌, ఆహార విక్రయ కేంద్రాలు తెరిచే ఉంటాయి. ఫుడ్‌ప్లాజాల్లో ఆహారాన్ని పార్సిల్ తీసుకెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రయాణికులు ఎవరి భోజనం వాళ్లే తెచ్చుకుంటే మంచిదని రైల్వే శాఖ సూచిస్తోంది.

లాక్‌డౌన్ వల్ల తక్కువ మంది రైల్వే కూలీలు ఉంటారని, అందుకే సులభ ప్రయాణం కోసం సాధ్యమైనంత తక్కువ లగేజీని వెంట తెచ్చుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గమ్య స్థానాలను చేరుకునే ప్రయాణికులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సూచించిన ఆరోగ్య నియమాలు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)