ఎగ్జిట్ పోల్స్: తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్పై పార్టీల భిన్నవాదనలు, అసలు వీటిని ఎలా నిర్వహిస్తారు, కచ్చితత్వం ఎంత?

ఫొటో సోర్స్, INCTelangana/facebook
- రచయిత, రవిశంకర్ లింగుట్ల
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో 70.6 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేయగా, చాలావరకు కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్నట్లుగా సర్వే ఫలితాలు చెప్తున్నాయి. వీటిపై ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాయి.
మంత్రి కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సంబంధం లేకుండా విజయం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. 2018లో కూడా ఒక్క సంస్థ తప్ప మిగిలినవన్ని తప్పుడు ఫలితాలే చూపాయని అన్నారు.
బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థలకు అందని విధంగా ఉంటాయని చెప్పారు. బీజేపీ విజయం ఖాయమన్నట్లుగా ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
ఇలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? ఎలా నిర్వహిస్తారు? అనే అంశాలపై కొందరు నిపుణులతో బీబీసీ గతంలో మాట్లాడింది.
ఎన్నికల సర్వేలకు అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వాహకులు మొబైల్ ఫోన్, ఇతర సాధనాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. భారత్లో ఓటర్లను చాలా వరకు నేరుగా, క్షేత్రస్థాయిలో కలుస్తారు.
ఎగ్జిట్ పోల్ నిర్వహించే తీరుపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) వ్యవస్థాపక ఛైర్పర్సన్ భాస్కరరావు మాట్లాడుతూ- ''ఇదివరకు డమ్మీ బ్యాలట్ పేపర్ విధానాన్ని అనుసరించేవారు. మీరు ఎవరికి ఓటేశారో డమ్మీ బ్యాలట్ పేపర్పై టిక్ చేసి, దాన్ని బాక్సులో వేయండని ఓటర్లను నిర్వాహకులు కోరేవారు. ఇప్పుడు దాదాపు ఎవ్వరూ ఈ విధానాన్ని అనుసరించడం లేదు'' అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఎగ్జిట్ పోల్ ఎలా సాగుతుంది?
- పోలింగ్ బూత్లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు నిర్దిష్టమైన ప్రశ్నలు వేస్తారు. ఇది ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లోనే జరుగుతుంది.
- ఓటర్లు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎక్కువ మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారో లెక్కగడతారు.
- వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఇదే విధంగా సమాచారం సేకరిస్తారు.
- ఈ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు.

ఫొటో సోర్స్, UGC
సర్వేల మెథడాలజీపై సీవోటర్ సంస్థలో అడ్వాన్స్డ్ అనలిటిక్స్ విభాగం ఎడిటర్ మను శర్మ స్పందిస్తూ- దాదాపు అన్నిసంస్థలూ 'రాండమ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్' విధానాన్నే అనుసరిస్తున్నాయన్నారు. ఈ విధానం ప్రకారం- నిర్దిష్ట నియోజకవర్గం లేదా ప్రాంతంలోని జనాభాను వివిధ అంశాల ప్రాతిపదికగా చిన్న చిన్న గ్రూపులుగా వర్గీకరించుకుని, అందరి ఆలోచనలను ప్రతిబింబించేలా సర్వే నిర్వహిస్తారు.
ప్రిపోల్, ఎగ్జిట్ పోల్: వ్యత్యాసం
ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు.
తాము ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ రెండూ నిర్వహిస్తున్నామని ఆయన లోగడ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా సంస్థలు ఈ సర్వేలు నిర్వహిస్తున్నాయని, వీటి సంఖ్య ఎంతనేది నిర్దిష్టంగా చెప్పలేనని తెలిపారు.

ఫొటో సోర్స్, ugc
ప్రీ పోల్ సర్వే
ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ప్రిపోల్ సర్వేలు ఏ దశలోనైనా జరగొచ్చు.
- చట్టసభ గడువు ముగియక ముందు
- ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు
- పొత్తులు ఉంటాయో లేదో తేలక ముందు
- ఎవరు ఎవరితో జట్టు కడుతున్నారో లేదా సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందో స్పష్టం కాకముందు
- పార్టీలు/కూటములు అభ్యర్థులను ప్రకటించక ముందు
- పోలింగ్ తేదీకి చాలా ముందు, లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు
కొన్ని సందర్భాల్లో ప్రిపోల్ సర్వేలో పాల్గొన్న ఓటర్లు సర్వే సమయానికి ఇంకా నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు, సందిగ్ధంలో ఉండొచ్చు లేదా వారిలో కొందరు ఓటింగ్లో పాల్గొనకపోవచ్చు కూడా.
ఎగ్జిట్ పోల్స్ సర్వే
ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ రోజే చేపడతారు. ఎగ్జిట్ పోల్లో ఓటింగ్లో పాల్గొన్నవారినే నిర్వాహకులు ప్రశ్నిస్తారు.
ఏ సమయంలో ప్రశ్నించారు, ఎలా ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఎగ్జిట్ పోల్లో చాలా కీలకం.
ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు చాలా వరకు ముందే నిర్ణయించుకుంటారు.
రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొంటారు.
సాధారణంగా జనాభాలో ఆయా వర్గాల నిష్పత్తికి అనుగుణంగా వారిని ఎంచుకొంటారు.
కానీ ఎగ్జిట్ పోల్లో ఇలాంటి వెసులుబాటు తక్కువని భాస్కరరావు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, UGC
కచ్చితత్వం ఎంత?
ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువ.
అయితే "ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం 95 శాతం దగ్గరగా ఉంటే అంచనాల్లో కచ్చితత్వం ఉన్నట్లు భావించవచ్చని, కానీ చాలా సంస్థలు తుది ఫలితాలకు 60 శాతం దగ్గరగా ఉన్నా తమ అంచనాలే నిజమయ్యాయని చెప్పుకొంటున్నాయని" భాస్కరరావు చెప్పారు.
"పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఆయతెలిపారు.
"కానీ ఈ ప్రక్రియను ఎంత మంది పకడ్బందీగా, విస్తృతంగా చేస్తున్నారన్నది ప్రశ్నార్థకమే" అని భాస్కరరావు అన్నారు.
ఈ అంశంపై గతంలో బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సామాజికవేత్త, సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ "సర్వే నిర్వహించిన సమయం, ప్రాంతం, ఓటరు మూడ్, శాంపిల్, శాంపిల్ పరిమాణం, ఇతర అంశాలను బట్టి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి" అనారు.
'మార్జిన్ ఆఫ్ ఎర్రర్' ఎంత?
ఎగ్జిట్ పోల్స్లో 'మార్జిన్ ఆఫ్ ఎర్రర్'పై సీవోటర్కు చెందిన మను శర్మ మాట్లాడుతూ "ఇది సాధారణంగా ఐదు శాతం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం మూడు శాతమే ఉంటుంది" అని చెప్పారు.
"అత్యధిక సందర్భాల్లో దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో పార్టీల ఓటింగ్ శాతాలు, సీట్ల సంఖ్యలు వేర్వేరుగా ఉన్నా, అన్నీ ఒకే దిశలో ఉంటాయి" అని ఆయన తెలిపారు.
వేర్వేరుగా ఎందుకుంటాయి?
"అరుదైన సందర్భాల్లోనే వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకే దిశలో కాకుండా, భిన్నంగా ఉంటాయి" అని మను శర్మ తెలిపారు.
ఆయన 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితికి స్థానిక అంశాలు ప్రధాన కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు.
"రెండు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా ఉంటుందని" మను శర్మ చెప్పారు.
ఓటింగ్ శాతంలో వ్యత్యాసం అధికంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం చాలా సులభం అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








