సూపర్ సైక్లోన్ ఆంఫన్: క‌రోనావైర‌స్‌కు తుపాను కూడా తోడైతే సామాజిక దూరం పాటించ‌డం ఎలా?

    • రచయిత, న‌వీన్ సింగ్ ఖ‌డ్కా
    • హోదా, ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌హారాల ప్ర‌తినిధి, బీబీసీ వ‌ర‌ల్డ్ స‌ర్వీస్‌

ప్ర‌పంచ వ్యాప్తంగా వాతావ‌ర‌ణం ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో నిరాశ్ర‌యులైన‌వారు.. కోవిడ్‌-19 సామాజిక దూరం నిబంధ‌న‌లు పాటించలేక‌పోతున్నార‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ రెడ్ క్రాస్ (ఐఎఫ్ఆర్‌సీ), ఇత‌ర మాన‌వ‌తావాద‌ సంస్థ‌లు చెబుతున్నాయి.

నిరాశ్ర‌యులైన‌వారు తాత్కాలిక శిబిరాల్లో ఉన్న‌ప్పుడు సామాజిక దూరం పాటించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని తూర్పు ఆఫ్రికాలోని ఐఎఫ్ఆర్‌సీ అత్య‌వ‌స‌ర చ‌ర్య‌ల కో-ఆర్డినేట‌ర్ మార్ష‌ల్ మ‌కావుర్.. బీబీసీతో చెప్పారు.

"ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కోవిడ్‌-19 ప్రోటోకాల్స్‌, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌జ‌లు అనుస‌రించ‌లేక‌పోతున్నారు."

ఇలా ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ప్ర‌జ‌ల‌తో బీబీసీ మాట్లాడింది.

భార‌త్‌

ఒడిశా తీరంలో 38ఏళ్ల రైతు సుబ్ర‌‌త్ కుమార్ ప‌ధిహ‌రి.. చాలా ఆందోళ‌న ప‌డుతున్నారు.

ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరాల‌ను బుధ‌వారం తాక‌బోతున్న ఆంఫ‌న్‌ తుఫాను చాలా తీవ్ర‌మైన తుపానుగా మారే ముప్పుంద‌ని అధికారులు హెచ్చిస్తున్నారు.

సుబ్ర‌త్ గ్రామం తీరానికి కేవ‌లం 40 కి.మీ. దూరంలో ఉంది. ప్ర‌స్తుతం భార్య‌, ముగ్గురు కుమార్తెలు, త‌ల్లితో క‌లిసి ఉంటున్న ఇల్లును గ‌త ఏడాది ఫొనీ తుపాను ధ్వంసం చేసింది. ప్ర‌స్తుతం ఈ ఇల్లుకు ఆంఫ‌న్‌ను త‌ట్టుకొనే శ‌క్తిలేద‌ని సుబ్ర‌త్ ఆందోళ‌న చెందుతున్నారు.

ఒక‌వేళ ఇల్లుకు త‌ట్టుకొనే శ‌క్తి ఉన్నా.. ప్ర‌జ‌లంద‌రూ ఈ ప్రాంతాన్ని త‌ప్ప‌కుండా వ‌దిలిపెట్టి పోవాల‌ని అధికారులు జారీ చేస్తున్న హెచ్చ‌రిక‌లు ఆయ‌న్ను మ‌రింత క‌ల‌వ‌ర పెడుతున్నాయి.

ఎందుకంటే అది మ‌రింత ముప్ప‌ని ఆయ‌న భ‌య‌ప‌డుతున్నారు.

"మ‌మ్మ‌ల్ని ద‌గ్గ‌ర్లోని స్కూళ్ల‌కు త‌ర‌లిస్తారేమోన‌ని భ‌య‌మేస్తోంది. ఆ స్కూళ్ల‌ను ఇప్ప‌టికే కోవిడ్‌-19 క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు".

"మా ఊరిలో ఆశ్ర‌య‌మిచ్చే కేంద్రాలు ఎక్కువ లేవు. అంటే మేం ఇత‌రుల‌తో క‌లిసి అక్క‌డ ఉండాలి. వారికేమైనా క‌రోనావైర‌స్ సోకివుంటే.. అది మ‌రింత ప్ర‌మాద‌క‌రం".

"కోవిడ్‌-19 కేసుల‌తో ప‌శ్చిమ బెంగాల్ స‌త‌మ‌తం అవుతోంది. తుపాన్ స‌న్న‌ద్ధ‌త చ‌ర్య‌ల‌ను అది మ‌రింత క‌ల‌వ‌ర పెడుతోంది"అని ఆసియాలోని ఆక్స్‌ఫామ్‌ ఫుండ్ అండ్ క్లైమేట్ పాల‌సీ విభాగానికి నేతృత్వం వ‌హిస్తున్న సిద్ధార్థ్ శ్రీనివాస వ్యాఖ్యానించారు.

"గ‌తంలో భార‌త్‌లోని చాలా దేశాలు ఇలాంటి స‌మ‌యంలో స్కూళ్లు, ఇత‌ర ప్ర‌భుత్వ భ‌వ‌నాల్లో ప్ర‌జ‌ల‌కు ఆశ్ర‌యం క‌ల్పించాయి. అయితే క‌రోనావైర‌స్ వ్యాపిస్తున్న స‌మ‌యంలో ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రం"

ఉగాండా

ఇటీవ‌ల వ‌ర‌ద‌ల‌కు తీవ్రంగా ప్ర‌భావిత‌మైన ఉగాండాలోని క‌సెసె జిల్లాలో వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు.

23ఏళ్ల‌ జోసెలిన్ కెబుఘో ఆరు నెల‌ల గ‌ర్భిణి. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఆమె ఇంటికి ద‌గ్గ‌ర్లోని స్కూల్‌లో ఆశ్ర‌యం పొందుతున్నారు.

శిబిరంలో ఆమెతోపాటు 200 మంది క‌లిసి ఉంటున్నారు. మ‌రోవైపు గ‌ర్భిణుల‌కు కోవిడ్‌-19తో ముప్పు మ‌రింత ఎక్కువ‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ స్థాయి ఆరోగ్య సంస్థ‌లు చెబుతున్నాయి.

"ఇప్పుడు మా ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది" అని ఆమె వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆమె కుటుంబం మ‌రో మూడు కుటుంబాల‌తో క‌లిసి ఓ త‌ర‌గ‌తి గ‌దిలో ఉంటోంది.

"ఇక్క‌డ చోటు చాలా త‌క్కువ‌గా ఉండ‌టంతో ఇత‌రుల నుంచి సామాజిక దూరం పాటించ‌డం కుద‌ర‌డంలేదు".

"నాకు క‌రోనావైర‌స్ సోకుతుందేమోన‌ని భ‌య‌మేస్తోంది. నా పిల్ల‌లు, నా క‌డుపులోని బిడ్డ‌ను త‌ల‌చుకుంటే చాలా భ‌యంగా ఉంది" అని ఆమె బీబీసీతో చెప్పారు.

మే 7 అర్ధ‌రాత్రి, త‌న‌ గ్రామంలో వ‌ర‌ద‌ల విధ్వంసం మొద‌లైన‌ప్పుడు.. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి జోస్‌లైన్ తమ ఇంట్లో నిద్ర‌పోతున్నారు.

"అక్క‌డి నుంచి త్వ‌ర‌గా వెళ్లిపోవాల‌ని మా పొరుగింటివారు గ‌ట్టిగా అరిచారు. మా గ్రామం మొత్తాన్నీ భారీ వ‌ర‌ద ముంచెత్తింది".

"నా ఇద్ద‌రు పిల్ల‌ల్ని తీసుకొని వెంట‌నే ప‌రిగెత్తాను. ఇంకేమీ తీసుకోవ‌డానికి నాకు స‌మ‌యం కూడా దొర‌క‌లేదు".

క‌డుపులోని త‌న బిడ్డ కోసం ఆమె కొన్ని బట్ట‌ల‌ను కొన్నారు. "ఆ బ‌ట్టల‌ను కూడా కాపాడుకోలేక‌పోయాను. అవి వ‌ర‌ద‌ల్లో కొట్టు‌కుపోయాయి".

"ఉన్న‌దంతా ఆ వ‌ర‌ద‌ల్లో పోగొట్టుకున్నాం".

ఆమె భ‌ర్త వేరే జిల్లాలో ప‌నిచేస్తున్నారు. క‌రోనావైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డంతో ఆయ‌న అక్క‌డే ఉండిపోవాల్సి వ‌చ్చింది.

"నాకు ఎక్క‌డికి వెళ్లాలో తెలియ‌డం లేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియ‌ట్లేదు".

తూర్పు ఆఫ్రికాలోని స్కూళ్లు, చ‌ర్చిల్లో వేల మంది ఆశ్ర‌యం పొందుతున్న‌ట్లు రెడ్ క్రాస్ సిబ్బంది తెలిపారు. వీరికి స‌రిప‌డా నీరు, స‌బ్బులు అందుబాటులో లేవ‌‌ని వివ‌రించారు.

ప‌దికి పైగా దేశాల్లో తీవ్ర‌మైన వ‌ర‌ద‌ల వ‌ల్ల వంద‌ల మంది మ‌ర‌ణించారు. లక్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు.

ఆఫ్రికాలో 82,000కుపైగా క‌రోనా కేసులతోపాటు 2,700 మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు జాన్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ స‌మాచారం చెబుతోంది.

తూర్పు ఆఫ్రికాలో వ‌ర‌ద‌ల‌కు తీవ్రంగా ప్ర‌భావిత‌మైన దేశాల్లో సోమాలియా కూడా ఒక‌టి. ఇక్క‌డ వ‌ర‌ద‌ల‌కు 55 మంది మ‌ర‌ణించారు. త‌ర్వాత కెన్యాలో 50 మంది, టాంజానియాలో 21 మంది మ‌ర‌ణించారు.

ప‌సిఫిక్ దీవులు

నెల రోజుల క్రితం ప‌సిఫిక్ దీవుల‌పై హరాల్డ్ తుపాను విరుచుకుప‌డింది.

శిబిరాల్లో త‌ల‌దాచుకొనేందుకు ప్ర‌జ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించేందుకు కొన్ని ప‌సిఫిక్ దేశాలు క‌రోనావైర‌స్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించాయి.

స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు క‌రోనావైర‌స్ ఆటంకం క‌లిగిస్తుండ‌టంతో ‌కొంత మంది ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ తాత్కాలిక శిబిరాల్లోనే ఉంటున్నారు.

తీవ్రంగా ప్ర‌భావిత‌మైన‌ వ‌న‌వాతులో అత్య‌యిక స్థితి ప్ర‌క‌టించారు. ఇక్క‌డ 92,000 మంది ప్ర‌భావిత‌మైన‌ట్లు యూనిసెఫ్ తెలిపింది.

ఫిజిలో ప‌ది స‌హాయ‌క కేంద్రాలు కొన‌సాగుతున్నాయి. ఇక్క‌డ పున‌రావాసం చాలా నెమ్మ‌దిగా సాగుతోంది. ధ్వంస‌మైన ఇళ్ల‌కు ఇప్ప‌టికీ మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించ‌లేదు.

"నీటి స‌ర‌ఫ‌రా స‌దుపాయాల‌ను తుపాన్ దెబ్బ‌ తీసింది. దీంతో ఇక్క‌డ మంచినీటి స‌ర‌ఫ‌రా పెద్ద స‌వాల్‌గా మారింది"అని ఫిజిలోని సోష‌ల్ స‌ర్వీసెస్ కౌన్సిల్ డైరెక్ట‌ర్ వాణి కాటాన‌సిగ వివ‌రించారు.

కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లయ్యేలా చూస్తూ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని మాన‌వ‌తా సంస్థ‌లు చెబుతున్నాయి.

ప‌శ్చిమ ఉగాండాలో నిరాశ్ర‌యులైన‌వారికి అత్య‌వ‌స‌ర స‌ర‌కుల జాబితాలో పెట్టి మంచి నీరు, స‌బ్బును ఇస్తున్న‌ట్లు రెడ్ క్రాస్ స‌హాయ‌క సిబ్బంది ఇరీన్ న‌క‌సిట్స్ తెలిపారు.

"ఇది స‌వాల్‌తో కూడుకున్న ప‌ని అయిన‌ప్ప‌టికీ.. అంద‌రూ క‌రోనావైర‌స్ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించేలా చూస్తున్నాం"అని ఐఎఫ్ఆర్‌సీకి చెందిన మార్ష‌ల్ ముకువేర్ వివ‌రించారు.

"ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రా చేసే మంచి నీరు, ఇత‌ర ప‌దార్థాల‌పై స్ప‌ష్టంగా క‌న‌ప‌డేలా సందేశాలు రాస్తున్నాం. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ వారు చేయ‌గ‌లిగినంత వ‌ర‌కు చేసేందుకు ఇలాంటి చ‌ర్య‌లు తోడ్ప‌డతాయి".

"ఇది మునుపెన్న‌డూ చూడ‌ని ప‌రిస్థితి"అని ఆసియా ఆక్స్‌ఫామ్‌లోని ఫుడ్ అండ్ క్లైమేట్ పాల‌సీ లీడ్ సిద్ధార్థ్ శ్రీనివాస్ అన్నారు. "క‌రోనావైర‌స్ లాంటి మ‌హమ్మారిని, విప‌రీత వాతావ‌ర‌ణాన్ని ఎలా ఎదుర్కోవాల‌నే అంశంపై ఇప్పుడే చ‌ర్చ మొద‌లైంది".

"లోతుగా స‌మాలోచ‌న‌లు చేప‌ట్టిన త‌ర్వాతే ఈ విష‌యంలో ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌లు మొదలుపెట్టాలి".

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)