ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా చేతిలో ‘కీలు బొమ్మ’.. తీరు మార్చుకోకుంటే నిధులు పూర్తిగా ఆపేస్తాం’: డోనల్డ్ ట్రంప్

ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా చేతిలో కీలు బొమ్మగా మారిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపించారు.

లక్షలాది మంది ప్రాణాలు తీసిన కోవిడ్-19ని వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ నియంత్రించలేకపోయిందని అమెరికా వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోపే ట్రంప్ ఈ ఆరోపణ చేశారు.

ప్రపంచానికి కావల్సిన సమాచారాన్ని రాబట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా ఆరోగ్య కార్యదర్శి అలెక్స్ అజర్ సోమవారం ఐక్య రాజ్య సమితి ప్రపంచ హెల్త్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ అన్నారు.

ఈ వైరస్ నియంత్రణ నిర్వహణ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహరించిన తీరుని ఒక స్వతంత్ర సంస్థ పరిశీలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెయేసుస్ అంగీకరించారు.

ఈ పరిస్థితి నుంచి నేర్చుకోవల్సిన పాఠాలు, మరేమైనా సలహాలు ఇవ్వడానికి చేసే పరిశీలన ఎంత త్వరగా అవకాశం వస్తే అంత తొందరగా చేస్తామని చెప్పారు.

వైరస్ వ్యాప్తి గురించి చైనా-అమెరికా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పని తీరుని అంచనా వేసేందుకు 194 సభ్య దేశాల రెండు రోజుల వార్షిక సమావేశం సోమవారం ప్రారంభం అయింది.

ఈ సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మరోమారు పోటీ చేయనున్న ట్రంప్ వైరస్ అరికట్టే విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు

చైనా ఈ వైరస్ గురించి పూర్తి సమాచారాన్ని ప్రపంచానికి ఇవ్వలేదని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాని ఈ పరిస్థితికి బాధ్యులని చేయకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకి మద్దతుగా.. చైనా చేతిలో కీలు బొమ్మగా వ్యవహరిస్తోందని సోమవారం జరిగిన సమావేశంలో అంటూ, "ఈ రోజు నేనేమి వ్యాఖ్యానించదల్చుకోలేదు” అని అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన ఆరోగ్య సలహాలు ఇవ్వలేదని ఆరోపించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహరించిన తీరుపై అమెరికాకి ఉన్న అభ్యంతరాలను తెలియచేస్తూ ఆయన ఒక లేఖని టెడ్రోస్‌కి పంపించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవడానికి ఆ లేఖలో 30 రోజుల గడువుని ఇస్తూ, లేని పక్షంలో ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసిన నిధుల సరఫరాని పూర్తిగా ఆపేస్తామని హెచ్చరించింది.

విపత్తుపై సమాచారం ఇచ్చే విషయంలో తమ దేశం నిజాయితీగా వ్యవహరించిందంటూ తమ చర్యలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సమర్ధించుకున్నారు. ఈ విషయంలో ఎటువంటి పరిశోధన అయినా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే జరగాలని అన్నారు.

ప్రపంచ దేశాలకి సహాయార్ధం చైనా రెండు సంవత్సరాల వ్యవధిలో 2 బిలియన్ డాలర్లు (దాదాపు 13000 కోట్ల రూపాయిలు) ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. వ్యాక్సిన్ తయారైన పక్షంలో దానిని కూడా ప్రపంచ దేశాలకి అందిస్తుందని చెప్పారు.

ఇది కేవలం విషయాన్ని పక్క దారి పట్టించడమేనని వైట్ హౌస్ జాతీయ భద్రతా కౌన్సిల్ ప్రతినిధి జాన్ ఉల్యోట్ అన్నారు.

చైనా ఈ విపత్తుకి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

దేశాలన్నీ వైరస్‌కి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ అభిప్రాయపడ్డారు.

ఇలాంటి కొత్త రకమైన వైరస్ ఎప్పుడైనా రావచ్చని దానిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు సంసిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా 45 లక్షల మంది ప్రజలు వైరస్ బారిన పడగా, ఇప్పటికే 3 లక్షల మంది మరణించారు.

డబ్ల్యుహెచ్ఓకు తనిఖీ అధికారం ఉండాలన్న దేశాలు

తులిప్ మజుందార్ , బీబీసీ హెల్త్ ప్రతినిధి

ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థకి తమ మద్దతు ప్రకటించిన మూడు నిమిషాల వ్యవధిలోనే ఆ సంస్థపై అమెరికా తమ విమర్శన బాణాలు విసరడం మొదలు పెట్టింది.

అమెరికా చైనా పేరుని ప్రత్యేకంగా తీసుకోనప్పటికీ , ఒక సభ్య దేశం ఈ వైరస్ విషయం దాచి పెట్టిందని అంటూ తీవ్రంగా విరుచుకు పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇందుకు బాధ్యత వహించాలని కోరింది.

దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకి.. ముఖ్యంగా దేశాలని తనిఖీ చేసే అధికారాలు ఇవ్వాలని అభిప్రాయ పడ్డాయి. ఎక్కడైనా వైరస్ తలెత్తినప్పుడు సంస్థ ఉద్యోగులు ఆ దేశాలకి వెళ్లి స్వతంత్రంగా తనిఖీ చేసే అధికారం ఉండాలని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన అభిప్రాయాలని చైనా పరిశీలిస్తుందని, అయితే ఈ మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యపడుతుందని చైనా స్పష్టం చేసింది. అది కొన్ని నెలలైనా పట్టవచ్చు. లేదా సంవత్సరాలైనా కావచ్చు.

అసెంబ్లీలో ఏమి చర్చించారు?

ఈ విపత్తుని ఎదుర్కొన్న తీరు, దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల గురించి విచారణ జరగాలని బ్రిటన్, యూరోపియన్ యూనియన్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా పట్టుబడుతున్నాయి.

భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులని ఎదుర్కోవాలంటే ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందింది? దీని వెనక ఉన్న కారణాల పై సమగ్రమైన అవగాహన అవసరమని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి వర్జిని హెన్రిక్సన్ అన్నారు. అయితే, ఇది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే సమయం కాదని అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ పని తీరుని పరిశీలించేందుకు గాను అవసరమైన డ్రాఫ్ట్ తీర్మానాన్ని మంగళవారం సభలో ప్రవేశపెడతారు. ఇది ఆమోదం పొందడానికి సభలోమూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.

గత నెలలో ప్రచురించిన ఒక యూరోపియన్ నివేదిక ఈ వైరస్ పట్ల తప్పుడు సమాచారం విడుదల చేయడానికి చైనా కారణం అని పేర్కొంది.

చైనా, కొంత వరకు రష్యా కూడా తప్పుడు సమాచారాన్ని ప్రపంచానికి ఇవ్వడంలో కుట్ర పూరితంగా పని చేశారని ఆరోపించింది.

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు తైవాన్ కి పరిశీలనా సభ్య స్థాయి ఇచ్చే విషయాన్ని చర్చించడాన్ని సభ్య దేశాలు వాయిదా వేసాయి.

తైవాన్ చైనా భూభాగం అని పేర్కొంటూ 2016 నుంచి తైవాన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడాన్ని చైనా నిషేధించింది.

అయితే తైవాన్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలనే డిమాండ్‌కి జపాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ తమ మద్దతు తెలిపాయి.

తైవాన్‌ని సమావేశాలకు హాజరు కాకుండా చూడటం వలన ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వసనీయత మరింత దెబ్బ తింటుందని అమెరికా రాష్ట్ర కార్యదర్శి మైక్ పాంపేయో అన్నారు.

చైనాపై విమర్శలు ఏమిటి?

కరోనావైరస్ గత సంవత్సరం ఆఖరులో చైనాలో ఒక జంతు మార్కెట్ నుంచి పుట్టిందని వార్తలు వచ్చాయి.

కానీ, ఇది చైనాలో గబ్బిలాల్లో కరోనావైరస్‌పై పరిశోధన జరుపుతున్న ఒక పరిశోధన ల్యాబ్‌లో పుట్టిందని అమెరికాలో కొంత మంది రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణని చైనా ఖండించింది.

ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మైక్ పాంపేయో అది చైనా లో పుట్టిందని తెలుసునని, అయితే ఎక్కడ ఎలా పుట్టిందనేది తెలియదని అన్నారు.

వైరస్ జెనొటిక్ మూలం కనిపెట్టి అది మానవులకి ఎలా వ్యాప్తి చెందిందనేది కనిపెట్టాలని సమావేశం ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ తీర్మానంలో పేర్కొన్నారు.

ఈ అంశంపై విచారణ జరపాలనే డిమాండ్లు రాజకీయ ఉద్దేశ్యాలతో చేస్తున్నవని ఒక చైనీస్ రాయబారి బీబీసీతో అన్నారు. ఇలాంటి డిమాండ్లతో వనరుల దుర్వినియోగం జరిగి అసలు సమస్యని తప్పు దారి పడుతుందని అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)