భారత్లో 12 ఏళ్లలో రెట్టింపైన పులులు: ఇంతకూ వీటిని ఎలా లెక్కిస్తారు? #TigerDay

ఫొటో సోర్స్, projecttiger.nic.in
భారత్లో పన్నెండేళ్లలో పులుల సంఖ్య రెట్టింపైంది. 2006లో 1,411గా ఉన్న వీటి సంఖ్య 2018లో 2,967కు చేరింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా సోమవారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అఖిల భారత పులుల అంచనా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
2010లో 1,706గా ఉన్న పులుల సంఖ్య 2014 నాటికి 2,226కు చేరింది. గత నాలుగేళ్లలో ఇది ఏడు వందలకు పైగా పెరిగింది. 2014లో అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్లో పులుల సంఖ్య 68 కాగా, 2018 నాటికి ఏపీ, తెలంగాణల్లో కలిపి వీటి సంఖ్య 74కు చేరింది. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నాయి.
దేశంలో ఇప్పుడు సుమారు మూడు వేల పులులు ఉన్నాయని, పులులకు అతిపెద్ద, సురక్షిత నివాస ప్రాంతాల్లో భారత్ ఒకటని ప్రధాని చెప్పారు. ప్రపంచంలోని మొత్తం పులుల్లో దాదాపు 75 శాతం ఒక్క భారత్లోనే ఉన్నాయన్నారు.

ఫొటో సోర్స్, projecttiger.nic.in
పులుల సంఖ్య రెట్టింపు కావడం భారత్కు చరిత్రాత్మక విజయమని, పులుల సంరక్షణ పట్ల భారత్ అంకితభావాన్ని ఇది చాటుతోందని మోదీ చెప్పారు. పులుల సంఖ్యను 2022లోగా రెట్టింపు చేయాలని తొమ్మిదేళ్ల క్రితం సెయింట్ పీటర్స్బర్గ్లో లక్ష్యంగా నిర్ణయించారని, కానీ భారత్ నాలుగేళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని అందుకుందని ఆయన ట్విటర్లో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అభివృద్ధికీ, పర్యావరణానికీ మధ్య ఆరోగ్యకర సమతౌల్యాన్ని తీసుకురావడం సాధ్యమేనని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.
భారత్ నాలుగోళ్లకోసారి పులులను లెక్కిస్తుంది. సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన సాగుతుంది. ఒక అంచనా ప్రకారం- 1875 నుంచి 1925 మధ్య దాదాపు 80 వేల పులులు వేటగాళ్ల వేటు, ఇతర కారణాలతో చనిపోయాయి. 1960ల నాటికి పులుల సంఖ్య భారీగా పడిపోయింది.
వేటపై నిషేధం, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన ఇతర సంరక్షణ చర్యలు పులుల సంఖ్య తిరిగి పెరడగానికి తోడ్పడ్డాయి. ఈ ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నట్లు తొలిసారిగా 2006లో స్పష్టంగా కనిపించింది.
మలం, వెంట్రుకలు, గోళ్లు అన్నీ ఆధారమే
వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి, పులులతోపాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు.
ఐదు పద్ధతుల్లో వీటి గణాంకాలను సేకరిస్తారు. అటవీ సిబ్బంది నడిచే మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే, వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు.

ఫొటో సోర్స్, projecttiger.nic.in
పగ్ మార్క్ విధానంలో అయితే సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు.
మొదట ఒక గాజుపలకపై స్కెచ్ పెన్తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు.
నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్ పౌడర్ చల్లుతారు. తర్వాత రింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని వేస్తారు. 15 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డ కట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది.

ఫొటో సోర్స్, DL Narasimha
పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినదీ నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనే దాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు.
అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి, సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్లోని 'సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)'కి పంపుతారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు.
అడవి జంతువులు చెట్లకు, రాళ్లకు పాదాలను, శరీరాన్ని రుద్దుతుంటాయి. గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు, శరీరంపై దురదను పోగొట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయి. అప్పుడు వాటి వెంట్రుకలు, గోళ్లు ఊడి పడిపోతుంటాయి.
అటవీ సిబ్బంది చెట్లు, రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సంచరించిన జంతువు ఏదో గుర్తించగలుగుతారు. సేకరించిన వెంట్రుకలు, గోళ్లకు డీఎన్ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధరిస్తారు.

ఫొటో సోర్స్, AP Forest Department
2014 నుంచి జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ- ఎన్టీసీఏ) వన్యప్రాణుల లెక్కింపులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను వాడుతోంది.
వీటిని వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో ఎదురెదురుగా చెట్లకు అమరుస్తారు. ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉంచే ఈ కెమెరాలు 24 గంటలూ వాటంతటవే పనిచేస్తాయి. చీకట్లో అయితే ఫ్లాష్ ఉపయోగించి ఫొటోలు తీస్తాయి.
జంతువుల కదలికలు, ఉష్ణోగ్రతల ఆధారంగా కెమెరాలు పని ప్రారంభిస్తాయి. వీటిలో నమోదైన సమాచారాన్ని రోజూ సేకరిస్తారు.
చిత్రాల్లోని జంతువుల ఎత్తు, చారలు, నడకను పరిగణనలోకి తీసుకొని వాటి సంఖ్యను లెక్కగడతారు.
ఇలా వివిధ పద్ధతుల్లో సేకరించిన ఆధారాలను, నివేదికలను ఎన్టీసీఏ అధికారులు ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్లో ఉన్న భారత వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ)కు పంపుతారు.
డబ్ల్యూఐఐ అందించే నివేదిక ఆధారంగా ఎన్టీసీఏ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు పంపుతుంది.
ఇవి కూడా చదవండి:
- కుక్క శరీరంపై కంటే మనిషి గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా
- అమెరికా: జంతువుల ఎక్స్రేలు చూస్తారా..
- రష్యాలోని రెండున్నర కోట్ల ఏళ్ళ నాటి సరస్సును కాపాడాలని డికాప్రియోకు విజ్ఞప్తులు
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- కార్గిల్ స్పెషల్: 'వాళ్లను వదలద్దు...' ప్రాణాలు వదిలేస్తూ కెప్టెన్ మనోజ్ పాండే చెప్పిన చివరి మాట ఇదే
- ఈ యువతి తన ముఖంపై 'పీరియడ్స్ బ్లడ్' ఎందుకు రాసుకుంటున్నారు
- 'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








