కట్ మనీ: నాయకులు తీసుకున్న లంచాలు తిరిగి ఇచ్చేయాలంటూ ప్రజల ఆందోళన

బెంగాల్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తీసుకున్న లంచాల సొమ్ము తిరిగి చెల్లించాలంటూ స్థానికులు తమ నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు

పశ్చిమబెంగాల్‌ ప్రజలు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నిరసనకు దిగుతున్నారు. కారణమేమిటంటే.. నాయకులు తీసుకున్న లంచాలను తిరిగి ఇచ్చేయాలన్నది వారి డిమాండ్.

స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే ఇటీవల తన మంత్రులకు ఒక పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు అందించటం కోసం ప్రజల నుంచి మంత్రులు తీసుకున్న లంచాలను తిరిగి చెల్లించివేయాలన్నది ఆ పిలుపు సారాంశం.

అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడి ఇంటిపై స్థానికులు సోమవారం దాడి కూడా చేశారు. తాము ఇచ్చిన ముడుపులను తిరిగి ఇచ్చేయాలని కోరుతూ వారు ఈ దాడికి దిగారని పోలీసులు చెప్పారు.

ఇప్పుడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

''వాళ్లు డబ్బులు తీసుకున్నారు... బాధితులకు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే. ఈ నాయకులకు మేం గుణపాఠం చెప్తాం'' అని ఒక నిరసనకారుడు ఇండో-ఏసియన్ న్యూస్ సర్వీస్ (ఐఏఎన్ఎస్)తో పేర్కొన్నారు.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ నాయకులు తీసుకున్న ముడుపులు తిరిగి చెల్లించాలంటూ ఇలా నిరసనకు దిగటం అనూహ్యమని బీబీసీ బెంగాలీ ప్రతినిధి అమితాభ భట్టాశాలి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నిరసనలు నిర్వహిస్తున్న వార్తలు ప్రతి రోజూ వస్తున్నాయని చెప్పారు.

మమతాబెనర్జీ తొలుత 2011లో అధికారంలోకి వచ్చారు. అయితే.. ఇటీవలి కాలంలో ఆమె ప్రజాదరణ తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమె ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో అధికార బీజేపీ బెంగాల్‌లో గణనీయమైన విజయం సాధించిన నేపథ్యంలో తాను కోల్పోయిన పట్టును తిరిగి సాధించటానికి మమత తాజా ప్రకటన ఒక ప్రయత్నంగా భావించవచ్చు.

రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో టీఎంసీకి కేవలం 22 సీట్లు మాత్రమే వచ్చాయి. 2014లో ఆ పార్టీ గెలుచుకున్న 32 సీట్ల కన్నా పది సీట్లు తగ్గిపోయాయి. ఈ ఎన్నికల్లో హింస చెలరేగింది. పలువురు రాజకీయ కార్యకర్తలు హత్యకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)