కరోనావైరస్ పుట్టింది ప్రయోగశాలలోనేనా? అమెరికా 'ల్యాబ్‌ థియరీ'కి చైనా ప్రభుత్వ మీడియా సమాధానం ఏంటి?

కరోనావైరస్‌ చైనాలోని వూహాన్‌ నగరంలోని ప్రయోగశాలలోనే పుట్టిందనడానికి తమవద్ద 'తగినన్ని' ఆధారాలున్నాయన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపేయో వాదనపై చైనా ప్రభుత్వ మీడియా మండిపడింది. ఆయన అబద్ధాలాడుతున్నారని విమర్శించింది.

అయితే తన వాదనకు ఆధారాలు చూపకుండానే అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపేయో ఆదివారంనాడు ఈ ఆరోపణలు చేశారు. పాంపేయో దిగజారి మాట్లాడుతున్నారని చైనాపత్రిక ''గ్లోబల్‌ టైమ్స్‌'' తన సంపాదకీయంలో విమర్శలు చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా అమెరికా చేస్తున్న వాదనలు కేవలం ఊహాగానాలేనని, వాటికి ఆధారాలేమీలేవని ఇప్పటికే ప్రకటించింది.

చైనా మీడియా ఏం చెప్పింది?

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చైనా అధికార మీడియా సంపాదకీయాలు రాస్తోంది. అయితే పాంపేయో కామెంట్లపై ప్రభుత్వం తరఫున అధికారికంగా ఎవరూ ఇంత వరకు ప్రకటన చేయలేదు.

''వక్రీకరించిన నిజాలతో, పనిమాలిన సిద్ధాంతాలను ప్రకటిస్తున్నా''రంటూ సోమవారంనాడు మైక్‌ పాంపేయోపై విరుచుకుపడింది గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక. మంగళవారం కూడా అదే దూకుడును కొనసాగించింది.

''తన అబద్ధపు సిద్దాంతాలతో ఒక్కదెబ్బతో రెండు పిట్టలను కొట్టడానికి పాంపేయో ప్రయత్నిస్తున్నారు'' అని పత్రిక విమర్శించింది.

''మొదటిది వచ్చే నవంబర్‌ ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించడం, రెండోది తనకు అస్సలు గిట్టని సోషలిస్టు సిద్ధాంతాలను, చైనా ఎదుగుదలను ద్వేషించడం'' అని రాసుకొచ్చింది గ్లోబల్‌ టైమ్స్‌.

అయితే ప్రభుత్వం కరోనాపై స్పందించడంలో మొదట్లో కొంత ఇబ్బందిపడ్డా, మొత్తంగా కరోనాపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును చూస్తే, లోపాలు లెక్కలోకి తీసుకోదగినవి కాదని తన ఎడిటోరియల్‌లో రాసింది గ్లోబల్‌ టైమ్స్ పత్రిక‌. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే...కరోనావైరస్‌ మొదట మనుషులను కాంటాక్ట్ అయ్యింది వూహాన్‌ కన్నా ఇతర ప్రదేశాలలోనే ఎక్కువని ఆ పత్రిక రాసింది.

అమెరికా విదేశాంగ మంత్రిని టార్గెట్‌ చేసుకున్నది చైనాలోని ఒక్క గ్లోబల్‌టైమ్స్ ఒక్కటే కాదు. ఆధారాలు బయటటపెట్టడానికి పాంపేయో దగ్గర ఏమీ లేదని పీపుల్స్‌డైలీ రాయగా, అమెరికా నేతలు కుట్రలు చేస్తున్నారని సీసీటీవీ ఛానల్ తన సైట్‌లో ఒక వార్తను ప్రచురించింది.

మైక్‌ పాంపేయో ఏం చెప్పారు?

ఆదివారంనాడు ఏబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు పాంపేయో. కరోనావైరస్‌ చైనాలోని వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ డిపార్ట్‌మెంట్‌లోనే పుట్టిందనడానికి తమ వద్ద సరిపడినన్ని ఆధారాలున్నాయని పాంపేయో అన్నారు. ''మీరొక్క విషయం గుర్తు పెట్టుకొండి. వైరస్‌లను ప్రపంచం మీదికి వదిలిన చరిత్ర చైనాకుంది. ఆ దేశంలో నాణ్యతలేని ప్రయోగశాలలున్నాయి'' అన్నారు పాంపేయో.

గతంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ)కి డైరక్టర్‌గా పని చేసిన పాంపేయో...ఈ వైరస్‌ను మనుషులు సృష్టించారా లేక జన్యుపరంగా మార్పులు చెందిందా అన్నది మాత్రం తాను చెప్పలేనన్నారు.

గబ్బిలాలలో కరోనావైరస్‌పై పరిశోధనలకు వూహన్‌ లేబరేటరీ సుప్రసిద్ధం. అయితే అందులో పనిచేసే ఒక పరిశోధకురాలు‌, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ద్వారా ఈ వైరస్‌ బైటికొచ్చిందని, అక్కడ భద్రతా లోపాలున్నాయని డోనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌లో ఆరోపించారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు చూపకపోయినా, ''ఈ కథను మేం పదే పదే వింటున్నాం'' అని ట్రంప్‌ అన్నారు.

కరోనావైరస్‌ వూహాన్‌లోనే పుట్టిందని మీరు అంత నమ్మకంగా చెబుతున్నారంటే మీ దగ్గరేమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించగా...''అవును...నా దగ్గర ఆధారాలున్నాయి'' అన్నారు ట్రంప్‌. అయితే తాను మరిన్ని వివరాల్లోకి వెళ్లనని చెప్పారాయన. జనవరి 2018లో అమెరికా అధికారులు లేబొరేటరీని సందర్శించారని, అక్కడి భద్రతా ఏర్పాట్లను అమెరికా ప్రభుత్వానికి నివేదించారని గత నెలలలో వాషింగ్టన్‌పోస్ట్ పత్రిక రాసింది.

మరి నిపుణులు ఏం చెబుతున్నారు?

వైరస్‌ పుట్టుక గురించి అమెరికా చేస్తున్న వాదనలకు ఆధారాలు లేవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ డైరక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ సోమవారంనాడు ప్రకటించారు.''మా దృష్టిలో ఇవన్నీ ఊహాగానాలే '' అన్నారాయన.

ఈ వైరస్‌ మనుషులు తయారు చేసిందో, జన్యుపరంగా మార్పులు చెందిందో చెప్పలేమన్న వాదనతో అమెరికా నిఘావర్గాలు కూడా గతవారం అంగీకరించాయి.

ఈ వైరస్‌ జంతువుల నుంచి వ్యాపించిందా లేక ప్రమాదవశాత్తు ప్రయోగశాల నుంచి బైటికి వచ్చిందా అన్నదానిపై పరిశీలన కొనసాగించాల్సిన అవసరం ఉందని అవి అభిప్రాయపడ్డాయి.

జంతువుల మార్కెట్‌ నుంచి ఈ వైరస్‌ వ్యాప్తి మొదలై ఉండొచ్చని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌ మంగళవారంనాడు వ్యాఖ్యానించారు. అలాగని ఇది లేబోరేటరీ నుంచి వచ్చిందన్న వాదనను కూడా తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించారు.

''ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎలా వచ్చిందన్నదానిపై సరైన రీతిలో, స్వతంత్ర వ్యవస్థలతో విచారణ జరిపించాలి. ఇందులో పారదర్శకత ఉండాలి. అప్పుడే మనం దీన్నుంచి పాఠాలు నేర్చుకుంటాం'' అన్నారు అస్ట్రేలియా ప్రధాని. అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక నిఘా సంస్థలు కూడా, ఈ వైరస్‌ ప్రయోగశాల నుంచి బైటికి వచ్చిందనడానికి సరైన ఆధారాలు లేవంటున్నాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)