ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా?

పోలింగ్ అమ్మాయిలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇక్బాల్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది.

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలు రావడానికంటే ముందు, జూన్ 1న ఓటింగ్ ముగిసిన వెంటనే, అన్ని పోలింగ్ ఏజెన్సీలు, న్యూస్ చానెళ్లు ఎగ్జిట్ పోల్స్‌ విడుదల చేస్తాయి.

ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఈ ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

2019 లోక్‌సభ ఎన్నికలు, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఫలితాలకు, ఎగ్జిట్ పోల్స్‌కు ఎంత సామీప్యత ఉందో పరిశీలిద్దాం.

ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎగ్జిట్ పోల్ ఎలా సాగుతుంది?

పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు నిర్దిష్టమైన ప్రశ్నలు వేస్తారు. ఇది ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లోనే జరుగుతుంది. ఓటర్లు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎక్కువ మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారో లెక్కగడతారు.

వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఇదే విధంగా సమాచారం సేకరిస్తారు.

ఈ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు.

సర్వేల మెథడాలజీపై సీవోటర్ సంస్థలో అడ్వాన్స్డ్ అనలిటిక్స్ విభాగం ఎడిటర్ మను శర్మ స్పందిస్తూ- దాదాపు అన్నిసంస్థలూ 'రాండమ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్' విధానాన్నే అనుసరిస్తున్నాయన్నారు.

ఈ విధానం ప్రకారం- నిర్దిష్ట నియోజకవర్గం లేదా ప్రాంతంలోని జనాభాను వివిధ అంశాల ప్రాతిపదికగా చిన్న చిన్న గ్రూపులుగా వర్గీకరించుకుని, అందరి ఆలోచనలను ప్రతిబింబించేలా సర్వే నిర్వహిస్తారు.

ప్రధాన ఏజెన్సీలు

భారత్‌లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే కొన్ని ప్రధాన ఏజెన్సీలు సీ-వోటర్, యాక్సిస్ మై ఇండియా, సీఎన్‌ఎక్స్ మొదలైనవి ఉన్నాయి.

ఎన్నికల సమయంలో కొన్ని కొత్త ఏజెన్సీలు కూడా పుట్టుకొస్తాయి. ఎన్నికలు ముగియగానే ఇవి కనుమరుగు అవుతాయి.

ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, Getty Images

ప్రిపోల్, ఎగ్జిట్ పోల్: వ్యత్యాసం

ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) డైరెక్టర్ సంజయ్ కుమార్ బీబీసీకి తెలిపారు.

తాము ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ రెండూ నిర్వహిస్తున్నామని ఆయన లోగడ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా సంస్థలు ఈ సర్వేలు నిర్వహిస్తున్నాయని, వీటి సంఖ్య ఎంతనేది నిర్దిష్టంగా చెప్పలేనని తెలిపారు.

ప్రీ పోల్ సర్వే

ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ప్రిపోల్ సర్వేలు ఏ దశలోనైనా జరగొచ్చు.

  • చట్టసభ గడువు ముగియక ముందు
  • ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు
  • పొత్తులు ఉంటాయో లేదో తేలక ముందు
  • ఎవరు ఎవరితో జట్టు కడుతున్నారో లేదా సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందో స్పష్టం కాకముందు
  • పార్టీలు/కూటములు అభ్యర్థులను ప్రకటించక ముందు
  • పోలింగ్ తేదీకి చాలా ముందు, లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు

కొన్ని సందర్భాల్లో ప్రిపోల్ సర్వేలో పాల్గొన్న ఓటర్లు సర్వే సమయానికి ఇంకా నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు, సందిగ్ధంలో ఉండొచ్చు లేదా వారిలో కొందరు ఓటింగ్‌లో పాల్గొనకపోవచ్చు కూడా.

ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, UGC

ఎగ్జిట్ పోల్స్ సర్వే

ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ రోజే చేపడతారు. ఎగ్జిట్ పోల్‌లో ఓటింగ్‌లో పాల్గొన్నవారినే నిర్వాహకులు ప్రశ్నిస్తారు.

ఏ సమయంలో ప్రశ్నించారు, ఎలా ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఇందులో చాలా కీలకం.

ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు చాలా వరకు ముందే నిర్ణయించుకుంటారు.

రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొంటారు.

సాధారణంగా జనాభాలో ఆయా వర్గాల నిష్పత్తికి అనుగుణంగా వారిని ఎంచుకొంటారు.

కానీ ఎగ్జిట్ పోల్‌లో ఇలాంటి వెసులుబాటు తక్కువని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ భాస్కరరావు అభిప్రాయపడ్డారు.

ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, UGC

కచ్చితత్వం ఎంత?

ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువ.

అయితే "ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం 95 శాతం దగ్గరగా ఉంటే అంచనాల్లో కచ్చితత్వం ఉన్నట్లు భావించవచ్చని, కానీ చాలా సంస్థలు తుది ఫలితాలకు 60 శాతం దగ్గరగా ఉన్నా తమ అంచనాలే నిజమయ్యాయని చెప్పుకొంటున్నాయని" భాస్కరరావు చెప్పారు.

"పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఆయన తెలిపారు.

"కానీ ఈ ప్రక్రియను ఎంత మంది పకడ్బందీగా, విస్తృతంగా చేస్తున్నారన్నది ప్రశ్నార్థకమే" అని భాస్కరరావు అన్నారు.

" సర్వే నిర్వహించిన సమయం, ప్రాంతం, ఓటరు మూడ్‌, శాంపిల్, శాంపిల్ పరిమాణం, ఇతర అంశాలను బట్టి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి" అని ఈ అంశంపై గతంలో బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సామాజికవేత్త, సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ చెప్పారు.

ఎగ్జిట్‌పోల్ అంచనాలు కూడా వాతావరణశాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అన్నారు. ఇవి కొన్నిసార్లు చాలా కచ్చితంగా, కొన్నిసార్లు దగ్గరగా ఉంటాయని, కొన్నిసార్లు ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధమైన ఫలితాలు రావొచ్చని ఆయన చెప్పారు.

ఉదాహరణకు 2004లో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పగా, అందుకు విరుద్ధంగా ఫలితం వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

ఎగ్జిట్ పోల్స్

ఫొటో సోర్స్, INCTELANGANA/FACEBOOK

'మార్జిన్ ఆఫ్ ఎర్రర్' ఎంత?

ఎగ్జిట్ పోల్స్‌లో 'మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌'పై సీవోటర్‌కు చెందిన మను శర్మ మాట్లాడుతూ "ఇది సాధారణంగా ఐదు శాతం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మూడు శాతం కూడా ఉండొచ్చు " అని చెప్పారు.

"అత్యధిక సందర్భాల్లో దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో పార్టీల ఓటింగ్ శాతాలు, సీట్ల సంఖ్యలు వేర్వేరుగా ఉన్నా, అన్నీ ఒకే దిశలో ఉంటాయి" అని ఆయన తెలిపారు.

వేర్వేరుగా ఎందుకుంటాయి?

"అరుదైన సందర్భాల్లోనే వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకే దిశలో కాకుండా, భిన్నంగా ఉంటాయి" అని మను శర్మ తెలిపారు.

ఆయన 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితికి స్థానిక అంశాలు ప్రధాన కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు.

"రెండు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా ఉంటుందని" మను శర్మ చెప్పారు.

ఓటింగ్ శాతంలో వ్యత్యాసం అధికంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం చాలా సులభం అన్నారు.

ఎగ్జిట్ పోల్స్

ఎగ్జిట్స్ పోల్స్ నియమ నిబంధనలు

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 126ఎ ప్రకారం ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహిస్తారు.

భారత్‌లో ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఎన్నికలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదనేది ఈ నిబంధనల ఉద్దేశం.

ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఓటింగ్ జరిగేటప్పుడు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేయకూడదనేది ప్రాథమిక నియయం.

ఎన్నికల ప్రక్రియ మొదలై, ఆఖరి దశ పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్‌లను విడుదల చేయకూడదు. అంతేకాకుండా ఎన్నికల సంఘం అనుమతి పొందిన తర్వాతే సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్స్ పోల్ ఫలితాలను విడుదల చేయాలి.

ఎన్నికల సంఘం

ఫొటో సోర్స్, Getty Images

మొట్టమొదటి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే?

భారత్‌లో రెండో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, 1957లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఓపీనియన్ సంస్థ తొలిసారిగా ఎన్నికల పోల్‌ను నిర్వహించింది.

ఈ సంస్థ అధిపతి ఎరిక్ డీ కాస్టా ఈ ఎన్నికల సర్వేను నిర్వహించారు. అయితే, దీన్ని పూర్తిగా ఎగ్జిట్ పోల్ అని పిలవలేం.

ఆ తర్వాత 1980లో డాక్టర్ ప్రణయ్ రాయ్ తొలిసారిగా ఎగ్జిట్ పోల్ నిర్వహించారు. ఆ 1984 ఎన్నికల్లోనూ ఆయన మళ్లీ ఎగ్జిట్ పోల్ చేపట్టారు.

1996లో దూరదర్శన్ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. జర్నలిస్ట్ నళిన్ సింగ్ ఈ పోల్ చేపట్టారు. అయితే, ఈ డేటాను సేకరించేందుకు సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ స్టడీస్ (సీఎస్‌డీఎస్) ఫీల్డ్ వర్క్ చేసింది.

అప్పటి నుంచి ఈ ట్రెండ్ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అప్పట్లో ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్ రాగా, ప్రస్తుతం డజన్ల కొద్దీ ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి.

ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారా?

భారత్ కంటే ముందు చాలా దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ చేపట్టాయి. అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, దక్షిణాసియా, ఆగ్నేయాసియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు.

అమెరికాలో మొదటి ఎగ్జిట్ పోల్ 1936లో నిర్వహించారు. జార్జ్ గాలప్, క్లాడ్ రాబిన్సన్ అనే ఇద్దరు న్యూయార్క్ నగరంలో నిర్వహించిన ఈ ఎన్నికల సర్వే ద్వారా ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ గెలుస్తారని అంచనా వేశారు.

నిజంగానే రూజ్‌వెల్ట్ ఆ ఎన్నికల్లో గెలిచారు. దీని తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందాయి. 1937లో బ్రిటన్‌లో, 1938లో ఫ్రాన్స్‌లో మొదటి ఎగ్జిట్ పోల్ నిర్వహించారు.

ఎగ్జిట్ పోల్స్

2019 లోక్‌సభ ఎన్నికలు

2019 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకు బీజేపీ, ఎన్డీఏలకు 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి దాదాపు 100 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగానే వాస్తవ ఫలితాలు వచ్చాయి. బీజేపీకి 303 సీట్లు, ఎన్డీయేకు 350 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 52 సీట్లు మాత్రమే వచ్చాయి.

తెలంగాణలో మొత్తం స్థానాలు 119
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో మొత్తం స్థానాలు 119

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

2023 నవంబర్-డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు దాదాపు అన్ని ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కాంగ్రెస్‌కు కనిష్టంగా 49, గరిష్టంగా దాదాపు 80 సీట్లు వస్తాయని అంచనా వేశాయి.

అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో అధికార బీఆర్‌ఎస్ అధికారానికి దూరంగా కనిపించింది. ఫలితం కూడా అలాగే వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)