తెలంగాణ: కాగజ్‌నగర్లో అటవీశాఖ మహిళా అధికారిపై ఎమ్మెల్యే తమ్ముడి దాడి... ఖండించిన కేటీఆర్

అటవీ అధికారిపై దాడి
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై పాలక టీఆర్ఎస్ పార్టీ నేత కోనేరు కృష్ణారావు దాడి చేశారు.

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సోదరుడైన కృష్ణారావు ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

అటవీ భూముల స్వాధీనం కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై కృష్ణ, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజర్ అనిత తీవ్రంగా గాయపడగా ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు భర్త మాణిక్ రావు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన అనిత

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, తీవ్రంగా గాయపడిన ఫారెస్ట్ అధికారిణి అనిత

అసలేం జరిగింది

కాళేశ్వరంలో అటవీ భూములు మునిగిపోవడంతో వాటి స్థానంలో కొత్త ప్రాంతంలో చెట్లు నాటి మొక్కలు పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది.

ఈ పనికి కాగజ్‌నగర్ ప్రాంతంలోని సార్సాలా అనే గ్రామంలో 20 హెక్టార్ల భూమిని ఎంపిక చేశారు అధికారులు. ఆ భూమిని చదను చేయడానికి ఆదివారం ఉదయం ట్రాక్టర్లతో వెళ్లారు.

అదే సమయంలో స్థానికులు, కోనేరు కృష్ణ ఆ ప్రాంతానికి చేరుకుని సిబ్బంది వెనక్కి వెళ్లాలంటూ దాడికి దిగారు.

కర్రలతో సిబ్బందిని, అధికారులను కొడుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో పోలీసులు ఉన్నా వారిని నిరోధించలేదన్న విమర్శలు వస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అధికారులపై టీఆర్‌ఎస్ నేత దాడి చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన కృష్ణారావు ప్రవర్తనను ఖండించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు. ఆయనను అరెస్ట్ చేసి, కేసు కూడా నమోదు చేశారని కేటీఆర్ ట్వీట్ చేశారు.

అటవీ అధికారిపై దాడి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో అటవీ శాఖ అధికారిణిపై దాడి

ఫారెస్ట్ అధికారులేమంటున్నారు

"ఇవాళ ఉదయం పోలీసులతో కలసి సుమారు 30 మంది డివిజన్ సిబ్బంది స్థలానికి వెళ్లారు. అకస్మాత్తుగా సార్సాలా గ్రామానికి చెందిన వారు గుంపుగా వచ్చారు. బూతులు తిట్టారు. వారు కోనేరు కృష్ణ నాయకత్వంలో మా అధికారి సీహెచ్ అనితపై దాడికి దిగారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించాం. వారు ఇతరులను కొట్టారు. మరో ముగ్గురు మహిళా సిబ్బందికి, ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లకు కూడా గాయాలయ్యాయి. వారికీ చికిత్స జరుగుతోంది. మూడు ట్రాక్టర్లను ధ్వంసం చేశారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. 30 మంది పోలీసులున్నారక్కడ" అంటూ ఘటన జరిగిన తీరును బీబీసీకి వివరించారు కాగజ్ నగర్ డివిజినల్ ఫారెస్ట్ అధికారి రాజా రమణా రెడ్డి.

భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోనేనా?

ఈ ఘటన జరిగిన భూమి కదంబ రిజర్వు ఫారెస్టులో భాగమనీ, సెక్షన్ 15 అటవీ చట్టం కింద నోటిఫై అయి ఉందనీ, అక్కడ ఎవరూ సాగు చేయడం లేదనీ, బహుశా ఆ భూమిని ఆక్రమించుకునే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉండొచ్చనీ రాజా రమణా రెడ్డి అభిప్రాయపడ్డారు.

నిజాయితీతో పనిచేసే అనితపై దాడి జరగడం, అది కూడా అంత మంది పోలీసుల సమక్షంలో జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

దీనిపై రాజా రమణా రెడ్డి ఫిర్యాదుతో ఈజ్గామ్ స్టేషన్లో కేసు నమోదయింది. మొత్తం 16 మందిపై కేసు పెట్టారు.

కృష్ణ రాజీనామా

దాడికి పాల్పడిన కృష్ణ జడ్పీ ఉపాధ్యక్ష పదవికి, జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఆ విషయాన్ని ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మీడియాకు తెలిపారు.

పోడు రైతులపై అటవీ సిబ్బంది జులుంకి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు కృష్ణ తన రాజీనామా లేఖలో రాశారు.

ప్రస్తుతం కృష్ణ, ఆయన అనుచరులు కుమ్రం భీం జిల్లా పోలీసుల అదుపులో ఉన్నారు.

నిరసనలు
నిరసనలు

అటవీ శాఖ అధికారుల నిరసనలు

అటవీ అధికారిణిపై దాడిని ఖండిస్తూ ఆ శాఖ అధికారులు, సిబ్బంది నిరసన తెలుపుతున్నారు.

పెద్ద సంఖ్యలో ఆ శాఖ సిబ్బంది నిరసనల్లో పాల్గొన్నారు.

దాడికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.

మరోవైపు భూముల స్వాధీనానికి వెళ్లిన అధికారులకు రక్షణ కల్పించలేకపోవడంపై కాగజ్‌నగర్ డీఎస్పీ, సీఐలపై సస్పెన్షన్ వేటు పడింది.

అనితపై కేసు

టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడ్డ ఫారెస్ట్ అధికారి అనితపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదయింది.

అనితతో పాటూ మరో 15 మందిపై కేసు నమోదయింది.

అనిత తనను కులం పేరుతో దూషించారంటూ సరోజన అనే గిరిజన మహిళ ఈస్గాం పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు స్థానిక ఇంచార్జి డీఎస్పీ సత్యనారాయణ బీబీసీకి తెలిపారు.

‘‘ఆరోజు దాడి ఘటన జరగడానికి ముందు అనితతో పాటూ మరో 15 మంది అటవీ శాఖాధికారులు తనను కులం పేరుతో దూషించారని సరోజన అనే మహిళ కేసు పెట్టారు. ప్రాథమిక వివరాలు తీసుకున్నాం. లోతుగా దర్యాప్తు చేసి, ఆధారాలు ఉంటే తదుపరి చర్యలు తీసుకుంటాం. మా దగ్గర వీడియో ఫుటేజీ ఉంది దానిని కూడా పరిశీలించాల్సి ఉంది’’ అన్నారు సత్యనారాయణ.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

దాడి ఘటనపై అనిత ఏమన్నారంటే..

అయితే, తనపై దాడి జరిగినందుకు బాధ లేదు, కానీ ఓ యూనిఫాంపై దెబ్బ పడినందుకు బాధగా ఉందని అనిత బీబీసీతో వ్యాఖ్యానించారు.

జులై 7న బీబీసీ న్యూస్ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిత మాట్లాడారు.

"ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా వారికి అనుగుణంగా ఉండాలి, లేదంటే హెచ్చరికలు, బదిలీలు, బెదిరింపులు, ఏదో విధంగా నష్టం కలిగించడం, చివరికి ప్రజలతో దాడులు చేయించడం.. ఇవన్నీ అక్కడ నిత్యం జరిగేవే.

ఏదైనా చిన్న విషయంపై ప్రశ్నించినా రాజకీయ నాయకులకు ఫోన్ చేస్తారు. వాళ్లు మమ్మల్ని అధికారులమని కూడా చూడకుండా, మా యూనిఫాంకు విలువనివ్వకుండా "నువ్వెంత, నీ ఇదెంత" అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతారు. రాజకీయ నాయకులకు ఫోన్ ఇచ్చి తిట్టిస్తారు. ఎమ్మెల్యే ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదు, కానీ ఆయన సోదరుడు కృష్ణ చాలా సార్లు బెదిరించారు.

వారిని ఎదిరించే ధైర్యం ఎవరూ చెయ్యడం లేదు. కేసు పెట్టినా ఒకట్రెండు రోజుల్లో బెయిల్‌పై బయటకొచ్చేస్తారు.

నాపై దాడి జరిగినందుకు బాధ లేదు, కానీ ఓ యూనిఫాంపై దెబ్బ పడింది.

దీనిపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి.

పోడు భూములు, ఆక్రమణల విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. లేదంటే మరో 200 సంవత్సరాలైనా పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇలాంటి ఉద్రిక్తతలు ప్రతి జూన్‌లోనూ జరుగుతూనే ఉంటాయి.

నా ప్రాణం పోతుందని భయం లేదు. కానీ నా కుటుంబం, నా గౌరవం పోతే నేను తట్టుకోలేను.

విధ్వంసం జరిగాక, మళ్లీ అడవులను పెంచాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ముందే స్పృహతో కాపాడుకోవాలి" అని అనిత అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)